breaking news
TMU wins
-
జట్టు కట్టినా దక్కని విజయం
గుర్తింపు ఎన్నికల్లో రెండో స్థానంలో ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్ ఒకే డిపోలో రెండో స్థానానికి పరిమితమైన ఎన్ఎంయూ మిగతా డిపోల్లో వంద లోపే ఓట్లు హన్మకొండ : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఐక్య కూటమిగా ఏర్పడిన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఫ్) విజయాన్ని అందుకోలేక పోయింది. టీఎంయూ వేగాన్ని అందుకోలేక.. బాణం తాకిడి తట్టుకోలేక ఇతర యూనియన్లు కకావికలమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్తో జత కట్టిన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపు కోసం జరిగిన పోటీలో రీజియన్లో మెజారిటీ సాధించింది. అప్పటి వరకు సుదీర్ఘకాలం గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న ఎన్ఎంయూకూ పోటీగా ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ జతకట్టాయి. అయితే, ఆ ఎన్నికల్లో ఈయూ రాష్ట్ర గుర్తింపు సాధించగా, టీఎంయూ రీజియన్ గుర్తింపు సాధించింది. ఇక ఎన్ఎంయూ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ ఎన్నికల్లో రీజియన్లోని ఎనిమిది డిపోల్లో జనగామ, మహబూబాబాద్లో ఎన్ఎంయూ మెజారిటీ ఓట్లు సాధించగా మిగతా ఆరు డిపోల్లో ఈయూ, టీఎంయూ కూటమి మెజారిటీ ఓట్లు సాధించింది. 2012లో వరంగల్ రీజియన్లో 4,355 ఓట్లు ఉండగా 4,256 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర గుర్తింపు కోసం పోటీ చేసిన ఎంప్లాయీస్ యూనియన్ 2,460 ఓట్లు సాధించింది. ఇక తాజాగా మంగళవారం జరిగిన ఎన్నికలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపుకు పోటీ పడి 1,395 ఓట్లు మాత్రమే సాధించి రెండో స్థానానికి పరిమితమైంది. 2012 ఎన్నికల్లో రీజియన్ గుర్తింపుకు పోటీ పడిన టీఎంయూ 2,541 ఓట్లు సాధించగా.. ప్రస్తుత ఎన్నికలో టీఎంయూ రీజియన్ గుర్తింపు(క్లాస్–6)నకు 2,405 ఓట్లు, రాష్ట్ర గుర్తింపు(క్లాస్–3)నకు 2,397 ఓట్లు సాధించింది. గత ఎన్నికలతో చూస్తే స్వల్పంగా ఓట్లు తగ్గినా సగానికి పైగా ఓట్లు సాధించి గుర్తింపు సాధించడం విశేషం. గత ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగిన ఎన్ఎంయూ ప్రస్తుత ఎన్నికల్లో కనీస ప్రభావం చూపకపోవడం గమనార్హం. జిల్లాలోని తొమ్మిది డిపోల్లో ఒక్క జనగామలోనే రెండో స్థానంలో నిలవగా మిగతా డిపోలో వంద లోపు ఓట్లు మాత్రమే పడ్డాయి. 2012లో జరిగిన ఎన్నికల్లో క్లాస్–3లో 1,538 ఓట్లు సాధించిన ఎన్ఎంయూ ఈ ఎన్నికల్లో కేవలం 413 ఓట్లు మాత్రమే సాధించింది. క్లాస్–6లో గత ఎన్నికల్లో 1,425 ఓట్లు సాధించిన ఎన్ఎంయూ ఈ ఎన్నికల్లో 435 ఓట్లతో సంతృప్తి పడింది. ఎంప్లాయీస్ యూనియన్తో కలిసి పోటీ చేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రస్తుత ఎన్నికల్లో క్లాస్–6కు పోటీ పడి 1,305 ఓట్లు సాధించి ద్వితీయ స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో ఈ యూనియన్ క్లాస్–3లో 223, క్లాస్–6లో 229 ఓట్లు సాధించింది. ఐక్యకూటమిగా ఏర్పడి ఓట్లు శాతాన్ని పెంచుకుందే తప్ప గుర్తింపునకు నోచుకోలేదు. ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన బహుజన కార్మిక యూనియన్ క్లాస్–3లో 12 ఓట్లు, క్లాస్–6లో 19 ఓట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంయూ వరంగల్ రీజియన్లోని తొమ్మిది డిపోలు, ఆర్ఎం కార్యాలయంలో సగానికి పైగా ఓట్లు సాధించి అన్ని డిపోలో తన ఆధిక్యాన్ని నిలుపుకుంది. ఐక్యకూటమి తొమ్మిది డిపోల్లోని ఎనిమిది డిపోల్లో ద్వితీయ స్థానంలో నిలవగా ఎన్ఎంయూ కేవలం జనగామ డిపోలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. క్రాస్ ఓటింగ్... ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ఫలితాల వెల్లడయ్యాక పలువురు చెబుతున్నారు. నాయకుల ఒత్తిడి మేరకు కొంత మంది కార్మికులు తమ రెండు ఓట్లలో ఒక్కో ఓటు ఒక్కో యూనియన్కు వేశారు. ఈ ఎన్నికల్లో అగ్ర భాగాన నిలిచిన తెలంగాణ మజ్దూర్ యూనియన్కు సైతం క్రాస్ ఓటింగ్ తప్పలేదు. రాష్ట్ర గుర్తింపు క్లాస్–3కు 2,397 ఓట్లు రాగా, రీజియన్ గుర్తింపు క్లాస్–6కు 2,405 ఓట్లు పడడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. రీజియన్ గుర్తింపును సమర్థించిన ఎనిమిది మంది ఓటర్లు రాష్ట్ర గుర్తింపునకు టీఎంయూను వ్యతిరేకించినట్లు భావించాల్సి వస్తోంది. ఐక్య కూటమిగా పోటీ చేసిన ఈయూ, ఎస్డబ్లు్యఎఫ్లకు పడిన ఓట్లలోను తేడా కనిపించింది. క్లాస్–3కి ఫోటీ చేసిన ఈయూకు 1,395 ఓట్లు రాగా, క్లాస్–6కు పోటీ చేసిన ఎస్డబ్ల్యూఎఫ్కు 1,305 ఓట్లు వచ్చాయి. అంటే క్లాస్–3కి పోటీ చేసిన ఈయూకు, క్లాస్–6కు పోటీ చేసిన ఎస్డబ్ల్యూఎఫ్ కంటే 90 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక ఎన్ఎంయూకు క్లాస్–3లో 413 ఓట్లు రాగా, క్లాస్–6లో 435 ఓట్లు.. అంటే 22 ఓట్లు అధికంగా వచ్చాయి. వరంగల్ రీజియన్లో ఎప్పుడూ కనిపించని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్కు క్లాస్–6లో 30 ఓట్లు వచ్చాయి. అయితే, ఐక్యకూటమిగా పోటీ చేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ క్లాస్–6కు పోటీ చేసింది. ఈ రెండు సంఘాల పేర్ల నడుమ సామీప్యత ఉండడం వల్లే స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్కు పడాల్సిన ఓట్లు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్కు పడినట్లు భావిస్తున్నారు. ఈ ఓట్లు కూడా క్లాస్–3కి కాకుండా ఒక్క క్లాస్–6లోనే పడడంతో వీరి భావనకు బలం చేకూరుస్తోంది. -
గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూ విజయం
హన్మకొండ : తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరిగిన ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఏకపక్ష విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో టీఎంయూ బాణం గుర్తు దూసుకుపోయింది. రీజియన్ గుర్తింపుతోపాటు రాష్ట్ర గుర్తింపునకు మెజారిటీ ఇచ్చింది. వరంగల్ రీజియన్లో 9 డిపోల్లో టీఎంయూ విజయం సాధించింది. నాన్ ఆపరేషన్ సెక్షన్లో కూడా టీఎంయూ హవా కొనసాగింది. వరంగల్ రీజియన్లో మొత్తం 4310 ఓట్లు ఉండగా 4232 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గుర్తింపునకు (క్లాస్–3లో) 2397 ఓట్లు సాధించగా.. రీజియన్ గుర్తింపునకు (క్లాస్–6లో) 2405 ఓట్లు సాధించింది. ప్రధాన ప్రత్యర్థిగా ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నిలిచింది. రాష్ట్ర గుర్తింపు క్లాస్–3కి ఎంప్లాయీస్ యూనియన్ పోటీపడి 1395 ఓట్లు సాధించగా.. రీజియన్ గుర్తింపునకు పోటీ పడిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 1305 ఓట్లు సాధించింది. మరో యూనియన్ ఎన్ఎంయూ రాష్ట్ర గుర్తింపునకు 413 ఓట్లు, రీజియన్ గుర్తింపునకు 435 ఓట్లు సాధించింది. బహుజన కార్మిక యూనియన్ రాష్ట్ర గుర్తింపునకు 12 ఓట్లు, రీజియన్ గుర్తింపునకు 19 ఓట్లు సాధించింది. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రీజియన్ గుర్తింపునకు 30 ఓట్లు సాధించింది. కాగా, రాష్ట్ర గుర్తింపునకు జరిగిన పోలింగ్లో 9 ఓట్లు చెల్లకపోగా, రీజియన్ గుర్తింపునకు పోలైన ఓట్లలో 22 ఓట్లు చెల్లలేదు. పోస్టల్ బ్యాలెట్ కోసం 35 ఓట్లు అర్హత సాధించాయి. నాన్ ఆపరేషన్ సెక్షన్లో మొత్తం 61 ఓట్లు ఉండగా.. టీఎంయూకి రాష్ట్ర, రీజియన్ గుర్తింపునకు 41 ఓట్ల చొప్పున పోలయ్యాయి. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపునకు 19 ఓట్లు, రీజియన్ గుర్తింపునకు 18 ఓట్లు సాధించాయి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ మొత్తం ఓట్లలో సగానికైగా ఓట్లు సాధించి రీజియన్ గుర్తింపు సాధించింది. హన్మకొండ డిపోలో.. హన్మకొండలోని వరంగల్–1, వరంగల్–2, హన్మకొండ డిపోల్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయదుందుభి మోగించింది. రాష్ట్ర, రీజియన్ గుర్తింపునకు ప్రత్యర్థి యూనియన్ల కంటే మెజారిటీ సాధించింది. హన్మకొండ డిపోలో 636 ఓట్లు ఉండగా 629 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రాష్ట్ర గుర్తింపునకు 352 ఓట్లు, రీజియన్ గుర్తింపునకు 344 ఓట్లు సాధించింది. రాష్ట్ర గుర్తింపునకు ఎంప్లాయీస్ యూనియన్ 268 ఓట్లు సాధించగా.. ఐక్య కూటమిగా పోటీ చేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ గుర్తింపునకు 263 ఓట్లు సాధించింది. ఎన్ఎంయూ రాష్ట్ర, రీజియన్ గుర్తింపునకు ఐదేసి ఓట్లు సాధించింది. క్లాస్–3లో ప్రత్యర్థి యూనియన్ అయిన ఎంప్లాయీస్ యూనియన్పై తెలంగాణ మజ్దూర్ యూనియన్ 84 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. క్లాస్–6లో ప్రత్యర్థి యూనియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్పై టీఎంయూ 81 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. వరంగల్–1 డిపోలో.. డిపోలో 596 ఓట్లు ఉండగా 574 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గుర్తింపునకు 383 ఓట్లు, రీజియన్ గుర్తింపునకు 380 ఓట్లు సాధించింది. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపునకు 170 ఓట్లు, రీజియన్ గుర్తింపునకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 162 ఓట్లు సాధించింది. నేషనల్ మజ్దూర్ యూనియన్కు క్లాస్–3లో 13 ఓట్లు, క్లాస్–6లో 18 ఓట్లు వచ్చాయి. క్లాస్–3లో ప్రత్యర్థి యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్పై తెలంగాణ మజ్దూర్ యూనియన్ 213 ఓట్ల భారీ మెజారిటీ సాధించింది. క్లాస్–6లో ప్రత్యర్థి యూనియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్పై టీఎంయూ 218 ఓట్ల భారీ మెజారిటీ సాధించింది. వరంగల్ –2డిపోలో.. డిపోలో 549 ఓట్లు ఉండగా టీఎంయూ రాష్ట్ర గుర్తింపునకు 270 ఓట్లు, రీజియన్ గుర్తింపునకై 280 ఓట్లు సాధించింది. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపునకు 182 ఓట్లు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ గుర్తింపునకు 159 ఓట్లు సాధించింది. నేషనల్ మజ్దూర్ యూనియన్ క్లాస్–3లోS 74 ఓట్లు, క్లాస్–6లో 82 ఓట్లు సాధించింది. ఈ డిపోలో క్లాస్–3లో ప్రత్యర్థి యూనియన్ ఈయూపై టీఎంయూ 88 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. క్లాస్–6లో ప్రత్యర్థి యూనియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్పై టీఎంయూ 121ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. రీజినల్ మేనేజర్ కార్యాలయంలో.. ఆర్ఎం కార్యాలయంలో మొత్తం 47 ఓట్లు ఉం డగా 46ఓట్లు పోలయ్యాయి. ఇందులో క్లాస్–3లో టీఎం యూకు 33, క్లాస్–6లో 35 ఓట్లు, ఎంప్లాయీస్ యూనియన్కు క్లాస్–3లో 8ఓట్లు, ఐక్య కూటమికి చెందిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్కు క్లాస్–6లో 3ఓట్లు, ఎన్ఎంయూకు క్లాస్–3లో 5ఓట్లు, క్లాస్–6లో 7ఓట్లు సాధించింది. ఇక్కడ ప్రత్యర్థి యూనియన్ అయిన ఎంప్లాయీస్ యూనియన్పై 25 ఓట్ల మెజారిటీ సాధించగా క్లాస్–6లో ప్రత్యర్థి యూనియన్ ఎన్ఎంయూపై టీఎంయూ 28 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. మానుకోటలో టీఎంయూకు 175 ఓట్ల ఆధిక్యం మహబూబాబాద్ : మానుకోట ఆర్టీసీ డిపోలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రిసైడింగ్ అధికారి రమేష్ తెలిపారు. మొత్తం 337 ఓట్లకు 329 ఓట్లు పోలయ్యాయి. 