virappan
-
హోదా.. అత్యాశే !
కాంగ్రెస్కు ఎస్ఎం. కృష్ణ చురక సంఖ్యా బలం లేకున్నా ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్న మైసూరు : లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి అవసరమైన సంఖ్యా బలం లేకపోయినప్పటికీ, ఆ స్థానాన్ని కాంగ్రెస్ కోరుకోవడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం.కృష్ణ అభిప్రాయపడ్డారు. ఇక్కడి జేఎస్ఎస్ ఆస్పత్రి ఆవరణలో బుధవారం ఆయన సుత్తూరు దేశికేంద్ర స్వామీజీ 99వ జయంత్యుత్సవంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు పది శాతం ఓట్లు కూడా లభించలేదని దెప్పి పొడిచారు. ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి 54-55 సీట్లు గెలుపొందాల్సి ఉందన్నారు. అయితే కాంగ్రెస్కు కేవలం 44 స్థానాలు మాత్రమే దక్కాయన్నారు. దేశంలో రాజ్యాంగమే గొప్పదని, దానిని ఉల్లంఘించి చేసే ఎలాంటి పనులకైనా గుర్తింపు ఉండదని చెప్పారు. మన కోసం రాజ్యాంగంలో పేర్కొన్న నియమాలను మార్చాలని కోరుకోవడం సరికాదని హితవు పలికారు. ఏదేమైనా తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేయడాన్ని విమర్శించారు. అంతకు ముందు జేఎస్ఎస్ ఆస్పత్రిలో కొత్త ఆడిటోరియాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదురైన కష్టాలను ఏకరువు పెట్టారు. తనకు ఎదురైన ఇబ్బందులు బహుశా ఏ ముఖ్యమంత్రీ ఎదుర్కొని ఉండరని చెప్పారు. ఓ వైపు అడవి దొంగ వీరప్పన్ ఆడిందే ఆటగా తయారైందని, మరో వైపు డాక్టర్ రాజ్ కుమార్ను కిడ్నాప్ చేశాడని, ఇంకో వైపు కావేరి జలాల కోసం జయలలిత జగడాలు....అంటూ ఆ సంఘటనలు గుర్తుకు వస్తే ఇప్పటికీ తనకు నిద్ర రాదని వాపోయారు. తన హయాంలో మూడు కరువులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, చివరకు తానే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అన్ని సమస్యలనూ సమర్థంగా ఎదుర్కోగలిగానని ఆయన తెలిపారు. -
ఆనందమానందమాయె..!
8 మందికి ఉరిశిక్ష రద్దు శిక్ష అనుభవిస్తున్న వీరప్పన్ అనుచరుల్లో ఆనందం 15 మందికి ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీం తీర్పు వారిలో 8 మంది కర్ణాటక వారే యావజ్జీవ శిక్షగా ఖరారు బెంగళూరు, న్యూస్లైన్ : శిక్ష పడినప్పటి నుంచి తమ వారిని ఎప్పుడు ఉరి తీస్తారోనని మానసిక వేదన... ఒకటా.. రెండా కొన్నేళ్లుగా కర్ణాటకలోని హిండలాగ జైలులో ఉరిశిక్ష ఖైదీలతో పాటు వారి బంధువులు పడిన వేదన మంగళవారం సుప్రీం తీర్పుతో ఊహించని ఉపశమనం లభించింది. మంగళవారం సుప్రీం కోర్టు ఏకంగా 15 మందికి ఉరిశిక్ష రద్దు చేసి యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. అందులో 8 మంది కర్ణాటకకు చెందిన వారే. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించినప్పటి నుంచి వారిలో నిత్యం మానసిక సంఘర్షణ.. బతకాలనే ఆశ.. కుటుంబ సభ్యులను కలుసుకోవాలనే తపన.. సుప్రీం తీర్పుతో మరోజన్మ ఎత్తినట్లు అయ్యిం ది. వివరాలు... ఒకప్పడు రాష్ట్రాన్ని గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ అనుచరులు కొన్నేళ్ల క్రితం తమిళనాడులో మందుపాతరలు పెట్టి 22 మంది కర్ణాటక పోలీసులు మట్టుబెట్టారు. ఈ కేసులో వీరప్పన్ అనుచరులు సైమన్, జ్ఞానప్రకాష్, బిలవేంద్ర, మిసకార మాదయ్యలకు ఉరి శిక్ష పడింది. ఈ నలుగురు బెల్గాంలోని హిండలాగ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈ నలుగురు పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీలను రాష్ట్రపతి తిరస్కరించారు. ఇక ఉరి కొయ్యపై వేలాడాల్సిందేనని నిర్ణయమైపోయింది. ఉరి తాడులు సైతం సిద్ధం చేశారు. జైలు చుట్టపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇవన్ని కొన్ని నెలల క్రితం జరిగిన తతంగం. ఉరి శిక్ష పడిన నలుగురి కుటుంబ సభ్యులు జైలు వద్దకు చేరుకుని తమ వారిని కడసారి చూసుకుంటామని మూడు రోజుల పాటు పడరాని అగచాట్లు పడ్డారు. అయినా జైలు అధికారులు కరుణించలేదు. ఇంటి నుంచి తీసుకువచ్చిన చివరి భోజనం అయినా ఇవ్వమని ప్రాధేయపడ్డారు. అయినా జైలు అధికారులు పట్టించుకోలేదు. చివరకు న్యాయవాదుల సహాయంతో వారు కడసారిగా జైలులో ఉన్న తమవారిని చూసుకుని బయటకు వచ్చి బోరున విలపించారు. సుప్రీం తీర్పు ఆ నలుగురి కుటుంబంలో ఆనందోత్సహాలు నెలకొన్నాయి. అదే విధంగా చామరాజనగర జిల్లా కోళ్లేగాళలో మహిళను కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడి చేసి దారుణంగా హతమార్చిన శివు, జడేస్వామిలకు ఉరి శిక్ష పడింది. వీరు కూడా ఉరి శిక్ష నుంచి తప్పించుకున్నారు. గల్బర్గా జిల్లా జీవర్గి తాలుకా మందేవాల గ్రామానికి చెందిన సాయిబణ్ణ నింగప్ప తన ఇద్దరు భార్యలు, పిల్లలను హతమార్చడంతో ఉరిశిక్ష పడింది. ఇతను కూడా తాజా సుప్రీం తీర్పుతో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా వామంజూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే నిందితుడు వ ుుగ్గురిని అతి దారుణంగా హత్య చేసి జైలుకు వెళ్లాడు. ఇతనికి ఉరిశిక్ష పడింది. ఇతను కూడా ఉరిశిక్ష తప్పించుకున్నాడు. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పుతో ఉరి శిక్ష నుంచి తప్పించుకున్న వారిలో కర్ణాటకలోనే 8 మంది శిక్ష అనుభవిస్తున్నారు.