breaking news
warning and security
-
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ సాఫ్ట్వేర్లలో అనేక లోపాల గురించి భారత ప్రభుత్వం వినియోగదారులను హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని సున్నితమైన యూజర్ డేటాను సైబర్ నేరస్థులు యాక్సెస్ చేసే వీలుందని, దాంతోపాటు వారి డివైజ్లను పూర్తిగా నిరుపయోగంగా మార్చే అవకాశం ఉందని తెలిపింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ఈమేరకు యాపిల్ డివైజ్ యూజర్లకు హై-ఇంటెన్సిటీ హెచ్చరికలు జారీ చేసింది.పాత, కొత్త మోడళ్లతో సహా వివిధ యాపిల్ పరికరాలపై ఈ లోపాలు ప్రభావం చూపుతాయని సీఈఆర్టీ-ఇన్ తెలిపింది. ఐఓఎస్ 18.3కు ముందు వెర్షన్లతో పనిచేసే ఐఫోన్లు, మోడల్ను బట్టి 17.7.3 లేదా 18.3 కంటే ముందు ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్లతో పనిచేసే ఐప్యాడ్లపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. యాపిల్ అంతర్గత మెసేజింగ్ ఫ్రేమ్వర్క్లో కీలకమైన డార్విన్ నోటిఫికేషన్ సిస్టమ్లో ప్రధాన లోపాన్ని ఒకటి గుర్తించినట్లు తెలిపింది. దాని ప్రకారం ప్రత్యేక అనుమతులు లేకపోయినా ఏదైనా అప్లికేషన్ సిస్టమ్ స్థాయి నోటిఫికేషన్లను పంపేందుకు అది అనుమతిస్తుంది. దీన్ని దుర్వినియోగం చేస్తే డివైజ్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.పరిణామాలు ఇలా..ఈ లోపాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఈఆర్టీ-ఇన్ హెచ్చరించింది. హ్యాకర్లు వ్యక్తిగత, ఆర్థిక సమాచారంతో సహా గోప్యమైన డేటాను దొంగిలించే అవకాశం ఉంది. ఇంటర్నల్ భద్రతా యంత్రాంగాలను ఇది కట్టడి చేయవచ్చు. లేదా అనధికార కోడ్ను అమలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో యూజర్ల డివైజ్లు పూర్తిగా క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ లోపాలను అధిగమించేందుకు సత్వర చర్యలు అవసరమని సీఈఆర్టీ-ఇన్ ధ్రువీకరించింది.ఇదీ చదవండి: పదేళ్ల తర్వాత గూగుల్ లోగోలో మార్పులువెంటనే యూజర్లు ఏం చేయాలంటే..ఈ సమస్యకు పరిష్కారంగా యాపిల్ లోపాలను సరిదిద్దడానికి సెక్యూరిటీ అప్డేట్లను విడుదల చేసింది. యూజర్లందరూ తమ డివైజ్లను వెంటనే లేటెస్ట్ వర్షన్కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేటెస్ట్గా అందుబాటులో ఉన్న ఐఓఎస్ లేదా ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్కు అప్డేట్ అవ్వాలని తెలిపింది. వినియోగదారులు ధ్రువీకరించని మొబైల్ అప్లేకేషన్లను ఇన్స్టాల్ చేసుకోకూడదని పేర్కొంది. ఏపీకే ఫైల్ ద్వారా ఎలాంటి యాప్లను ఇన్స్టాల్ చేసుకోరాదని చెప్పింది. హానికరమైన కార్యకలాపాలను సూచించే పాప్అప్ సమాచారంపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. -
మనకూ భూకంపాలను ముందే గుర్తించే వ్యవస్థ
న్యూఢిల్లీ: భూకంపాలు ప్రపంచంలో ఎక్కడైనా ఊహించని విపత్తును సృష్టిస్తున్న విషయం తెల్సిందే. భూకంపాలు వచ్చే విషయాన్ని కొన్ని క్షణాల ముందు కనుక్కున్నా కొన్ని వేల ప్రాణాలను రక్షించుకోగలం. అపార నష్టాన్ని తగ్గించుకోగలం. భూప్రకంపనలను కనీసం 30 సెకన్ల ముందు కచ్చితంగా కనుక్కొనే అత్యాధునిక ‘వార్నింగ్ అండ్ సెక్యూరిటీ’ వ్యవస్థను త్వరలో మన దేశంలోనూ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రస్తుతం మన దేశంలో ఉపయోగిస్తున్న ప్రకంపనల హెచ్చరిక వ్యవస్థ ప్రాథమిక ప్రకంపనలను గుర్తించి మాత్రమే అలారం ద్వారా పౌర అధికారులను హెచ్చరించగలదు. కానీ ఇప్పుడు కొత్తగా నెలకొల్పబోతున్న వ్యవస్థ ప్రాథమిక ప్రకంపనలను కూడా కనీసం 30 సెకన్ల ముందు గుర్తించి హెచ్చరించగలదు. 2010లో చిలీలో వచ్చిన భూప్రకంపనలను 30 సెకన్ల ముందు కనుక్కోవడం వల్ల అక్కడ అపార ప్రాణ, ఆస్తి నష్టాలను నియంత్రించగలిగారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇంతకుమించిన ఆధునిక వ్యవస్థలేదు. ‘ఎర్త్క్వేక్ వార్నింగ్ అండ్ సెక్యూరిటీ’గా పిలిచే ఈ వ్యవస్థలో సెక్యూరిటీ ఫీచర్లు ఉండడం మరీ విశేషం. ఈ వ్యవస్థ ద్వారా నగరాల్లో అపార నష్టానికి కారణమవుతున్న ఎలక్ట్రిక్, ఎనర్జీ వ్యవస్థలను నిలిపివేయవచ్చు. ఫ్లడ్ వాటర్ వ్యవస్థ దెబ్బతినకుండా చూడొచ్చు. ఆకాశ హర్మ్యాల్లోని లిఫ్టులను క్షణాల్లో నిలిపివేయవచ్చు. కెమికల్ ప్లాంట్స్, లాబరేటరీలను, హాస్పత్రులను రక్షించుకోవచ్చు. అదే సమయంలో అత్యవసర ద్వారాలను తెరవవచ్చు. నగరాల్లోని అన్ని ముఖ్యమైన వ్యవస్థలకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధించి ఇవన్నింటినీ సాధించవచ్చు. ఈ వ్యవస్థ వైర్లెస్ ద్వారా కూడా నగరమంతటా పనిచేస్తోంది. ఈ వ్యవస్థను భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రాంతం విస్తీర్ణం, భూకంపాల తీవ్రతను బట్టీ భారీ అలారాలను మోగిస్తుంది. వెంటనే ఆటోమేటిక్గా సెక్యూరిటీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. జర్మనీకి చెందిన ‘సెక్టీ ఎలక్ట్రానిక్స్’ కంపెనీ ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో ఇప్పటికే 25 దేశాలు ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఇదే కంపెనీ ఇండియన్ పార్టనర్ ‘టెర్రా టెక్కామ్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా భారత్కు అందిస్తోంది. దేశంలో దీన్ని జనవ రి లేదా ఫిబ్రవరిలో ఏర్పాటు చేయబోతోంది.