
ఆశలు తీరకుండానే.. అనంతలోకాలకు..
జగదాంబ: విధి వక్రించింది. శనివారం సాయంత్రం కాన్వెంట్ జంక్షన్ వంతెన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నేవీ యువ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. సౌమ్య సతీష్ అసాతి (35), మేఘా రావత్ (30) అనే ఇద్దరు అధికారులు షీలానగర్ నుంచి నగరానికి తమ బైక్పై వస్తుండగా.. కాన్వెంట్ జంక్షన్ వద్ద ఎదురుగా దూసుకొచ్చిన ఆయిల్ ట్యాంకర్ వారి జీవితాలను విషాదంలో ముంచేసింది. ట్యాంకర్ను తప్పించుకునే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి నేరుగా దాని కింద పడింది. నిమిషాల వ్యవధిలోనే వారి కలలు, ఆశలు చిన్నాభిన్నమైపోయాయి. ఈ ప్రమాదంలో వారి శరీరం ఛిద్రమై, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ దృశ్యం చూసిన వారికి గుండె తరుక్కుపోయింది. సమాచారం అందుకున్న హార్బర్ స్టేషన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ సేవలో నిమగ్నమైన యువ అధికారులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేసింది. వారి కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నేవీ
అధికారుల దుర్మరణం