womens Bill
-
దక్షిణాది ప్రాతినిధ్యానికి కోత దేశద్రోహమే: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేవలం అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ నిజానికి దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్ర. ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’’అంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగ (131వ) సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ సుదీర్ఘంగా మాట్లాడారు. సవరణ బిల్లును ‘చాలా ప్రమాదకరమైనది’గా అభివర్ణించారు. ‘‘మోదీ సర్కారు పూనుకున్న ఈ దేశ వ్యతిరేక చర్యకు విపక్షాలు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. సవరణ బిల్లును ఓడించి తీరతాయి’’అని పేర్కొన్నారు. అది ఆమోదం పొందదని బీజేపీకి కూడా తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ తీరును ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఎండగట్టారు. దళితులు, ఓబీసీలకు అన్యాయం కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని రాహుల్ కొట్టిపారేశారు. ‘‘నిజమైన మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని పదేళ్ల తర్వాత అమలు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇది కేవలం మహిళల మాటున దాక్కుని దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు చేసిన సిగ్గుమాలిన చర్య! జమ్మూకశ్మీర్లో, అస్సాంలో బీజేపీ ఇదే పని చేసింది. దాన్నిప్పుడు దేశమంతటా అమలు చేసే పనిలో పడింది. వారికి దమ్ముంటే పాత బిల్లును ఇప్పుడే తేవాలి. దాన్ని ఈ క్షణం నుంచే అమలు చేసేలా విపక్షాలన్నీ మద్దతిస్తాయి’’అని సవాలు చేశారు. ఓబీసీలు, దళితులకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా వారిని అధికారానికి దూరం చేయడమే బీజేపీ ఉద్దేశమని రాహుల్ ఆరోపించారు. అందుకే కులగణనకు ముందే హడావుడిగా బిల్లు తెచ్చిందని ఆక్షేపించారు. ‘‘బీజేపీ నేతలు ఓబీసీలను, దళితులను హిందువులని పిలుస్తారు. కానీ దేశ అధికార నిర్మాణంలో వారికి కనీస స్థానమివ్వరు! కార్పొరేట్ రంగంలో, న్యాయవ్యవస్థలో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మీడియాలో దళితులు, ఓబీసీలు ఎక్కడున్నారు?’’అంటూ నిలదీశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ’మనువాదాన్ని’తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది, ఈశాన్య ప్రజలకు అండగా కాంగ్రెస్ దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని రాహుల్ అన్నారు. ‘‘అక్కడి సోదరసోదరీమణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత సమాఖ్యలో మీరంతా సమాన భాగస్వాములే. లోక్సభలో మీ ప్రాతినిధ్యాన్ని తాకే సాహసం చేయడానికి బీజేపీని అనుమతించబోం’’అని చెప్పారు. ‘‘గతంలో ఇందిరాగాం«దీ, వాజ్పేయి వంటి ప్రధానులు కూడా డీలిమిటేషన్ సవాలును ఎదుర్కొన్నారు. కానీ దానివల్ల దేశానికి జరిగే ప్రమాదాన్ని గుర్తించి వెనక్కి తగ్గారు’’అని ఆయన గుర్తు చేశారు. ‘16’లోనే అంతా దాగుంది! ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఒక పజిల్ ఇచ్చారు. ‘‘నిన్న లోక్సభలో ప్రధాని ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించా. ఆయనలో ఉత్సాహమే లేదు. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కాదని ఆయనకు తెలుసు. అంతలో తేదీ చూసి ఆశ్చర్యపోయా! అది ఏప్రిల్ ‘16’. అసలు మర్మమంతా అందులోనే దాగుంది! మీ సమస్యలన్నింటికీ సమాధానం ‘16’లోనే దొరుకుతుంది. అదేమిటో ఎవరికైనా అర్థమైతే ఎక్స్లో నాకు మెసేజ్ చేయండి’’అంటూ సభికుల్లో ఆసక్తి రేకెత్తించారు. మోదీ ఓ మాంత్రికుడు! ప్రధాని మోదీపై లోక్సభలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనను బాలకోట్, సిందూర్, పెద్ద నోట్ల రద్దు మాంత్రికునిగా అభివర్ణించి సభలో కలకలం రేపారు. ‘‘ఒక బడా వ్యాపారవేత్తతో మోదీ కుమ్మక్కయ్యారు. ఈ మాంత్రికుని చరిత్ర, ప్రధాని అయ్యేదాకా జరిగిన ప్రతి విషయమూ ఆ బడా వ్యాపారవేత్తకు పూర్తిగా తెలుసు. ఆ రహస్యాల సాయంతోనే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కూడా ప్రధానిగా మోదీ రాజీ పడటం వల్లే జరిగాయి’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. అభ్యంతరకర పదాలు వాడినందుకు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రులు రాజ్నాథ్సింగ్, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. బాలాకోట్, సిందూర్ ప్రస్తావనతో సాయుధ దళాలను రాహుల్ అవమానించారని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మోదీకి, నాకు భార్య బాదరబందీ లేదు లోక్సభలో నవ్వులు పూయించిన రాహుల్ మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీని, తనను ఉద్దేశించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరికీ భార్య తాలూకు బాదరబందీ లేదంటూ సభలో నవ్వులు పూయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన సరదా వ్యాఖ్యలు ఇందుకు నేపథ్యమయ్యాయి. ‘‘కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ ఆయన భార్యపై అందమైన కవిత అల్లారు. దాంతో నా భార్య తనకోసం నేనలా కవిత చెప్పలేదని నాపై అలిగింది’’అని రిజిజు చెప్పుకొచ్చారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ‘‘జాతి నిర్మాణంలో మహిళలే ప్రధాన చోదక శక్తి. మగవాళ్లను వాళ్లెంతగానో ప్రభావితం చేస్తారు. తల్లి, సోదరి, భార్య నుంచి ఎంతో నేర్చుకుంటాం. అయితే ప్రధానికి, నాకు భార్య బాదరబందీ లేదనుకోండీ! కాకపోతే తల్లి, సోదరి ఉన్నారు’’అనడంతో సభికులంతా గొల్లున నవ్వారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైనా ఈ సందర్భంగా రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘గురువారం సభలో నా సోదరి ప్రియాంక గొప్పగా ప్రసంగించింది. ఆ క్రమంలో 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేని దాన్ని తను కేవలం ఐదే నిమిషాల్లో చేసి చూపించింది. అదేమిటో తెలుసా? అమిత్ షాను నవ్వించడం!’’అనడంతో సభంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయింది. ఏమిటా ‘16 పజిల్’? లోక్సభలో ప్రసంగం సందర్భంగా రాహుల్ పేర్కొన్న ‘16 పజిల్’ఏమై ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు మర్మమంతా 16 సంఖ్యలోనే దాగుందని, అదేమిటో ఎవరికైనా అర్థమైతే చెప్పాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు తెర తీశాయి. బహుశా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 16 మంది టీడీపీ లోక్సభ సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారన్నది ఆయన ఉద్దేశం కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. 16 సంఖ్య ‘ఎప్స్టీన్’లా ధ్వనిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేసింది. తద్వారా, ఆ సెక్స్ కుంభకోణానికి సంబంధించి విడుదలైన 16 నిమిషాల వీడియో టేప్ను ఉద్దేశించి రాహుల్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని సంకేతమిచ్చింది. -
బిల్లుకు మద్దతితివ్వకుంటే చరిత్రహీనులు: బండి సంజయ్
కేంద్రప్రభుత్వం తీసుకవచ్చిన మహిళా బిల్లును అడ్డుకంటే చరిత్ర హీనులవుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని.. మహిళల ప్రాతినిథ్యం పెరగాల్సిందేనన్నారు.అయితే అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని కోరారు. కాగా ఈ నెల 16,17,18 తేదీలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ ఎంపీలకు త్రీ-లైన్-విఫ్ జారీ చేసింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపింది. -
ఉమెన్కు పవర్ పరిమితమే
