breaking news
the YSR Congress
-
వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేయండి
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ముందుంటుందని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో పార్టీ అధికారంలోకి రాలేకపోయిందన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని కోరారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మిట్టపల్లి రమేష్ శుక్రవారం మ్మెల్యే గోపిరెడ్డిని బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కలిసి పూలదండలు వేసి కృతజ్ఞతలను తెలిపారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని రమేష్కు సూచించారు. రమేష్ మాట్లాడుతూ నమ్మకంతో తనకు పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి, సహకరించిన ఎమ్మెల్యే గోపిరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ నాయకులు కపలవాయి విజయకుమార్, జొన్నలగడ్డ సర్పంచ్ దొండేటి అప్పిరెడ్డి, ఎమ్మెల్యే పట్టణ అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావులు హాజరయ్యారు. పలువురు పార్టీ నాయకులు మిట్టపల్లి రమేష్ను ఆయన స్వగృహంలో కలిసి అభినందించారు. రొంపిచర్ల మండల కన్వీనర్ పిల్లి ఓబుల్రెడ్డి, పట్టణ కార్యదర్శి మద్దిరెడ్డి నరసింహారెడ్డి, సి.వి.రెడ్డి, మూరే రవీంద్రరెడ్డి, ఎన్కె.ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, సురేంద్ర తదితరులు రమేష్ను కలిసిన వారిలో ఉన్నారు. -
వాడీవేడిగా జెడ్పీ సమావేశం
ఎజెండా పత్రాలు ఇవ్వకపోవడంపై సభ్యుల ఆగ్రహం మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రులు ప్రొటోకాల్పై నిలదీసిన వైఎస్సార్ సీపీ ప్రతినిధులు మచిలీపట్నం : జిల్లా పరిషత్ అత్యవసర సర్వసభ్య సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ రఘునందన్రావు పాల్గొన్నారు. కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో పాల్గొనాలని మంత్రి దేవినేని ఉమా సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సమావేశంలో కొద్దిసేపు ప్రసంగించి వెళ్లిపోయారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తమను మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ఏ హక్కుతో హాజరవుతున్నారంటూ కొన్ని మండలాల్లో ప్రశ్నిస్తున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీలు, మంత్రుల పర్యటనల వివరాలు తమకు తెలియజేయకుండానే ముగిస్తున్నారని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ చేసినట్లు చెబుతున్నారని, ఎంతమందికి చేశారు.. ఎంత మొత్తం చేశారు.. నియోజకవర్గాల వారీగా జాబితాలు ఉన్నాయా.. లేవా.. ఈ విషయంపై కలెక్టర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్చేశారు. జిల్లాలో బెల్టుషాపులు యథావిధిగా కొనసాగుతున్నాయని, మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు ఇస్తున్నారని, వీటిని రద్దు చేస్తారా, లేదా.. అని కల్పన నిలదీశారు. అనంతరం గూడూరు మండల పరిషత్ సమావేశంలో వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచిలు, ఎంపీటీసీ సభ్యులను మాట్లాడొద్దని అధికారులే హుకుం జారీ చేస్తున్నారని, ఈ పద్ధతిలో మార్పు రావాలని ఆ పార్టీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అజెండా కాపీలు అందలేదు.. జిల్లా పరిషత్ సమావేశం జరుగుతున్నా ఇంతవరకు సభ్యులకు ఎజెండా కాపీలను ఇవ్వలేదని, తాము ఏ అంశాలపై చర్చించాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించకూడదనే ఈ తరహాగా వ్యవహరిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. సామాజిక పింఛన్ల పంపిణీలోనూ ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో రుణాలు మంజూరు చేసేందుకు అన్ని అనుమతులు ఇచ్చిన లబ్ధిదారులకు కాకుండా వేరే జాబితాలను తయారు చేసి రుణాలు ఇప్పించేందుకు గ్రామకమిటీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక వ్యవహారంపై రగడ భూగర్భ గనుల శాఖపై జరిగిన సమీక్షలో ఇసుక రీచ్లను డ్వాక్రా సంఘాలకు అప్పగించటం, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయాన్ని గండికొట్టడం తదితర అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. గతంలో ఇసుక సీనరేజీ ద్వారా వచ్చే ఆదాయం నేరుగా జిల్లా పరిషత్కు జమ అయ్యేదని, ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలు సడలించి నిధులను తన ఖాతాలో వేసుకుంటోందని, మొక్కుబడిగా క్యూబిక్ మీటరుకు రూ.40లు మాత్రమే ఇస్తోందని తోట్లవల్లూరు ఎంపీపీ కె.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఇసుక రేవులు ఉన్న గ్రామాల పరిధిలో గృహనిర్మాణం కోసం ఎడ్లబండి, ట్రాక్టర్లపై ఇసుక తీసుకువెళుతున్నా పోలీసులు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు వాటిని సీజ్ చేసి రూ. 15వేలు జరిమానా విధిస్తున్నారని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో పాటు పలువురు సభ్యులు పేర్కొన్నారు. అయితే పెద్ద లారీల ద్వారా హైదరాబాదుకు తరలివెళుతున్న ఇసుకను అదుపు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. జిల్లా పరిషత్ సమావేశం జరిగే సమయంలో సభ్యులకు సరైన సమాచారం ఇవ్వటం లేదని, గత సమావేశంలో అడిగిన సమాచారాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యత పెరిగింది : బుద్ధప్రసాద్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం జిల్లా ప్రజలపై బాధ్యత పెరిగిందన్నారు. జిల్లా సరిహద్దులోనే రాజధాని ఏర్పడనున్న సమయంలో మనపై గురుతర బాధ్యత ఉందన్నారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ముందడుగు వేయాలన్నారు. ఇటీవల తాను అమెరికాలో పర్యటించానని, కృష్ణాజిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యానని చెప్పారు. తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారని తెలిపారు. కలెక్టర్ ఈ విషయంపై స్పందించి ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేయటంతోపాటు ఎన్ఆర్ఐలు నగదు పంపేందుకు ప్రభుత్వం ద్వారానే ఒక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేయాలని కోరారు. తొలుత హుదూద్ తుపాను ప్రభావంతో మరణించిన వారు, ఇటీవల షిర్డీ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, ఆయా మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. నూతనంగా 41,814 మందికి పింఛన్లు : ఉమా సమావేశంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో జిల్లాలో 1.18 లక్షల మందికి రూ. 12.31 కోట్లను పింఛన్లుగా అందజేశామన్నారు. తొలుత జిల్లాలో 14వేల మంది పింఛన్లు పొందేందుకు అనర్హులుగా గుర్తించగా, వీటిని పునఃపరిశీలించి 7,936 మందికి పునరుద్ధరించినట్లు తెలిపారు. జిల్లాలో 33,878 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నవంబరులో జరిగే జన్మభూమిలో నూతన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. మండలాల్లో, జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని, అలా చేయని పక్షంలో సంబంధిత శాఖల అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో రెండో పంటకు సాగునీరు విడుదల చేసే విషయమై నవంబరులో సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతిపక్షం నిర్ణయాత్మక పాత్ర పోషించాలి : కొల్లు రవీంద్ర జిల్లా పరిషత్ సమావేశం జరిగే సమయంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ సభ్యులు నిర్ణయాత్మక పాత్రను పోషించాలని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రైతుసాధికార సంస్థను ఏర్పాటు చేసిందని, మొదటి విడతగా రూ. 5వేల కోట్లను విడుదల చేయటం జరిగిందన్నారు. జిల్లాలో వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో నందమూరి తారకరామారావు విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వసతి గృహాలు, ఆస్పత్రులపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ అవసరమన్నారు. బెల్టు షాపులు అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోంటుందని చెప్పారు. -
‘బాక్సైట్’ను కాపాడుకుంటాం
అవసరమైతే ఢిల్లీలో ఉద్యమం ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు పాడేరు : ప్రాణాలు పణంగా పెట్టయినా విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిల్వలను కాపాడుకుంటామని వైఎస్సార్ సీపీ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావు స్పష్టం చేశారు. పర్యావరణ విఘాతంతోపాటు గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థకం చేసే బాక్సైట్ తవ్వకాల జోలికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తే సహించమన్నారు. బాక్సైట్ తవ్వకాలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, దీన్ని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. శనివారం పాడేరులో వీరు విలేకరులతో మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తే ఢిల్లీలోనే పోరాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఏజెన్సీలో గిరిజనులకు మౌలిక సదుపాయాలు సమకూరలేదన్నారు. కనీసం మంచినీటి సౌకర్యం లేదని చెప్పారు. 244 పంచాయతీల్లో 200 పంచాయతీలకు రవాణా సౌకర్యం లేదన్నారు. ఏటా రోడ్ల నిర్మాణానికి కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా గిరిజనులకు నడకే శరణ్యమవుతోందని చెప్పారు. మాచ్ఖండ్, సీలేరు కేంద్రాల ద్వారా 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అనేక గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ పాలకవర్గాన్ని సమావేశపర్చాలి ఐటీడీఏకు వస్తున్న నిధులు, ఏజెన్సీలో చేపడుతున్న గిరిజనాభివృద్ధి కార్యక్రమాలపై జవాబుదారీతనం లోపించిందని ఎమ్మెల్యేలు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం మూడుసార్లే పాలకవర్గ సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి 3 నెలలకోసారి జరగాల్సిన సమావేశాలను నిర్లక్ష్యం చేయడం వల్ల గిరిజనాభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని చెప్పారు. ‘అల్లూరి’ జిల్లా ఏర్పాటుచేయాలి అరకు నియోజకవర్గం పరిధిలోని ఏడు గిరిజన నియోజకవర్గాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం ‘అల్లూరి’ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అప్పుడే ఏజెన్సీ అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీ తరపున ఎన్నికైన ఒకే ఒక్క గిరిజన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వక పోవడంలోనే గిరిజనులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఆరుగురు ఎస్టీ ఎమ్మెల్యేలం సమగ్ర గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు.