ఆదిలాబాద్టౌన్: పోలీస్శాఖ చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. దీంతో ఆర్నెళ్లలో 30శాతం వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఆర్నెళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతోనే ఇది సాధ్యమైంది. పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారులు, పట్టణ ప్రాంతాల్లోని ప్రమాదకర కూడళ్లు, మలుపులు, గ్రామాల సమీప ప్రాంతాల్లో రాత్రి వేళ వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ మార్కింగ్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెరిగింది. అతివేగాన్ని తగ్గిస్తే ప్రమాదాల సంఖ్య మరింత తగ్గుతుందని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గతంలో పనిచేసిన డీజీపీ జనవరిలో అరైవ్.. అలైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలో 500 రోడ్డు సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేశారు. ఆటో, లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. 13 హాట్స్పాట్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు, రంబుల్స్టిక్లు ఏర్పాటు చేశారు. రెండు చోట్ల ప్రమాదాలకు గురైన కార్లను రోడ్డు పక్కన ప్రదర్శనకు పెట్టారు. పోలీస్ కటౌట్లను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతా ల్లోని యువతకు డ్రైవ్ మేళా నిర్వహించారు. అభయ మై ట్యాక్సీ సేఫ్, యూనిక్ నంబర్లు, మైనర్ డ్రైవింగ్లను అరికట్టేందుకు తల్లి దండ్రులకు కౌన్సెలింగ్, మోడిఫై సైలెన్సర్ల తొలగింపు, జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, పాఠశాలల్లో ఖాకీ కిడ్స్, ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఇ లాఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అతివేగం తగ్గిస్తే.. ప్రమాదాలకు చెక్
రోడ్డు ప్రమాదాల్లో ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా ఉండటమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. ప్రమాదాల నివారణకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అత్యంత ముఖ్యమని ఆ శాఖ భావిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రతిఒక్కరూ తమ ప్రాణా లతో పాటు ఇతరుల ప్రాణాలనూ కాపాడవచ్చని సూచిస్తోంది. పోలీస్శాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలూ సహకరిస్తుండటంతో జిల్లాలో రోడ్డు భద్రతపై సానుకూల వాతావరణం నెలకొంది. మొత్తంగా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారిస్తూ సురక్షిత ప్రయాణం వైపు జిల్లాను నడిపిస్తున్నారు.
నిరంతరం
డ్రంకెన్డ్రైవ్లు
జిల్లావ్యాప్తంగా పోలీసులు నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇదివరకే కొంతమందిని జైలుకు పంపించారు. దీంతో నిబంధనలు పాటించని వాహనదారుల్లో గుబులు మొదలైంది. అలాగే, అతివేగంగా వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. దీంతో వాహనదారుల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్పై అవగాహన
పెరుగుతోంది.


