breaking news
Yale University scientists
-
మద్యపానం గుట్టు తెలిసింది!
వాషింగ్టన్: మద్యం సేవించడం మంచిదా, కాదా? అన్న అంశాన్ని పక్కన పెడితే మద్యం ప్రియత్వానికి, మానవుల జన్యువులకు విడదీయలేని అవినాభావ సంబంధం ఉందని యేలే యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారానికి 14 యూనిట్లకు మించి మద్యం సేవించే 4, 35,000 మందిని ఎంపిక చేసి, వారి డీఎన్ఏలేని జన్యువులను శాస్త్రవేత్తలు పరీక్షించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం ప్రియులందరిలోనూ 29 రకాల జన్యువులు ఒకే రీతిగా ఉన్నాయని తేలింది, అంటే మద్యం తాగడానికి జన్యువులకు సంబంధం ఉందన్నమాట. (ఇకపై ఫోన్లు పనిచేయవ్... కారణం?) ‘ఆల్కహాల్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్’గా వ్యవహరించే మద్యం ప్రియుల్లో ఉండే జన్యువులు తర్వాత తరానికి కూడా సంక్రమిస్తాయని ఈ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. మద్యం పుచ్చుకుంటే సంతోషకర భావనలను మెదడు పెంచుతుందని భావించి మద్యం పుచ్చుకోవడం, పుచ్చుకున్నాక అలాంటి భావనలు పెరిగాయని విశ్వవించడం వల్ల మనుషులు మద్యానికి అలవాటు పడతారని ఇంతకుముందు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మద్యం గురించి ఆలోచించడం వల్ల మెదడులో ఉత్పత్తయ్యే కొన్ని రసాయనాలు కూడా మద్యం వైపు ఆలోచనలను తీసుకెళుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు మద్యం అలవాటుకు, జన్యువులకు నేరుగా సంబంధం ఉన్న విషయం ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోందని అధ్యయనంలో పాల్గొన్న యూనివర్శిటీ సైకియాట్రీ విభాగంలో అసోసియేట్ రిసర్చ్ సైంటిస్ట్ హాంగ్ ఝౌ చెప్పారు. పర్యావరణ, సామాజిక సంబంధాలు కూడా మద్యం ప్రియత్వానికి దారితీస్తాయని ఆయన తెలిపారు. పబ్లు, బార్లకు సమీపంలో నివసించే వారిలో కూడా తాగాలనే కోరిక అనుకోకుండా పెరుగుతుందని కూడా ఆయన తెలిపారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్పై నిషేధం) -
మొబైల్ డేటాతో ‘కరోనా’ గుర్తింపు!
న్యూయార్క్: మొబైల్ఫోన్ డేటా విశ్లేషణ ద్వారా ప్రజల కదలికలను గుర్తించి తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని రెండు వారాల ముందుగానే గుర్తించవచ్చునని అమెరికాలోని యేల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో చైనాలోని వుహాన్ నుంచి ప్రజలు ఏ రకంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారో పరిశీలించి, ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నికోలస్ క్రిస్టాకిస్ తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణమైతే స్థానికంగా ఉన్న ఆరోగ్య సమస్య కాస్తా ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిపోతుందని నికోలస్ తెలిపారు. జనవరి ఒకటవ తేదీ నుంచి వుహాన్లో లాక్డౌన్ నిబంధనలను విధించినప్పటి జనవరి 24వ తేదీ మధ్యలో కనీసం రెండు గంటల పాటు ఆ మహా నగరంలో గడిపిన వారి వివరాలను తాము సేకరించామని, చైనాలోని 31 ప్రావిన్సుల్లోని కోవిడ్ బాధితుల సమాచారంతో దీని పోల్చి చూశామని నికోలస్ తెలిపారు. ప్రజల కదలికలను సుమారు 94 శాతం వరకూ నిలిపివేసిన క్వారంటైన్ నిబంధనలు వ్యాధి నియంత్రణలో ఎంతో కీలకమయ్యాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రజలు ఎలా ఎక్కడెక్కడకు కదిలారన్నది మొబైల్ఫోన్ డేటా ఆధారంగా గుర్తించడం వల్ల రెండు వారాల ముందుగానే వ్యాధి ఎక్కడెక్కడకు ఎంత మేరకు విస్తరిస్తుందో గుర్తించడం వీలైందని వివరించారు. తాము ఉపయోగించిన మోడల్ ద్వారా కరోనా వంటి మహమ్మారులు ఏఏ నగరాలను తాకే అవకాశముందో కూడా ముందుగా తెలుసుకోవచ్చునని చెప్పారు. సమీప భవిష్యత్తులో కోవిడ్ –19 సామాజిక స్థాయిలో వ్యాపించడం మొదలుపెడితే దాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా కట్టడి చర్యలు సమర్థంగా పనిచేస్తాయని నికోలస్ వివరించారు. చదవండి: ఇటలీ తరహాలో భారత్లో లాక్డౌన్! -
ఎల్లలెరుగని ఎబోలా!
