breaking news
Yadavareddy
-
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై ఆ పార్టీ చీఫ్ విప్, మిగతా విప్లు సోమవారం మండలి చైర్మన్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీలుగా ఉన్న యాదవరెడ్డి, రాములు నాయక్, కొండా మురళి, భూపతిరెడ్డిలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేయనుంది. అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నాగర్కర్నూల్కు చెందిన దామోదర్రెడ్డి ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరారు. అయితే చర్యలు తీసుకోవాల్సి వస్తే దామోదర్రెడ్డిపై ముందు తీసుకుంటారా? లేకా ఈ నలుగురిపై తీసుకుంటారా అన్న దానిపై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. -
యాదవరెడ్డిపై వేటు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జోడు పదవులు నిర్వర్తిస్తున్న ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డికి క్రమేణా ఉచ్చు బిగుస్తోంది. కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా చెలామణి అవుతూనే టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆయనపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. పార్టీ విప్ను ధిక్కరించి గులాబీ దళంతో చేతులు కలిపిన యాదవరెడ్డి తీరును జీర్ణించుకోలేని కాంగ్రెస్...ఆయన్ని అనర్హుడిగా ప్రకటింపజేసేందుకు సర్వశక్తులొడ్డుతోంది. ఎమ్మెల్సీగా, జెడ్పీటీసీ(నవాబ్పేట)గా రెండు పదవుల్లో కొనసాగుతున్న యాదవరెడ్డిపై చర్య తీసుకోవాలని శాసనమండలి కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మొదలు సీఎస్, కలెక్టర్లకు జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) మంగళవారం ఫిర్యాదు చేసింది. మండలి దృష్టికి... ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నవాబ్పేట జెడ్పీటీసీ యాదవరెడ్డి వ్యవహారంపై జిల్లా కలెక్టర్ శాసనమండలి దృష్టికి తీసుకెళ్లారు. ్ల పంచాయతీరాజ్ చట్టం-1994 సెక్షన్ 177 (4) కింద జోడు పదవులను నిర్వర్తించడం నిబంధనలకు విరుద్ధం. ఈ సెక్షన్ ప్రకారం జెడ్పీటీసీగా ప్రమాణం చేసిన అనంతరం పక్షం రోజుల్లో ఏదేనీ ఒక పదవికి యాదవరెడ్డి రాజీనామా చేయాల్సివుంది. అయితే ఆయన మాత్రం ఇప్పటి వరకూ ఏ పదవిని విడిచిపెట్టకుండా అటు ఎమ్మెల్సీగా, ఇటు జెడ్సీటీసీగా కొనసాగుతున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ మంగళవారం శాసనమండలి కార్యదర్శికి లేఖ రాశారు. ఇదిలావుండగా, యాదవరెడ్డి తోపాటుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించిన జడ్పీటీసీ ముంగి జ్యోతి(రాజేంద్రనగర్)లపై చర్య తీసుకునే విషయంలో కలెక్టర్ న్యాయసలహా కోరారు. అయితే ఒకవేళ యాదవరెడ్డిపై జోడుపదవుల వేటు పడే పక్షంలో ఆయన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
నువ్వా నేనా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రోజుకో మలుపుతో జిల్లా పరిషత్ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి గులాబీ గూటికి చేరడం జిల్లా రాజకీయాల్లో సరికొత్త మార్పులకు దారితీస్తోంది. జెడ్పీ సారథి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనూహ్యంగా యాదవరెడ్డి ప్రత్యర్థి పంచన చేరడం కాంగ్రెస్ను ఆందోళనకు గురిచేస్తోంది. యాదవరెడ్డి కారెక్కడం ఖాయమని ముందే ఊహించిన ఆ పార్టీ న ష్టనివారణ చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ జెడ్పీటీసీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీ మద్దతుతో ఎలాగైనా జిల్లా పరిషత్ను వశం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్.. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావుతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పదవీకాలం పంచుకునే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. పోటాపోటీ! జిల్లా పరిషత్లో 33 జెడ్పీటీసీలకుగాను టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 14, టీడీపీకి ఏడు స్థానాలున్నాయి. నవాబుపేట జెడ్పీటీసీగా గెలుపొందిన యాదవరెడ్డి టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన బుధవారం మండలి చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేశారు. దీంతో జిల్లా పరిషత్లోనూ ఆ పార్టీకి మద్దతు పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన టీఆర్ఎస్కు అండగా నిలిస్తే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ల బలం సమం అవుతుంది. చైర్మన్ ఎన్నిక లో తటస్థంగా ఉన్నా కాంగ్రెస్కు నష్టమే. టీఆర్ఎస్కంటే ఇప్పుడు రెండు సీట్లు అధికంగా ఉన్న ఆ పార్టీకి ఒక సీటు తగ్గిపోతుంది. యాదవరెడ్డి జెడ్పీలో ఓటు హక్కు వినియోగించుకున్నా ఆయన పదవికి ఎలాంటి ముప్పు ఉండదు. ఓటేసిన తర్వాత రెండింటిలో ఏదో ఒక పదవికి రాజీనామా చేస్తే సరిపోతుంది. జెడ్పీ కుర్చీని గెలుచుకోవాలంటే 17మంది సభ్యుల బలం అవసరం. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలకుటీడీపీ మద్దతు తప్పనిసరి. ఏడు జెడ్పీటీసీలున్న ‘దేశం’ ఇదే అదనుగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో మద్దతుపై దోబూచులాడుతోంది. స్పష్టమైన అధిక్యతలేకున్నా.. కుర్చీ మాదేనని మొదట్నుంచి ధీమాతో ఉన్న గులాబీ శిబిరం తాజా పరిణామాలతో మరింత హుషారుగా కనిపిస్తోంది. ఏకంగా చైర్మన్ అభ్యర్థినే తమవైపు తిప్పుకోవడం ద్వారా కాంగ్రెస్ను నిర్వీర్యం చేశామని భావి స్తున్న ఆ పార్టీ.. మరో ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల మద్దతును కూడగట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా మంత్రి మహేందర్రెడ్డి బుధవారం టీడీపీ ఎమ్మెల్యేతో కూడా మద్దతు సమీకరణపై సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఎవరివైపో రేపు తేలుస్తాం! జెడ్పీలో కీలకంగా మారిన టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బుధవారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరుపై చర్చించారు. ఈ నేపథ్యంలో జెడ్పీ ఎన్నికలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై శుక్రవారం చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిద్దామని స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశానికి హాజరైన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మద్దతు ఇద్దామని ప్రతిపాదించగా, ఒక ఎమ్మెల్యే మాత్రం అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు అండగా నిలిచే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు వద్ద అన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.