breaking news
Upset Price
-
వేలానికి వేళాయే!
♦ మరోసారి భూముల అమ్మకానికి సన్నాహాలు ♦ జంట జిల్లాల్లో 16 చోట్ల స్థలాలు గుర్తింపు ♦ మలి జాబితాలో పుప్పాల్గూడలో 100 ఎకరాలు ♦ అప్సెట్ ధరను ఖరారు చేయాలని ఆదేశం ♦ జిల్లా యంత్రాంగానికి అందిన లేఖ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మరోసారి భూముల వేలానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. విశ్వనగరంగా మలిచేందుకు అవసరమైన నిధుల సమీకరణకు భూముల అమ్మకమే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న సర్కారు.. నగర శివార్లలో హాట్కేకుల్లా అమ్ముడుపోయే స్థలాల గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టింది. గతేడాది రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ మండలాల్లోని 16 పార్శిళ్లలో భూములను విక్రయించడం ద్వారా సుమారు రూ.350 కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం తాజాగా ఆరు చోట్ల 6.70 ఎకరాలను అమ్మకానికి ప్రణాళిక తయారు చేసింది. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విలువైన భూముల జాబితాపై చర్చ జరిగింది. దీంట్లో జల్లెడ పట్టిన ప్రభుత్వం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలోని ఖరీదైన ప్రాంతాల్లో ఆరు పార్శిళ్లను విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అప్సెట్ ప్రైస్ను ఖరారుచేసే బాధ్యతను జిల్లా యంత్రాంగానికి కట్టబెట్టింది. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా 213 బిట్లలో 938 ఎకరాల అమ్మకంతో రూ.3,440 కోట్లు వస్తుందని అధికారయంత్రాంగం లెక్క గట్టింది. ఇందులో రెండు వేల ఎకరాల యూఎల్సీ భూములను కూడా చేర్చింది. అయితే, ఈ భూముల వేలంపై వెనక్కి తగ్గిన సర్కారు.. రియల్ బూమ్కు అనుగుణంగా స్థలాల వేలాలను వేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే తొలి విడతలో కొంత మేర భూముల అమ్మకాన్ని చేపట్టిన సర్కారు.. తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కలిపి 16 పార్శిళ్లను విక్రయానికి ముహూర్తం ఖరారు చేస్తోంది. త్వరలో పుప్పాల్గూడ భూములు ప్రస్తుతం 32,428 చదరపు అడుగుల మేర ప్రభుత్వ భూముల వేలం వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మలిదశలో పుప్పాల్గూడలో 100 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని అమ్మే దిశగా అడుగులు వేస్తోంది. కొన్నేళ్లుగా కోర్టు వివాదంలో ఉన్న ఈ భూమిపై తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. బహుళ జాతి సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలకు చేరువలో ఉన్న ఈ భూమి విక్రయం ద్వారా ఖజానాను నింపుకోవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భూములకు సంబంధించిన స్కెచ్, ఇతర వివరాలను తక్షణమే పంపాలని జిల్లా యంత్రాంగానికి టీఎస్ఐఐసీ లేఖ రాసింది. ఈ భూమి విక్ర యం ద్వారా కనిష్టంగా రూ.2,500 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తోంది. -
మద్యం షాపులకు డిమాండ్ కరువు
సాక్షి, విశాఖపట్నం: మద్యం దుకాణాల నిర్వహణకు వ్యాపారులు కరువు కావడం ఎక్సైజ్ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లోని షాపులు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. మారిన పరిస్థితు ల్లో లాభాలు తగ్గిపోవడం ఒక కారణమైతే అప్సెట్ ధర అధికంగా ఉండడం కూడా వ్యాపారులు ముందుకు రాకపోవడానికి కారణం. జిల్లాలో 406 మద్యం దుకాణాలుండగా ఇంకా 89 షాపులు లెసైన్స్దారుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇందులో సగం వరకు షాపులు గత ఏడాది లాటరీలో ఎవరో ఒకరు దక్కించుకున్నవే. లెసైన్స్ రెన్యువల్కు వీరు ముందుకు రాకపోవడంతో గత ఏడాది మిగిలిపోయిన, ఈ ఏడాది రెన్యువల్ కాని షాపులు మొత్తం 89కి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, మూడో తేదీన లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని పేర్కొన్నారు. తీరా శుక్రవారం సాయంత్రం బాక్స్ తెరిచి చూసిన ఎక్సైజ్ అధికారులు షాకయ్యారు. కేవలం రెండే రెండు దరఖాస్తులు వచ్చాయి. గాజువాక పరిధిలోని లంకెలపాలెం, పెందుర్తి పరిధిలోని చీమలాపల్లి దుకాణాలకు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. పోటీ లేకపోవడంతో శనివారం అధికారులు, వ్యాపారుల సమక్షంలో ఆ రెండు దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించేశారు. రూ.64 లక్షల చొప్పున అప్సెట్ ప్రైస్ వసూలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆదివారం నుంచి వారికి లెసైన్సులిచ్చేసినట్టేనని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామచంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. మిగతా దుకాణాల పరిస్థితి ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. మరో రెండు ప్రభుత్వ ఔట్లెట్లు? జిల్లా వ్యాప్తంగా ఇంకా 87 దుకాణాలకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వమే ఔట్లెట్లు ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కంచరపాలెం, పెందుర్తి ప్రాంతాల్లో ఔట్లెట్లు నడుస్తున్నాయి. మరో రెండు యూనిట్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. వీటి నిర్వహణకు కూడా సిబ్బంది కావాలి. దీంతో సాధ్యాసాధ్యాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త వాటిని ప్రారంభించేయోచనలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.