ఆమధ్య పశ్చిమ ఆఫ్రికాలో బయటపడి అందరినీ భీతావహుల్ని చేస్తున్న ఎబోలా వ్యాధి అడ్డూ ఆపూ లేకుండా విస్తరిస్తున్నది. ఇప్పటికి 10,141 కేసులు నమోదుకాగా అందులో 4,922 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. నమోదుకాని కేసుల సంఖ్య అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా గినియా, లైబీరియా, సియెర్రా లియోన్ దేశాలు ఈ వ్యాధితో అల్లాడుతున్నాయి. నిర్ధారిత వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేని ప్రస్తుత స్థితే కొనసాగితే డిసెంబర్కల్లా మరో 10,000మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్న మాట. అంతేకాదు, ఇది యూరప్, అమెరికా, ఇతర దేశాలకు కూడా విస్తరించవచ్చునని వారు అంచనావేస్తున్నారు. యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, లైబీరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్న అంచనాలు ఇంతకన్నా భయంగొలిపేవిగా ఉన్నాయి. డిసెంబర్ మధ్యకల్లా ఒక్క లైబీరియాలోనే 90,000 మంది మరణించే ప్రమాదమున్నదని వారు చెబుతున్నారు. వ్యాధి పుట్టి విస్తరిస్తున్నది ఇప్పటికైతే మారుమూలనున్న నిరుపేద దేశాల్లో గనుక సంపన్న దేశాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయని, మాటలు చెప్పినంత స్థాయిలో వాటి చేతలు ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాధిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వంద కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,000 కోట్లు) అవసరమవుతాయని ఐక్యరాజ్యసమితి వేసిన అంచనాలో ఇంతవరకూ నాలుగో వంతు కూడా సమకూరలేదంటే ఈ ఆరోపణల్లో వాస్తవమున్నదని అనుకోవాల్సి వస్తున్నది. ఒకపక్క ఉగ్రవాదంపై పోరాటమంటూ వేలకోట్ల డాలర్లు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేస్తున్న పాశ్చాత్య దేశాలు అంతకు మించి ఎన్నోరెట్లు ప్రమాదకరమైన ఎబోలాను విస్మరించడం ఆందోళనకరం. డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’గా ప్రకటించిన వ్యాధి విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షంతవ్యంకాని నేరం. ప్రపంచీకరణ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఏ దేశమూ వ్యాధిబారిన పడకుండా... కనీసం దాని ప్రభావమైనా పడకుండా సురక్షితంగా ఉండే అవకాశం లేదు. వ్యాపారం కోసం, బతుకుదెరువు కోసం ఎంతదూరమైనా, ఎక్కడికైనా వెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఎబోలా వ్యాధి విస్తరణకు హద్దులుండవు. భిన్న రంగాలపై అది కలగజేసే ప్రభావమూ ఎక్కువగానే ఉంటుంది. వ్యాధిగ్రస్త దేశాల్లో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) క్షీణ దశలో ఉన్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ దేశాల్లో ఆర్థిక వనరులన్నీ ఎబోలా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రీకరించాల్సివస్తున్నది. అంతేకాదు, సామాన్యులు ఈ వ్యాధిబారిన పడటంవల్ల వారు వేతనాలు కోల్పోవడమే కాదు... ఉత్పాదకత మందగిస్తున్నది. కాఫీ, కోకో, పామాయిల్, రబ్బర్ వంటి ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. నిర్మాణ రంగమైతే పూర్తిగా పడకేసింది. పర్యాటకరంగంపైనే ప్రధానంగా ఆధారపడే దేశాలకు ఈ వ్యాధి వ్యాప్తి శాపంలా మారింది. ఇది కేవలం వ్యాధిగ్రస్త దేశాలకు మాత్రమే పరిమితమయ్యే ఇబ్బంది కాదు. ఆ దేశాలతో ఆర్థికబంధం ఉండే దేశాలన్నిటికీ దీని సెగ తగులుతుంది. వ్యాధిని అరికట్టడానికి చురుగ్గా చర్యలు తీసుకోనట్టయితే విపత్కర పరిణామాలు ఏర్పడటం ఖాయమని ప్రపంచబ్యాంకు తాజాగా హెచ్చరిస్తున్నది. ఇంతటి ప్రాణాంతక వ్యాధి విషయంలో సంపన్న దేశాల నిరాసక్తత కేవలం ఆర్థిక సాయం విషయంలో మాత్రమే కాదు...ఇతరత్రా కూడా కనిపిస్తున్నది. 1976లో ఈ వ్యాధి తొలిసారి బయటపడినప్పుడు అమెరికా, కెనడా వంటి దేశాల్లో పరిశోధనలపై దృష్టిపడింది. ఆ రంగంలో కృషిచేసిన శాస్త్రవేత్తలు దశాబ్దంక్రితం ఎబోలాకు ఔషధాన్ని కనుగొన్నామని, దాన్ని వానరాలపై ప్రయోగించి చూశాక అది వంద శాతం వ్యాధి కారక వైరస్ను అరికట్టగలదని తేలిందని ప్రకటించారు. కానీ, అటు తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ప్రగతీ లేదు. వ్యాధిపై పరిశోధనకయ్యే వ్యయం కంటే మనుషులపై ఔషధాన్ని ప్రయోగించడానికి, అనంతరం దాన్ని ఉత్పత్తి చేయడానికి అనేక రె ట్లు ఎక్కువ ఖర్చవుతుంది. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే వ్యాపార సంస్థలు...వ్యాధి ఆచూకీ కనిపించని పరిస్థితుల్లో ఆ ఔషధంపై భారీయెత్తున ఖర్చుచేయడానికి సుముఖంగా ఉండవు. కనుకనే ప్రాణాంతక ఎబోలా తిరిగి తలెత్తిన సమయానికి ఔషధమే లేకుండా పోయింది. మూడు దేశాల్లోనూ ఆ ఔషధాన్ని వ్యాధిగ్రస్తులపై ప్రయోగించి చూడటానికి ఇంకో నెలన్నర సమయం పడుతుందని, అటు తర్వాత వచ్చే ఏడాది జూన్కల్లా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతున్నది. అయితే, ఈ వ్యాధి విషయంలో కేవలం అల్లోపతి వైద్య విధానంలో మాత్రమేకాక ఇతరత్రా మార్గాల్లో అరికట్టడానికి వీలుంటుందేమో చూడాల్సిన బాధ్యత డబ్ల్యూహెచ్ఓపై ఉన్నది. ఔషధం అందుబాటులోకి రావడానికి ఏడెనిమిది నెలల సమయం పడుతుందని ఆ సంస్థ చెబుతున్నది గనుక ఇది అవసరం. ఎబోలా వ్యాధిని అరికట్టడానికి నిర్దిష్టమైన ఔషధం లేదు గనుక ఆ వ్యాధిగ్రస్తుల్లో కనబడుతున్న భిన్న లక్షణాలకు వేర్వేరు మందులు అందజేస్తున్నారు. ఆ వరసలోనే ఇతరత్రా వైద్య విధానాలను అనుసరించడంలో తప్పేమీలేదు. గతంలో మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, చికున్గున్యావంటివి తలెత్తినప్పుడు హోమియో ఔషధాలను ఉపయోగించి మంచి ఫలితాలు రాబట్టిన సందర్భాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కోణం నుంచి ఎందుకు ఆలోచించలేకపోతున్నదో అర్ధంకాని విషయం. ఎబోలా వైరస్కంటే దాన్ని అరికట్టడంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం, ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించలేని అశక్తత భయంకరమైనవి. ముందు వీటినుంచి విముక్తి సాధిస్తేనే ప్రాణాంతక ఎబోలావంటివి పలాయనం చిత్తగిస్తాయి.