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇలా.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 మంది మహిళలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారిలో కాంగ్రెస్ నుంచి జె.గీతారెడ్డి, డీకే అరుణ విజయం సాధించగా టీఆర్ఎస్ నుంచి అజ్మీరా రేఖ, బొడిగె శోభ, గొంగిడి సునీత, కొండా సురేఖ, కోవా లక్ష్మి, పద్మాదేవేందర్రెడ్డి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సీతక్క (అనసూయ), సబితారెడ్డి, బానోత్ హరిప్రియ గెలుపొందగా, టీఆర్ఎస్ నుంచి అజ్మీరా రేఖ, గొంగిడి సునీత, పద్మాదేవేందర్రెడ్డి విజయం సాధించారు. సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో సగభాగం అంటూ మహిళలను పొగడటం తప్ప అవకాశాలపరంగా వెనుకబాటులో ఉన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు దాదాపు 71 ఏళ్ల కాలంలో మహిళలు ప్రాతినిధ్యం వహించని అసెంబ్లీ నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. 1952లో అసెంబ్లీ ఎన్నికలు మొదలు 2018 ఎన్నికల వరకు రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళల ప్రాతినిధ్యం పరిశీలిస్తే కేవలం 51 సెగ్మెంట్లలోనే అడపాదడపా కనిపించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 70 స్థానాల్లో ఇప్పటివరకు మహిళల ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు బరిలోకి దిగిన సందర్భాలు అత్యంత పరిమితంగానే ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లతోనే.. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. తాజాగా మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనేది ఈ చట్టం సారాంశం. అన్ని స్ధానాల్లో మహిళలకు అవకాశం లభించేలా రొటేషన్ పద్ధతిని ఈ చట్టంలో పొందుపరిచారు. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో సగానికిపైగా అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు ఇప్పటివరకు అవకాశం దక్కకపోగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో మహిళా రిజర్వేషన్లు అమలైతే వారి ప్రాతినిధ్యం అమాంతం పెరగనుంది. ఒక్కసారి కూడా మహిళా ప్రాతినిధ్యం లేని స్థానాలు..: చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్, బోధన్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, వేములవాడ, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్, సిద్దిపేట, నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, తాండూరు, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చారి్మనార్, చాంద్రాయణగుట్ట, యాఖుత్పుర, కొడంగల్, నారాయణపేట్, మహబూబ్నగర్, జడ్చర్ల, నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, సూర్యాపేట, మునుగోడు, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వర్దన్నపేట, భూపాలపల్లి, పినపాక, పాలేరు, మంథని, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, సనత్నగర్, బహదుర్పురా. తొలి ఓటరు రంభాబాయి కాగజ్నగర్ రూరల్: కుమురం భీం జిల్లా సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాగజ్నగర్ మండలం మాలిని గ్రామ పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్రంలో మొదటి పోలింగ్ కేంద్రంగా గుర్తించారు. ఫలితంగా ఈ గ్రామానికి చెందిన ఆత్రం రంభాబాయికి తొలి ఓటరుగా అవకాశం దక్కింది. గతంలో సుర్పం మారుబాయి తొలి ఓటరుగా ఉండగా, ఇటీవల ఎన్నికల అధికారులు ఇంటి నంబరు ఆధారంగా ఓటరు జాబితాను సవరించగా రంభాబాయి రాష్ట్రంలో తొలి ఓటరుగా మారారు. ఈ పోలింగ్ కేంద్రంలో 430 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 208, మహిళలు 222 మంది ఉన్నారు. మాలిని పోలింగ్ కేంద్రం కాగజ్నగర్కు 45 కిలోమీటర్ల దూరంలో గుట్టల మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే సిర్పూర్(టీ) మండల కేంద్రం నుంచి చీలపెల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సమస్యలతో సతమతం ..: మాలినిగ్రామానికి సరైన రోడ్డు లేదు. రాళ్లురప్పలతో కంకర తేలిన రోడ్డు ఉండడంతో జనం అవస్థలకు గురవుతున్నారు. సిర్పూర్(టీ) నుంచి మాలిని గ్రామానికి