భార్య వెంటే భర్త
● అనారోగ్యంతో వివాహిత మృతి ● ఆమె లేని లోకంలో ఉండలేక భర్త..
దహెగాం: వేద మంత్రాల సాక్షిగా నీ వెంట నేనుంటానని బాస చేసి భార్య మెడలో తాళి కట్టాడు. అనారోగ్యంతో ఆమె చనిపోగా తట్టుకోలేని అతడూ తనువు చాలించాడు. ఈ ఘటన మండలంలోని కమ్మర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కమ్మర్పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్కు మంచిర్యాల జిల్లా గురిజాల గ్రామానికి చెందిన సువర్ణతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్య జీవనం అన్యోన్యంగా సాగుతున్న క్రమంలో సువర్ణ అనారోగ్యానికి గురైంది. ఆమెకు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయంకాలేదు. ఈక్రమంలో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఆమె దహన సంస్కారాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. కాగా, భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన వినోద్ (30) ఒక్కసారిగా సొమ్మిసిల్లి పడిపోయాడు. వెంటనే కుటుంబీకులు బెల్లంపల్లి ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో కమ్మర్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో వారి కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.


