breaking news
victory play grounds
-
22న జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంప్ వేడుకలు
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో ఈ నెల 22న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ప్రారంభ వేడుకలు విక్టరీ ప్లేగ్రౌండ్స్లో నిర్వహించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ‘కోడ్’ అమలులో ఉండటంతో ఈ శిబిరాలను అట్టహాసంగా ప్రారంభించలేదు. ఇప్పటికే ఈ శిబిరాలు ఆరంభమైనప్పటికీ అధికారిక ప్రారంభ వేడుకలను మాత్రం గురువారం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుకలకు జీహెచ్ఎంసీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో డిప్యూటీ మేయర్ జి. రాజ్ కుమార్, స్పోర్ట్స్ డెరైక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్రాజ్, సుల్తాన్ బజార్ కార్పొరేటర్ శ్రీరామచంద్ర తదితరులు పాల్గొంటారు. -
సెమీస్లో ఎస్సీ రైల్వే, వీపీజీ
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: వీపీజీ ఓపెన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్), విక్టరీ ప్లేగ్రౌండ్స్ (వి.పి.జి) జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. దీంతోపాటు ఏఓసీ సెంటర్, ఆర్టిలరీ సెంటర్ జట్లు కూడా సెమీస్కు చేరాయి. విక్టరీ ప్లేగ్రౌండ్స్ బాస్కెట్బాల్ కోర్టులో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎస్సీ రైల్వే జట్టు 72-52తో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టుపై ఘన విజయం సాధించింది. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఎస్సీ రైల్వే జట్టు 38-30తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. రైల్వే జట్టులో నిహాల్ 16, నవీన్ 10 పాయింట్లను నమోదు చేశారు. వైఎంసీఏ జట్టులో సాయి 19, రోహిత్ 15 పాయింట్లతో రాణించారు. రెండో క్వార్టర్ ఫైనల్లో ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న వీపీజీ జట్టు 65-46తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జట్టుపై గెలిచింది. వీపీజీ జట్టులో గణేష్ 17, ప్రసాద్ 14 పాయింట్లను చేశారు. ఎస్బీఐ జట్టులో పి.బి.శ్రీనాథ్ 17 పాయింట్లు చేయగా హరిప్రసాద్ 10 పాయింట్లు చేయడం జరిగింది. మూడో క్వార్టర్ ఫైనల్లో ఏఓసీ సెంటర్ జట్టు 67-46తో సికింద్రాబాద్ క్లబ్ జట్టుపై, ఆర్టిలరీ సెంటర్ జట్టు 53-25తో హెచ్సీయూపై నెగ్గాయి.