వెళ్లే మార్గమధ్యంలో రెండు ఒర్రెలపై కల్వర్టులు లేకపోవడంతో వర్షాకాలంలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి.. మిషన్ భగీరథ పైపులు వేసినప్పటికీ నల్లాల్లో నీరు రావడం లేదు. గ్రామంలోని చేదబావికి మోటార్లు బిగించుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. అడవి మధ్యలో ఉన్న ఈ గ్రామంలో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ఫోన్లు కూడా పనిచేయవు. ప్రతీసారి ఓటు వేస్తున్నా... నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి వినియోగించుకుంటున్నా. రాష్ట్రంలో తొలి ఓటరుగా చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. అయితే మా ఊరిలో కనీస సౌకర్యాలు లేక బాధపడుతున్నాం. అధికారులు, నాయకులు పట్టించుకుని సౌకర్యాలు కల్పించాలి. – రంభాబాయి, మాలిని -
నన్నెవరూ ఆపలేరు
సాక్షి, హైదరాబాద్: ‘గవర్నర్గా రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో మహిళా మంత్రులెవరూ లేరు. కానీ ఉదయం గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసి సాయంత్రం ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణం చేయించడం సంతోషకరంగా భావించా’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం కోటా కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెచ్చినందుకు కృతజ్ఞతగా శనివారం రాజ్భవన్లో వివిధ రంగాల మహిళా ప్రముఖులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వెన్ను చూపితే ఇంకా వేగం పెంచుతా... ‘ఏదైనా అడ్డంకులొస్తే భావోద్వేగానికి గురై పనిచేయడం మానేసే అలవాటును మహిళలు వీడాలని గవర్నర్ తమిళిసై సూచించారు. గౌరవం లభించినా, లభించకపోయినా ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వంతో తన ప్రొటోకాల్ వివాదాన్ని మళ్లీ ప్రస్తావించారు. ‘ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ధైర్యంగా పని చేసుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. మీరొచ్చి నాకు పుష్పాన్ని ఇస్తే స్వీకరిస్తా. వెన్ను చూపిస్తే మాత్రం ఇంకా వేగంతో ముందుకుపోతా. దారిలో ముళ్లుంటే తీసి పడేసి ముందుకు సాగుతా. నాపై రాళ్లు రువ్వితే వాటితోనే కోటను నిర్మించుకుంటా. నన్ను పిన్నులతో గుచ్చినా వచ్చే ఆ రక్తంతోనే నా జీవిత చరిత్ర రాసుకుంటా. నన్ను ఎవరూ ఆపలేరు. నియంత్రించలేరు. విమర్శలు, అవమానాలను పట్టించుకోను. ఇదే నా సందేశం’అని గవర్నర్ తమిళిసై అన్నారు. బీజేపీలో నాడే 33% మహిళా కోటా.. బీజేపీలో మహిళా కోటాను అమలు చేయడంతో చాలా మంది ప్రతిభావంతులైన మహిళలు ఆ పార్టీలో చేరారని గవర్నర్ తమిళిసై అన్నారు. తాను గతంలో బీజేపీలో పనిచేసిన విషయం అందరికీ తెలుసని, ఈ విషయాన్ని దాచుకోనని చెప్పారు. ఇప్పుడు పరిపాలనపరమైన పదవికి మారానని గుర్తుచేశారు. నాటి బీజేపీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ పార్టీ పదవుల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించి పార్టీ శాసనాన్ని ఆ మేరకు సవరించారని తెలిపారు. దీంతో చాలా మంది మహిళలు బీజేపీలో చేరారన్నారు. మహిళా రిజర్వేషన్లతో ఇకపై మహిళలూ రాజకీయాల్లో వచ్చేందుకు ఉత్సాహం లభిస్తుందన్నారు. ఈస్ట్రోజన్ (మహిళల హార్మోన్లు) చాలా శక్తివంతమైనదని, మహిళలు గొప్ప పాలనాదక్షులు అని తెలిపారు. రిజర్వేషన్లు 33 శాతమే కావచ్చని, 50% అవకాశాల కోసం కష్టపడాలని సూచించారు. రిజర్వేషన్లు బినామీలు, భార్యల కోసం కాదు ప్రధాని మోదీ బలమైన నాయకత్వంతోనే మహిళా రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని, ఇవి సమాజానికి ఉపయోగపడాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. బినామీలు, కుమార్తెలు, భార్యలు, తల్లులను రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం రిజర్వేషన్లను వాడకూడదని కోరారు. తాను రాజకీయ నేత కుమార్తె అయినప్పటికీ ఎన్నడూ ఆ కార్డును