breaking news
visadachayalu
-
పెళ్లింట విషాదం
కొత్తకోట : అందరూ పెళ్లి వేడుకల్లో నిమగ్నమయ్యారు.. పెళ్లిపందిరి వేయడానికి ఆకు తీసుకురావడానికి వెళ్లిన వారు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనుకునేలోపు విషాద వార్త వచ్చింది.. ఆకుతో వస్తున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని ఫోన్ రావడంతో బంధువులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి ఉండటంతో బోరున విలపించారు. ఈ సంఘటన కొత్తకోట మండలంలోని కనిమెట్ట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పాలెం గ్రామానికి చెందిన షేవ రాములు రెండో కుమారుడు కురుమూర్తి పెళ్లి ఆదివారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ సమీపంలో పెళ్లి పందిరికి కావాల్సిన ఆకు తీసుకురావడానికి పెళ్లి కుమారుడి అన్న మల్లేష్, బంధువులు వెంకటేష్, కృష్ణయ్య, రాచెంటి మల్లేష్, శివ, ఎన్.రాములు, శంకర్లు కలిసి ట్రాక్టర్లో శుక్రవారం రాత్రి బయలుదేరారు. పెళ్లి ఆకు తీసుకుని సుమారు రాత్రి 2 గంటల ప్రాంతంలో పాలెంకు బయలుదేరారు. అయితే ఈ క్రమంలో సమీపంలోని ఓ దాబాలో భోజనం చేసి.. మద్దిగట్ల గ్రామానికి చెందిన వెంకటేష్(22), రాచెంటి మల్లేష్, రాములును గ్రామంలో వదిలి, పాలెంకు రావాలని బయలుదేరారు. ఈ క్రమంలో కర్నూలు నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తాపడి అందరూ చెల్లాచెదురుగా పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో వెంకటేష్, కృష్ణయ్య, షేవ మల్లేష్లకు తీవ్రగాయాలవగా.. ఎన్.రాములు, రాచెంటి మల్లేష్, శివ, శంకర్లకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఎల్అండ్టీ అంబులెన్స్లో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేష్ మృతిచెందగా.. కృష్ణయ్య, షేవ మల్లేష్లను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. పాలెంలో విషాదఛాయలు.. పందిరి వేయడానికి ఆకు తీసుకురావడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు వెంకటేష్ మృతిచెందగా.. పెళ్లి కుమారుడు అన్న షేవ మల్లేష్ తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకలు నిలిపివేశారు. ఆదివారం జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. సమాచారం అందుకున్న బంధువులు రోదిస్తూ ఆస్పత్రులకు పరుగులు తీశారు. ఇటు వెంకటేష్ స్వగ్రామం మద్దిగట్లలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. జేసీబీ వాహనం ఢీకొని.. బిజినేపల్లి రూరల్ (నాగర్కర్నూల్): మండలం లోని బోయాపూర్ వద్ద శనివారం మధ్యాహ్నం అదే గ్రామం నుంచి ఎదురుగా వస్తున్న జేసీబీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో నందివడ్డెమాన్ గ్రామానికి చెందిన ఖానాపురం కృష్ణయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణికులు గమనించి 108లో నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మోకాలు ప్రాంతంలో తీవ్రంగా ఎముక విరిగిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
అమ్మకు ఫోన్ చేసిన అరగంటకే..
