ముహూర్తం ముంచుకొస్తున్నా మీనమేషాలేనా?
దేవీచౌక్ (రాజమహేంద్రవరం) : అంత్యపుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులతో చర్చించకపోవడం శోచనీయమని శాసనమండలి సభ్యుడు, భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన కోటిలింగాలఘాట్, పుష్కరఘాట్, టీటీటీ ఘాట్, సరస్వతిఘాట్, వీఐపీ ఘాట్లను సందర్శించారు. సోమువీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు నాలుగే రోజులే గడువున్నా, అధికారులు అలసత్వం వీడలేదన్నారు. ఆది పుష్కరాలలో నీరు లేక, సీలేరు నుంచి విడుదల చేశారని, ఇప్పుడు ముందుగానే వరదలు రావడంతో గోదావరిలో తగినంత నీరు ఉందన్నారు. ఘాట్లలో పరిశుభ్రతపై దృష్టి సారించాలని, స్త్రీలు దుస్తులు మార్చుకునేటందుకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఘాట్లలో పేరుకుని పోయిన బురదను తొలగించుడానికి అగ్నిమాపక విభాగం సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఓఎన్జీసీ, ఇంటర్నేషనల్ పేపర్ మిల్స్వంటి సంస్థలనుంచి మోటార్లు తెప్పించుకుని నల్లా చానెల్ వద్ద అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. త్వరలో కలెక్టర్ను కలసి, సమస్యలపై చర్చిస్తామన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పొట్లూరి రామ్మోహనరావు, కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణారావు, మీడియా ఇన్చార్జి దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.