వాడుకోలేదన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి పైకి వచ్చినట్లు చెప్పారు. మహిళల చేతిలోకి పాలన వస్తే పేదరికం, అనారోగ్యం కనుమరుగు అవుతాయన్నారు. మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహిళా బిల్లుకు ఆమోదం తెలపడం గొప్ప విషయమన్నారు. రాజకీయాల్లో మహిళలు పురుషుల కంటే 10–20 రేట్లు ఎక్కువగా పనిచేస్తేనే పదవుల కోసం కేవలం పేర్లను పరిశీలిస్తారని, ఇస్తారో లేదో గ్యారెంటీ లేదని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు 50 రేట్లు అధికంగా పనిచేయాల్సి ఉంటుందనేది తన అభిప్రాయమన్నారు. -
అమరవీరుల స్తూపం నుంచి బీజేపీ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ గన్పార్క్లోని అమరవీరుల స్తూపం నుంచి నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాల యం వరకు ర్యాలీ జరిపారు. మొదటగా అమరవీరులకు నివాళులర్పించి, పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్కుమార్, చింతల రామచంద్రారెడ్డి, సినీనటి జయసుధ, ఆకుల విజయ, బండా కార్తీకరెడ్డి, రాణీరుద్రమ ఇతర నాయకులు, కార్యకర్తలు వెంటనడిచారు. ఈ సందర్భంగా ఎటు చూసినా కాషాయ జెండా పట్టుకుని జయహో మోదీ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం చరిత్రాత్మక సందర్భమని కిషన్రెడ్డి అన్నారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పార్లమెంటులో అనేకమార్లు చర్చ జరిగినప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకోలేదన్నారు. ‘సుమారు 50 శాతం మంది మహిళలున్న తెలంగాణలో.. తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్.. తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఏకైక పార్టీ మజ్లిస్. కేసీఆర్ గురువు అసదుద్దీన్ ఓవైసీ. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎంతో అంటకాగుతున్న కేసీఆర్.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. -
కవితకు దీక్ష చేసే అర్హత లేదు
సాక్షి, హైదరాబాద్: ‘‘సీఎం కేసీఆర్ బిడ్డ కవితకు మహిళా బిల్లుపై ఢిల్లీలో దీక్ష చేసే అర్హత, మాట్లాడే నైతికహక్కు లేవు. రాష్ట్రంలో మహిళల సమస్యలు, వారిపై సాగుతున్న అఘాయిత్యాలు, అన్యాయంపై కవిత ఏనాడూ నోరు మెదపలేదు. రాష్ట్రంలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొదట కవిత తన తండ్రి ఇంటి ఎదుట ధర్నా చేసి మహిళలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించడం లేదేమని నిలదీస్తే బాగుండేది’’అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘మహిళా గోస– బీజేపీ భరోసా’పేరిట పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పలువురు మహిళా నేతలు నిరసన దీక్ష నిర్వహించారు. బండి సంజయ్ ఈ దీక్షలో పాల్గొని మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా, దీనిపై ఎందుకు స్పందించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంటే ప్రజాసమస్యలపై పోరాడుతున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎంల జెండాలను చూస్తేనే మహిళలు భయపడే పరిస్థితి నెలకొందని బండి సంజయ్ విమర్శించారు. గతంలో మహిళా బిల్లు ప్రతులను పార్లమెంటులోనే చించి పడేసిన ఎస్పీ, ఆర్జేడీ, ఎంఐఎంలతో బీఆర్ఎస్ అంటకాగుతూ దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మరి ఈ కేసులు బీఆర్ఎస్ పెట్టించినవా?: కె.లక్ష్మణ్ సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని కేటీఆర్ అంటున్నారని.. మరి రాష్ట్ర పోలీస్, ఏసీబీ పెట్టిన కేసులన్నీ బీఆర్ఎస్ పెట్టించినవేనా? అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో మద్యం ఆదాయ మార్గంగా మారి ఢిల్లీ నుంచి పంజాబ్ దాకా పాకిందని విమర్శించారు. లిక్కర్ స్కామ్పై కాంగ్రెస్ మాట్లాడదేం?: డీకే అరుణ ఢిల్లీ లిక్కర్ స్కామ్పై కాంగ్రెస్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఈడీ కేసులకు, కవిత ధర్నాకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానిస్తుంటే.. మహిళా ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ దీక్షలో పార్టీ నేతలు జి.