బూర్జ: తోటవాడ గ్రామానికి చెందిన చోడి లక్ష్మీ నరసింహరాజు (23)కర్నాటకలోని బీదర్లో ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం చేస్తున్నారు. అతను ఆదివారం హైదరాబాద్లో నివాసం ఉంటున్న గృహం నుంచి విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజు మృతదేహం మంగళవారం తోటవాడ గ్రామానికి చేరుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.ఇంటి దీపం ఆరిపోయింది మా ఇంటి దీపం ఆరిపోయిందని తల్లితండ్రులు చోడి రమణమ్మ, అప్పారావు కుమారుని మృతదేహంపై పడి బోరున విలపించారు. సంక్రాంతి పండగకు 20రోజులు సెలవుపై వచ్చిన తమ కుమారుడు, తమతోపాటు మిత్రులతో ఎంతో ఆనందంగా గడిపాడని, ఇంతలోనే మాయమయ్యాడని వారు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. అక్కడ ఉద్యోగానికి వెళ్లేందుకు ద్విచక్రవాహనం అవసరమంటూ శ్రీకాకుళంలో వాహనాన్ని కొనుగోలు చేసుకొని నాలుగు రోజుల కిందటే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లాడని చెప్పారు. హైదరాబాద్ చేరుకొని, ఇక్కడ నుండి పార్సిల్ చేసిన బండిని తీసుకున్నానని మరుసటి రోజు ఫోన్చేసిన అరగంటలోనే కుమారుడి మరణవార్త తెలియటంతో నమ్మలేకపోయామని వారు గుండెలు బాదుకున్నారు. తమ కుమారుడు ఉద్యోగం చేసి ప్రయోజకుడయ్యాడని ఇక మా కష్టాలు గట్టేక్కాయని ఎంతో సంతోషపడ్డామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని బోరు రోదించారు. ఇక ఈ కుటుంబ భారం నా కొడుకే చూసుకుంటాడనుకుంటే.. దేవుడు మా కొడుకు ప్రాణాలు తీసుకువెళ్లాడంటూ వారు నెత్తీ నోరు కొట్టుకొని ఏడుస్తూ కుప్పకూలిపోయారు. లక్ష్మీనరసింహరాజు మృతిని మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంధువులు, మిత్రులు,తోటి ఉద్యోగులతో ఆ గ్రామం విషాద ఛాయల్లో మునిగిపోయింది. -
గర్భశోకం
గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణానదిలో మృతదేహాలు లభ్యం పెనమలూరు, చోడవరం, తాడిగడపల్లో విషాదఛాయలు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మృత్యుఘోష వారు ముగ్గురు ప్రాణస్నేహితులు. రోజూ కలిసే కళాశాలకు వెళ్లి వస్తుంటారు. చదువులోనూ ముందంజలో ఉంటారు. ఏమైందో తెలియదు కానీ ముగ్గురూ కలిసే కృష్ణమ్మ ఒడిలో తనువు చాలించారు. తమపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చారు. తెల్లారితే రాఖీ పండుగ.. చిన్నారి చెల్లి పూజిత వచ్చి రాఖీ కడుతుందని అన్నయ్య ఎదురు చూస్తున్నాడు.. పల్లవక్క వచ్చి రక్షాబంధనం చేస్తుందని చిన్నారి తమ్ముడు నిరీక్షిస్తున్నాడు. కానీ వారి నిరీక్షణ ఫలించలేదు. పూజిత, పల్లవి.. ఇద్దరూ విగతజీవులై ఇంటికి రావటం ఆ అన్నదమ్ములతోపాటు కుటుంబ సభ్యులకూ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ/తాడేపల్లి రూరల్/మంగళగిరి : కళాశాలకు వెళ్తున్నామని ఇంటి నుంచి బయలుదేరిన ముగ్గురు స్నేహితులు కలిసే మృత్యు ఒడికి చేరారు. కన్నవారి కలలను కల్లలు చేస్తూ కడుపుకోతను మిగిల్చారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు నిర్జీవంగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరుకు చెందిన బిళ్ల పల్లవి(18), చోడవరానికి చెందిన సరిపూడి పూజిత(17), తాడిగడప సెంటర్ సమీపంలో నివసించే యలమంచిలి నాగలక్ష్మి బందరు రోడ్డులోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూపు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పూజిత, పల్లవి ఇద్దరు పదో తరగతి వరకు పెనమలూరులోని ఓ పాఠశాలలో కలిసే చదువుకున్నారు. శనివారం ఉదయం యథావిధిగా ఇంటి నుంచి బయలుదేరిన ఈ ముగ్గురు కళాశాలకు వెళ్లలేదు. దీంతో కళాశాల ప్రతినిధులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పల్లవి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ను కలిసి వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థినులు శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణానది ఇసుక తిన్నెలపైకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిసేపటి తర్వాత వారి బ్యాగులు మాత్రమే కనిపించగా, విద్యార్థినుల ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకుని బ్యాగులు స్వాధీనం