breaking news
Transport Vechicles
-
మహీంద్రా నుంచి కమర్షియల్ వెహికల్ విడుదల..ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తేలికపాటి వాణిజ్య వాహనం కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ను విడుదల చేసింది. ధర ఎక్స్షోరూంలో రూ.7.68 లక్షల నుంచి ప్రారంభం. 1,300 కిలోల సరుకును మోయగలదు. వారంటీ మూడేళ్లు లేదా ఒక లక్ష కిలోమీటర్లు. మెరుగైన రవాణా కోసం ఆర్15 టైర్లను వినియోగించారు. 20,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. 2–3.5 టన్నుల తేలికపాటి వాణిజ్య వాహన విభాగంలో కంపెనీకి దక్షిణాదిన 43 శాతం వాటా ఉందని మహీంద్రా ఎస్వీపీ వెంకట్ శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ భారత్లో 2–3.5 టన్నుల విభాగం మార్కెట్ ఏటా 8,000 యూనిట్లు ఉంది. -
మురిపెంగా.. మొదటి మారుతి!
భారతదేశంలో వ్యక్తిగత రవాణా వాహనాల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చింది ‘మారుతి 800’. 1980లలో ఉన్నత, ఎగువ మధ్య తరగతి కుటుంబాలతో ఈ కారు భావోద్వేగపూరిత బంధాన్ని పెనవేసుకొంది. కొంతమందిలో ఆ బంధం ఇప్పటికీ తాజాగా ఉంది. హర్పాల్సింగ్, గుల్షాన్బీర్ కౌర్... దేశంలో అమ్ముడైన తొలి మారుతి 800 ఓనర్లు! మార్కెట్లో అందుబాటులోకి వచ్చాక దాన్ని కొనడానికి లక్షల మంది పోటీ పడగా, లక్కీ డ్రాలో ఆ అదృష్టం వీరిని వరించింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా హర్పాల్ తొలి కారు తాళం చెవులు అందుకొన్నారు! అప్పటి ధర 47,000. 33 యేళ్లు గడిచిపోయాయి. హర్పాల్ తర్వాత ఎంతమంది ఆ కారును కొన్నా, ఆ క్రేజీ కారు తొలి ఓనర్గా ఈ సర్దార్జీ చరిత్రలో స్థానం సంపాదించుకొన్నారు. 2010లో హర్పాల్ సింగ్ మరణించారు. రెండేళ్ల తర్వాత ఆయన భార్య కూడా కాలం చేశారు. ఇదే సమయంలో మారుతి కంపెనీ 800 కారుల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టుగా ప్రకటించింది. కాలుష్య నియంత్రణ విషయంలో అమల్లోకి వచ్చిన చట్టాల నేపథ్యంలో ఈ కారు ఉత్పత్తిని ఆపివేస్తున్నట్టుగా దాదాపు ఏడాది కిందట మారుతి ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. దీంతో చాలా మంది మారుతి 800 ఓనర్లు గందరగోళంలో పడ్డారు. తమ కార్లను వదిలించుకొన్నారు! అయితే హర్పాల్ సింగ్ కుటుంబం మాత్రం ఆ కారును వదులుకొనే ప్రసక్తే లేదంటోంది. తొలి అనుబంధం తమ దగ్గరే పదిలంగా ఉండాలని కోరుకుంటోంది.