ప్రేమేందర్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఆకుల విజయ, డాక్టర్ పద్మ, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, సులోచన, గీతారాణి తదితరులు పాల్గొన్నారు. కాగా మహిళా దీక్ష సందర్భంగా బండి సంజయ్, డీకే అరుణలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి అభినందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం అభినందనీయమన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘సీఎం నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశం సంతాప సభను తలపించింది. ఆయన ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్బౌల్డ్ అయింది. తప్పు చేసినోళ్ల సంగతి తేలుస్తాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది మరో మూడు, నాలుగు నెలలేనని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని పేర్కొన్నారు. టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. -
ఉద్యోగాల్లో దక్కని సమభాగం
ఆకాశంలో సగం వాళ్లు. అయినా, అవకాశాల్లో సమభాగం దొరకడమే లేదు. చట్టసభల్లో మహిళా బిల్లుకు ఇప్పటికీ మోక్షం దక్కడం లేదు. ఇన్ని ప్రతికూలతల నడుమ వారిది ఎడతెగని ఎదురీత. నచ్చిన రంగంలోకి అడుగుపెట్టాలంటే అష్టకష్టాలు అనివార్యం. అడుగుపెట్టాక అందులో కొనసాగాలంటే అడుగడుగునా అగ్నిపరీక్షలే! ఐటీ రంగంలో మహిళల నియామకాలు పెరుగుతున్నాయి. ఇదొక ఊరట. కేవలం ఒక్కరంగంలో సానుకూలత ఉన్నంత మాత్రాన సరిపోదు కదా! మిగిలిన రంగాల్లోని ఉద్యోగాల మాటేమిటి ఇబ్బందికరమైన పనివేళలు... పనిప్రదేశాల్లో వేధింపులు... ఎదుగుదలకు అడ్డంకిగా మారే లింగవివక్ష... ఇలాంటి పరిస్థితుల్లో కడవరకు కొనసాగుతున్న వారు కొద్దిమందే.. వేధింపులను తట్టుకోలేక కొందరు... వివక్షపై విరక్తి చెంది ఇంకొందరు... ఉద్యోగాలను వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇదీ మన పరిస్థితి ప్రపంచదేశాలతో పోల్చుకుంటే కార్పొరేట్ రంగంలో మహిళల భాగస్వామ్యం భారత్లోనే అతి తక్కువ. మన దేశంలో కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మహిళలు 23 శాతం మాత్రమే. కార్పొరేట్ రంగంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడంలో అమెరికా 52 శాతం మహిళా ప్రాతినిధ్యంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్ (48 శాతం), కెనడా (46 శాతం), ఫిన్లాండ్ (44 శాతం) ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించిన ఈ లెక్కల ప్రకారం మన దేశం అట్టడుగు స్థానంలో ఉండటం శోచనీయం. మనదేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఐటీ రంగంలో మహిళల నియామకాలు ఇటీవలి కాలంలో గణనీయంగానే పుంజుకుంటున్నాయి. అయితే, ఉద్యోగాల్లో దీర్ఘకాలం కొనసాగేందుకు తగిన అనుకూల పరిస్థితులే వారికి గగనమవుతున్నాయి. అందుకే దాదాపు 40 శాతం మంది మహిళలు ఉద్యోగాలను వదులుకోవడానికే సిద్ధపడుతున్నారు. పిల్లల ఆలనాపాలన చూసుకోవడానికి కొందరు ఉద్యోగాలను వదులుకోవాలని భావిస్తుంటే, పనిప్రదేశాల్లో వేధింపులు, లింగవివక్ష తట్టుకోలేక చాలామంది ఉద్యోగాలకు రామ్ రామ్ చెప్పేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వరంగంలో ఈ పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు గానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే మహిళల్లో దాదాపు 40 శాతం మంది వివిధ కారణాల వల్ల ఉద్యోగాలను మానేయాలనుకుంటున్నట్లు ‘అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా’ (అసోచామ్) ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పది నగరాల్లో ‘అసోచామ్’ ఈ సర్వే నిర్వహించింది. