ఆదిలాబాద్టౌన్: అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గడిచిన వారం రోజుల్లో చోటుచేసుకున్న సైబర్ నేరాల వివరాలను శనివారం వెల్లడించారు. ప్రస్తుతం అనేక రకాలుగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ఈ మేరకు ప్రజలు అప్రమత్తతగా ఉండాలని సూచించారు. బాధితులు మోసానికి గురైన గంటలోపు 1930లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘గోల్డెన్ అవర్‘ లోపు స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్ము తిరిగి రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఓటీపీ ఫ్రాడ్, ఏపీకే ఫైల్స్ ఫ్రాడ్, బిజినెస్ లోన్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్, మనీలాండరింగ్ వంటి వాటితో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి సందేహలున్నా సంబంధిత పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
గంజాయి రహిత జిల్లా లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జి ల్లా పోలీస్ కార్యాలయంలో గత నెల రోజుల్లో నమోదైన గంజాయి కేసుల వివరాలను శని వారం వెల్లడించారు. గత నెలలో 16 కేసులు నమోదు కాగా 28 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే గంజాయికి బానిసైన 14 మందిని కోర్టు ద్వారా 30 రోజులపాటు డి అడిక్షన్ సెంటర్కు తరలించినట్లు తెలిపారు. జిల్లాలో గంజాయిని కనుమరుగు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో 60 మంది సస్పెక్ట్ షీటర్లు, రౌడీ షీటర్ల ను తనిఖీ చేయగా 15 మంది గంజాయి సేవించినట్లు తనిఖీలో తెలిందన్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


