
ఆర్థిక సంఘ నిధులను దారి మళ్లించిన చంద్రబాబు
అరకులోయ టౌన్: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను తల్లికి వందనం పథకానికి దారి మళ్లించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే గ్రామ పంచాయతీల ఖాతాలో ఆ నిధులు జమ చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలకోసం కేంద్రం గ్రామ పంచాయతీ లకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘ నిధులు 446.49 కోట్లు గ్రామ పంచాయతీల ఖాతాలో జమ చేయాలన్నారు. లేకుంటే తాగునీరు, శానిటేషన్, తదితర అభివృద్ధి పనులు గ్రామాల్లో నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ప్రజలకు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు.
పుస్తకావిష్కరణకు తరలిరండి
జిల్లా కేంద్రమైన పాడేరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అధ్యక్షతన జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు తరలిరావాలని ఎమ్మెల్యే మత్స్యలింగం పిలుపు నిచ్చారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలను ఎండకడుతూ జరిగే పుస్కకావిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జిల్లా కార్యవర్గ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తల్లికి వందనం పథకానికి కేటాయింపు
రూ. 446.49 కోట్లు వెంటనే
పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలి
అరకు ఎమ్మెల్యే
రేగం మత్స్యలింగం డిమాండ్