breaking news
Woman kills two daughters
-
ప్లీజ్ అమ్మ.. వద్దు అమ్మ అని వేడుకున్నా..
తను బిడ్డల్ని ఎంతగానో ప్రేమించేది. వారి గురించి గర్వంగా చెప్పుకొనేది. ఆ రోజు పర్పుల్ రంగు డ్రేస్ వేసుకొంది. కానీ ఏం జరిగిందో ఏమో తానే చేజేతులా ఇద్దరు కూతుళ్లనీ తుపాకీతో పొట్టనబెట్టుకుంది. ఇది అమెరికాలోని హూస్టన్లో తన ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపి.. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో చనిపోయిన క్రిష్టీ షీట్స్ గురించి ఆమె బంధువులు, స్నేహితులు ఆన్లైన్లో వెల్లడించిన విషయం. క్రిష్టీ తన కూతుళ్లు మాదిసన్ (17), టైలర్ (22)లను ఎందుకు చంపింది అనే దానిపై స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరానప్పటికీ.. కాల్పులు జరిగిన రోజు ఏం జరిగింది అనే దానిపై పోలీసులు తాజాగా కొన్ని విషయాలు వెల్లడించారు. కాల్పుల గురించి తెలిపేందుకు క్రిష్టీ ఇంటి నుంచి 911 కాల్స్ వచ్చాయని, ఆ కాల్స్లో క్రిష్టీ కూతుళ్లు ఏడుస్తూ వేడుకుంటున్న ధ్వనులు స్పష్టంగా వినిపించాయని పోలీసులు తెలిపారు. ఈ కాల్స్ ప్రకారం.. ఇద్దరు కూతుళ్లు బిగ్గరగా ఏడుస్తూ.. తమను ప్రాణాలతో విడిచిపెట్టామని తల్లిని వేడుకున్నారు. ‘ప్లీజ్ క్షమించి.. ప్లీజ్ మమ్మల్ని షూట్ చేయకు’ అని ఇద్దరూ కూతుళ్లు అభ్యర్థించారు. ‘ప్లీజ్! క్షమించు.. తుపాకీతో నావైపు గురిపెట్టకు’ అని ఓ కూతురు వేడుకోగా.. ‘నేను నీకు మాట ఇస్తున్నాను. ఏం చేయమంటే అది చేస్తాను’ అని మరో కూతురు వేడుకుంది. (ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన మహిళ) ఆ తర్వాత గట్టిగా అరుపులు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఫోన్ పెట్టేయకుండా ఆన్లో ఉన్న ఈ కాల్స్తో వెంటనే స్పందించిన పోలీసులు త్వరగానే క్రిష్టీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికీ క్రిష్టీ ఇద్దరు కూతుళ్లు నెత్తుటి మడుగులో కూలిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వారు చేసిన అభ్యర్థనలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు వచ్చినప్పటికీ క్రిష్టీ తుపాకీ కిందపడేయకపోవడంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. అమెరికా వాసులను షాక్ గురిచేసిన ఈ కాల్పుల ఉదంతంపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అమెరికాలో నెలకొన్న విచ్చలవిడి తుపాకీ సంస్కృతిని కట్టడి చేయాలని, అమెరికన్లకు మానసిక ఆరోగ్యం, కుటుంబబాంధవ్యాలపై సామాజికంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని నిపుణులు చెప్తున్నారు. -
ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన మహిళ
హూస్టన్: ఇంట్లో మొదలైన చిన్న వాగ్వాదం తీవ్ర విషాదానికి దారితీసింది. కన్న తల్లే తన టీనేజ్ కూతుళ్లపై తుపాకీ గురిపెట్టింది. కనిపెంచిన బిడ్డలపై కనీస మమకారం చూపించకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపింది. ఆ తర్వాత పోలీసులు వచ్చినా చేతిలో తుపాకీని వదిలేయలేదు. వారినీ తుపాకీతో బెదిరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసుల తూటాకు రాక్షసిగా మారిన ఆ తల్లి కూడా చనిపోయింది. ఈ దారుణం అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్లో జరిగింది. ప్రశాంత పట్టణంగా పేరొందిన హూస్టన్లో కాల్పుల మోత మోగింది. 42 ఏళ్ల క్రిష్టీ షిట్స్ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లను తుపాకీతో అమానుషంగా కాల్చిచంపింది. చేతికి అందివచ్చిన 19 ఏళ్ల టైలర్ షీట్స్ను, 17 ఏళ్ల మాదిసన్ షీట్స్ను తుపాకీతో పొట్టనబెట్టుకుంది. క్రిష్టీ తుపాకుల మోత ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులకు కాల్ వెళ్లింది. పోలీసులు వచ్చేసరికి పెద్ద కూతురు టైలర్కు తూటాలకు కుప్పకూలిపోయింది. మరో కూతురు మాదిసన్ కూడా తూటా గాయాలతో నెత్తురోడుతోంది. ఆ సమయంలో వచ్చిన పోలీసులు తుపాకీ కింద పడేయాలని క్రిష్టీని కోరినా ఆమె వినిపించుకోలేదు. దీంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. క్షణికావేశంలో ఇంట్లో రక్తపాతం సృష్టించిన క్రిష్టీ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు విడిచింది. కొన ఊపిరితో ఉన్న మాదిసన్ ను హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించే ప్రాణాలు వదిలింది. ఈ దారుణం జరుగుతున్న సమయంలో ఇంట్లోనే క్రిష్టీ భర్త ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. కానీ, అతడు మానసికంగా షాక్లో ఉండటంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇంట్లో మొదలైన చిన్న వాగ్వాదం ఇంత దారుణానికి కారణమైందని ప్రాథమికంగా తెలుస్తున్నదని, క్రిష్టీ భర్త కోలుకుంటేగానీ అసలు ఏం జరిగిందనేది తెలిసే అవకాశముందని హుస్టన్ పోలీసులు చెప్తున్నారు.