చేసుకున్న పోలీసులకు ఆదివారం ఉదయం మృతదేహాలు లభించాయి. తల్లిదండ్రులు సంఘటనా స్థలికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. చిట్టీ తల్లీ..! చీకటంటే భయం కదే..! : ‘ఎంత పని చేశావు బిడ్డా.. నాన్న, చెల్లి, నేను.. గుర్తుకురాలేదా? కాస్త దూరం నడిస్తే కాళ్లు నొప్పులమ్మా.. అంటూ ఏడ్చేదానివిగా, ఇంతదూరం నడుచుకుంటూ ఎలా వచ్చావమ్మా? నువ్వు చనిపోలేదు, నన్ను ఏడిపించేందుకే ఇలా చేస్తున్నావు, లేమ్మా.. నీకు చీకటి అంటే భయంగా కదా! కరెంటు పోతే ‘కెవ్వుమని కేకేసేదానివి కదా..! రాత్రి చీకటిలో నీళ్లలో తడుస్తూ ఎలా ఉన్నావమ్మా..’ అంటూ నాగలక్ష్మి తల్లి మాధవి బోరున విలపించారు. చీర చెంగుతో బిడ్డ మొహం తుడుస్తూ లేపేందుకు ఆమె ప్రయత్నించటం అందరినీ కలచివేసింది. నాగలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు విజయవాడ ఆటోనగర్లో పనిచేస్తున్నారు. తల్లి మాధవి గృహిణి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి నాగలక్ష్మి 11 గంటలకే ఇంటికి వచ్చింది. 4.30 గంటలకు కూడా ఫోన్లో మాట్లాడింది. ఇంట్లోనే ఉన్నానంటూ హైదరాబాద్లోని మేనమామకు, తల్లికి చెప్పింది. తర్వాత బయటకెళ్లిన ఆమె చీకటిపడ్డా కనిపించకపోవడంతో కంగారుపడిన తండ్రి ఫోన్చేసి చెప్పడంతో మాధవి ఫ్రెండ్స్, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. సమాచారం దొరక్కపోవడంతో వెంటనే బయలుదేరి పెనమలూరు వచ్చారు. ఇంతలోనే పోలీసులు ఫోన్ చేసి విషయం చెప్పారు. తెల్లారాక ఫిర్యాదు చేద్దామనుకుంటే : మృతుల్లో ఒకరైన సరిపూడి పూజితకు తండ్రి లేడు. ఏడేళ్ల క్రితమే మరణించారు. అమరావతి మండలం లింగాపురం సొంతూరు. పూజిత తండ్రి మరణించడంతో పిల్లలకు మంచి చదువులు చదివించాలని పెనమలూరు మండలం చోడవరంలోని బంధువుల దగ్గరకు వచ్చి ఉంటున్నారు. శనివారం పూజిత రాలేదని కాలేజి నుండి ఫోన్ రాగా తల్లి శివనాగలక్ష్మి కంగారు పడ్డారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిందేమోనని సరిపెట్టుకున్నారు. చీకటిపడ్డా రాకపోవడంతో కంగారుపడ్డారు. తెల్లవారేదాకా చూసి పోలీసులకు ఫిర్యాదు ఇద్దామనుకుంటే ఇంతలోనే విషయం తెలిసి భోరున విలపించారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు..: బిళ్లా పల్లవి తండ్రి రాంబాబు ఎలక్ట్రీషియన్. ఇంటికి ఒక్కతే ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. శనివారం కాలేజీకి రాలేదంటూ ఫోన్ రావడంతో కంగారుపడిన తండ్రి స్నేహితులు, బంధువులను విచారించారు. చీకటిపడ్డా రాకపోవడంతో పోలీసుస్టేషన్కు వెళ్లగా వారు ఫిర్యాదు స్వీకరించలేదు. ఉ. 10 గంటలకు అమ్మాయి ఫొటో తెస్తే ఎంక్వైరీ చేస్తామని పోలీసులు చెప్పారని రాంబాబు చెప్పారు. రాత్రంతా ఆందోళనతో గడిపానని, తెల్లరేసరికి మరణవార్త విన్నామని గొల్లుమన్నారు. తల్లిదండ్రులకు మృతదేహాలు అప్పగింత కాగా, ముగ్గురు విద్యార్థినుల మృతదేహాలకు వారి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో మంగళగిరి సీఐ హరికృష్ణ, తాగేపల్లి ఎస్ఐ వినోద్కుమార్లు పంచనామా నిర్వహించారు. పంచనామా, పోస్టుమార్టం అనంతరం విద్యార్థినుల మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు. యలమంచిలి నాగలక్ష్మి, బిల్లా పల్లవి అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. పూజిత మృతదేహాన్ని అమరావతి సమీపంలోని లింగాపురానికి తీసుకెళ్లారు. సోమవారం ఆమె అంత్యక్రియలు చేస్తారు. తల్లిదండ్రులకు సమాచారమిచ్చాం : కళాశాల ప్రిన్సిపాల్ ముగ్గురు విద్యార్థినులు శనివారం కళాశాలకు రాలేదని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని సదరు కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. దీంతో పల్లవి తల్లిదండ్రులు వెంటనే కళాశాలకు వచ్చి ఆరా తీశారని చెప్పారు. నాగలక్ష్మి తండ్రి తమ కుమార్తెకు బాగోలేదని చెప్పినట్లు తెలిపారు. పల్లవి, నాగలక్ష్మి శుక్రవారం కూడా కళాశాలకు రాలేదని, ఆ సమయంలో గుడికి వెళ్లినట్లు తల్లిదండ్రులు చెప్పారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మరణించిన ముగ్గురు విద్యార్థినులు చదువులో కూడా ముందంజలో ఉంటారని వివరించారు. ఇతర కారణాలు తమకు తెలియవని పేర్కొన్నారు.