వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి పుష్య అమావాస్య సందర్భంగా ఆదివారం ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు పండితులు ఆలయం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హోమం ప్రారంభించి, ఘనంగా పూర్ణాహుతి గావించారు. అనంతరం, అమ్మవారికి వేదాశీస్సులు సమర్పించి, నివేదనలు చేసి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. రూ.750 టికెట్టుతో 50 మంది భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు.
ఘనంగా సత్యదేవుని రథసేవ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవునికి ఆలయ ప్రాకారంలో ఆదివారం రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. రథంపై వేంచేయించి, అర్చకులు దేవులపల్లి వరప్రసాద్ తదితరులు పూజలు చేశారు. అనంతరం, ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు ఊరేగించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాల (ముత్తంగిసేవ) అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
లోవ దేవస్థానంలో
భక్తుల రద్దీ
తుని రూరల్: లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూలో 12 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఖరీఫ్ పనులు పూర్తి కావడం, సంక్రాంతి పర్వదినాలు ముగియడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చారన్నారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,34,535, పూజా టికెట్లకు రూ.2,25,100, తలనీలాలకు రూ.6,400, వాహన పూజలకు రూ.7,840, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.62,020, విరాళాలు రూ.23,774 కలిపి మొత్తం రూ.4,59,669 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు.
వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం
వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం