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, లక్నో, ముంబై, పుణే నగరాలను ఈ సర్వే కోసం ఎంపిక చేసుకుంది. ఈ సర్వే ప్రకారం... మహిళలు ఉద్యోగాలు మానేయాలనుకునేందుకు దారి తీస్తున్న ముఖ్యమైన కారణాలు ఇవీ: * పురుషులతో సమానమైన వేతనాలు పొందలేకపోవడం * అనుకూలంగా లేని పనివేళలు * పనిప్రదేశంలో వేధింపులు, లింగ వివక్ష * పనిచేయడానికి అనువైన పరిస్థితులు లేకపోవడం * తగిన భద్రత లేకపోవడం * కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలు * ఉన్నత చదువులు చదవాలనుకోవడం ఇవి మాత్రమే కాదు. పలు సంస్థల్లో యాజమాన్యాల నిర్వాకాలకు విసిగి వేసారిపోయి కూడా పలువురు మహిళలు ఉద్యోగాలను వదులుకోవాలనుకుంటున్నారు. తాము పనిచేసే సంస్థల్లో మహిళలకు భద్రత కరువవుతోందని, మహిళల భద్రత కోసం చట్ట నిబంధనల ప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలేవీ యాజమాన్యాలు కల్పించడం లేదని, వేధింపులపై ఫిర్యాదులు చేసినా, పరిష్కరించే యంత్రాంగమేదీ ఉండటం లేదని కూడా ఈ సర్వేలో పాల్గొన్న పలువురు మహిళలు వాపోవడం గమనార్హం. ‘‘చాలా సంస్థల్లో మహిళా ఉద్యోగులు సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం వాళ్లకు చెల్లించే పారితోషికం తక్కువగా ఉండటం. ఒకేలాంటి అనుభవం ఉన్నా ఇంకా చాలా సంస్థల్లో పురుషులతో పోలిస్తే మహిళలకు సమాన పారితోషికం ఇవ్వడం లేదు. మహిళల పట్ల వివక్ష కూడా ఎక్కువ. ఈ వివక్ష వల్ల కూడా మహిళా ఉద్యోగుల సంఖ్యను ప్రభావితం చేస్తోంది. ఇక మహిళలు గర్భం ధరించాల్సి వస్తే వాళ్లకు కనీసం 84 రోజుల పాటు సెలవులు ఇవ్వాలనే నిబంధన ఉంటుంది. కానీ చాలా సంస్థలు ఈ నిబంధనను పాటించడం లేదు. పైగా నిబంధనను పాటించాల్సి వస్తే తాము వేతనాన్ని ఇస్తున్నా, తగిన పనిని రాబట్టుకోలేకపోతున్నామనే భావన ఉంటుంది. ఇక వస్తుత్పాదన రంగాలు, పరిశ్రమల్లో జాబ్ టైమింగ్స్ కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గడంలో ప్రధాన భూమిక పోషించే అంశం. అందుకే ఈ రంగాలను వదిలి సాఫ్ట్వేర్ రంగంవైపునకు మహిళలు మొగ్గుచూపుతున్నారు’’ - వి. ప్రశాంతి హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఎనిమిదేళ్లు ఓ ప్రైవేట్ బ్యాంక్లో పని చేశాను. మా వారిది ఐటి ఫీల్డ్. చెన్నైకి ట్రాన్స్ఫర్ అయితే, నేనూ అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మా వారికి బెంగుళూర్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ టైమ్లో బాబు పుట్టాడు. పనివేళలు సరిగా లేకపోవడం, ఒత్తిడి.. పరిస్థితులన్నీ అనుకూలంగా లేవనిపించి ఉద్యోగం మానుకున్నాను. - శకుంతల, బెంగుళూరు నేనొక ఐటీ బేస్డ్ కంపెనీలో ఏడాది పాటు జాబ్ చేశాను. రోజూ తొమ్మిది నుంచి పది గంటల పని. ఇచ్చిన టైమ్లో వర్క్ పూర్తి చేయాలి. లేదంటే రిమార్క్. ఎంత చేసినా తరగని పని, దానికి తోడు ఉద్యోగ భద్రత లేకపోవడం, టార్గెట్ రీచ్ కాకపోతే ఏమవుతుందో అనే టెన్షన్... దీంతో తిండి మీద కూడా ధ్యాస ఉండేది కాదు. విసుగనిపించి జాబ్ మానేశాను. - శ్రావణి, హైదరాబాద్ -
మహిళా బిల్లు మళ్లీ మొదటికి..
ఎన్నో యుద్ధాల తర్వాత 2010లో రాజ్యసభ బిల్లును ఆమోదించినా, లోక్సభలో పక్కకు నెట్టేశారు. లోక్సభలో పెండింగ్లో ఉన్న ఏ బిల్లు అయినా, సభ రద్దయితే మురిగిపోతుంది. ఇప్పుడదే జరిగింది. ఎన్నికల రుతువు ఆగమించిన వేళ - ప్రతి రాజకీయకూట మిలో అధికారపు ఆశలు మోసులెత్తుతున్నాయి. ఓటర్లను ఆకర్షించే వాగ్దానపు కలకూజితాలు కాస్త ముందే మొదల య్యాయి. ఓ పక్షం.. అభివృద్ధి - సుస్ధిరతా మంత్రాలతో ముగ్ధుల్ని చేసే వ్యూహంలో మునిగితోలుతోంది. పదేళ్లుగా అధికారం చెలాయిస్తున్న మరోపక్షం - ప్రజాకర్షక పథకాలూ ‘భారత్ నిర్మాణ్’కి రాళ్లెత్తిన వైనాలూ వెల్లడిస్తూ చాలారోజులుగా ప్రచారం చేస్తోంది. తాజాగా జాట్ ఓటర్లకు రిజర్వేషన్ గాలమేయడం.. ముస్లిం సబ్కోటాపై స్టే ఎత్తేయాలని ‘సుప్రీం’ను ఆశ్రయించడం.. రాహుల్ రాష్ట్రాలు కలియదిరుగుతూ స్త్రీ సాధికారతా జపం చేయడం - ఇవన్నీ కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగమే. పార్టీల కార్యక్రమాల్ని ప్రముఖంగా ప్రచురిస్తున్న పత్రికలు.. రంజైన రాజ కీయకేళిని రక్తి కట్టించేందుకు రంగంలోకి దిగిన పత్రికలు.. కోట్లాది మహిళలకు ప్రాతినిధ్యం వహించే తొమ్మిది మహిళా సంఘాల డిమాండ్ల పత్రాన్ని మాత్రం పట్టించుకోలేదు. చట్టసభలో స్త్రీలకు మూడింట ఒక వంతు స్థానాలిచ్చేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్బిల్లును 16వ లోక్సభలో తప్పక ఆమోదించాలనేది పై పత్రంలో ఒక డిమాండ్. మహిళాసంఘాలు 17 ఏళ్లుగా ఈ చట్టంకోసం పోరాడుతున్నాయి. తమ రాజకీయ గుత్తాధిపత్యానికి గండి పడుతుందని భయపడినవాళ్లు రకరకాల సాకులతో మొదట బిల్లును వ్యతిరేకించారు. స్త్రీల రాజకీయహక్కులకు సమాజ మద్దతు లభిం చడంతో- పార్టీలోనే రిజర్వేషన్లూ ద్విసభ్య నియోజకవర్గాలూ వంటి కొత్త ఆయుధాలకు పదునుపెట్టారు. 1996లో యునెటైడ్ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. తర్వాత వచ్చిన ఎన్డీయే, యూపీఏ పాలకులు ఏకాభిప్రాయం లేదంటూ బిల్లును ప్రవేశపెట్టలేమన్నారు. ఎప్పటికీ సాధ్యం కాని ‘ఏకాభిప్రాయాన్ని’ పదేపదే వల్లె వేసిన పాలకులు తమకు లాభించగల బిల్లుల విషయంలో ఈ సూత్రం పాటించలేదు. చివరికి ఎన్నో యుద్ధాల తర్వాత 2010లో రాజ్యసభ బిల్లును ఆమోదించినా, లోక్సభలో పక్కకు నెట్టేశారు. లోక్సభలో పెండిం గ్లో ఉన్న ఏ బిల్లు అయినా, సభ రద్దయితే మురిగిపోతుంది. ఇప్పుడదే జరిగింది. వ్యవహారం మొదటికొచ్చింది. స్త్రీలు చట్టసభలకు ఎన్నికయితే ‘పంచాయతీరాజ్’ అనుభవమే పునరావృతమవుతుందనీ స్త్రీలు డమ్మీలుగా మిగులుతారని కొందరి ‘భయం’. అయితే మహిళా ఉద్యమకారుల అధ్యయనాలు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నాయి. వారి అధ్యయనం ప్రకారం - బినామీ పాలన ఎంత వాస్తవమో స్వతంత్రంగా బాధ్యతగా పనిచేసే మహిళా ప్రతినిధుల సంఖ్య పెరగడమూ అంతే వాస్తవం. చొరవగా ముందుకు సాగేవాళ్లు ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తోం ది. ఉద్యమాలతో సంబంధాలున్నచోట.. మద్దతు లభించిన చోట వాళ్లు ప్రతికూల వాతావరణం ఎదుర్కొని పని చేయగలుగుతున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి మహిళలకు అండగా నిలబడి శిక్షణ ఇస్తే.. బినామీల పాలనను అడ్డుకుంటే మంచి మార్పులొచ్చే అవకాశముంది. పంచాయతీల్లో మహిళల ప్రవేశం - స్త్రీలను ఇంటికి పరిమితం చేసిన ఫ్యూడల్ సంప్రదాయాన్నీ సవాలు చేయగలిగింది. ఇలాంటి సానుకూల మార్పుల్ని గమనించిన తర్వాతే మహిళా ఉద్యమకారులు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేశారు. ఆధునికచరిత్రలో ఏ కాలంలో చూసినా, రాజకీయ హక్కుల విషయంలో స్త్రీలను పక్కకు నెట్టేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రోద్యమాన స్త్రీల సాహసాన్ని కళ్లారా చూసిన నాయకులు ఉద్యమానంతరం వాళ్లను ఇళ్లకే పరిమితం చేశారు. 499 స్థానాలున్న తొలి పార్లమెంట్లో స్త్రీలు 22 మందే. స్వాతంత్య్రానంతరం రాజకీయాల్లో, ప్రజాపోరాటాల్లో చురుకైనపాత్ర పోషించిన స్త్రీలను అభ్యర్థులుగా నిలపడంపై పార్టీలు ఏనాడూ దృష్టి సారించలేదు. అందుకే- చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యపరంగా మనదేశానిది 108వ స్థానం. పార్లమెంట్లో మహిళా ప్రతినిధులు 11 శాతం. ఇది ప్రపంచ సగటు (21.4శాతం)లో సగమే. స్త్రీ - పురుష సమానత్వం ప్రాథమిక మానవహక్కులతో ముడివడిన విషయం మాత్రమే కాదనీ, దీనిపైనే పలురంగాల అభివృద్ధి ఆధారపడి ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ చెబుతారు. అణచివేత భావాలు వేళ్లూనిన సమాజానికి ఈ దృక్కోణాన్ని అర్థం చేయించాలిప్పుడు. అందుకు రాజకీయహక్కులు కావాలి. అణచివేత భావజాలాన్ని సవాల్ చేయడానికి.. సమాజవైఖరిలో మార్పు తీసుకురావడానికి.. ప్రజాస్వామిక సమాజనిర్మాణానికి.. స్త్రీలు చట్టసభల్లో ప్రవేశించితీరాలి. కాబట్టి హక్కులపోరాటం కొనసాగాలి - బిల్లు ఆమోదం పొందేవరకు.. సమానావకాశాలు సాధించేవరకు. వి.ఉదయలక్ష్మి