3 పోస్టల్ ఓట్లు ఉండగా.. 5 ఓట్లు పోలు కాలేదని ఆయన పేర్కొన్నారు. క్లాస్–6లో 329 ఓట్లకు 247 ఓట్లు, ఐక్య కూటమి (ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్)కు 72 ఓట్లు పోలయ్యాయి. 175 ఓట్ల మెజారిటీతో టీఎంయూ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. క్లాస్–3 (స్టేట్)లో టీఎంయూకు 245 ఓట్లు, ఐక్య కూటమికి 83 ఓట్లు పోలయ్యాయి. 162 ఓట్ల మెజారిటీ టీఎంయూకు దక్కింది. టీఎంయూ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించడంతో ఆ యూనియన్ నాయకులు బీఆర్.రెడ్డి, ఎంఆర్.రెడ్డి, పి.లక్ష్మయ్య, కె.మల్లయ్య ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సాదిక్, వెంకటేశ్వర్లు, వెంకన్న, శ్రీనివాస్, పూల్సింగ్, ఉమాదేవి, రమాదేవి, శోభ, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. పరకాలలో.. పరకాల : ఎన్నికల్లో రీజియన్ స్థాయిలో టీఎంయూకు 220 ఓట్లు, ఎస్డబ్ల్యూఎఫ్ (ఐక్య కూటమి)కి 171 ఓట్లు, ఎంఎంయూకు 46 ఓట్లు, ఏపీఎస్ఆర్టీసీ (ఎస్డబ్ల్యూఎఫ్, త్రాచుగుర్తు)కు 7 ఓట్లు, తెంగాణ రోడ్డు ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ బహుజన కార్మిక సంఘం (చక్రంగుర్తు)కు 2 ఓట్లు రాగా ఒకఓటు చెల్లలేదు. రాష్ట్రస్థాయిలో టీఎంయూకు 206 ఓట్లు, ఈయూ (ఐక్య కూటమి)కి 188 ఓట్లు, ఎంన్ఎంయూకు 50 ఓట్లు, తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్డు కార్పొరేషన్ బహుజన కార్మిక సంఘం (చక్రం గుర్తు)కు 2 ఓట్లు రాగా 1 ఓటు చెల్లలేదు. రీజియన్లో టీఎంయూ 49ఓట్ల మెజారిటీ, రాష్ట్రస్థాయిలో డిపో నుంచి 18 ఓట్ల మెజార్టీని సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డీవీ.కిషన్రావు తెలిపారు. జనగామలో టీఎంయూ హవా.. జనగామ : టీఎస్ ఆర్టీసీ జనగామ డిపోలో మంగళవారం జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూ (తెలంగాణ మజ్దూర్ యూనియన్) ఘన విజయం సాధించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు పొలింగ్ అధికారి చాణక్య తెలిపారు. మొత్తం 524 ఓట్లకు 522 నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. క్లాస్ –6 రీజియన్ జిల్లా గుర్తింపులో టీఎంయూకు 283, ఎన్ఎంయూకు 204, డీఎంస్కు 25, ఈయూకు 64, బీకేఎస్–2, ఇన్వాలిడ్కు –2 ఓట్లు రాగా.. టీఎంయూ 73 ఓట్ల మెజార్టీ సాధించింది. క్లాస్–3లో రాష్ట్ర గుర్తింపులో టీఎంయూకు 277, ఎన్ఎంయూకు 180, ఈయూ 64, బీఎంఎస్ 1 ఓట్లు లభించగా.. టీఎంయూ 97 ఓట్ల మెజార్టీ సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు, డిపో సెక్రటరీ లక్ష్మీపతి, అధ్యక్షుడు గంబీర్రెడ్డి, గ్యారేజ్ సెక్రటరీ గిరిమల్ల రాజు, నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తొర్రూరులో 106 ఓట్ల మెజారిటీ.. తొర్రూరు : తొర్రూరు ఆర్టీసీ డిపోలో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూ విజయం సాధించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిపోలో జరిగిన ఎన్నికల పోలింగ్లో మొత్తం 415 మందికి 411 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)కు 246 ఓట్లు, ఎస్డబ్ల్యూఎఫ్కు 140 ఓట్లు, ఎన్ఎంయూకు 24 ఓట్లు వచ్చాయి. మిగిలిన ఒక్కఓటు చెల్లలేదు. ఎస్డబ్ల్యూఎఫ్పై తెలంగాణ మజ్దూర్ యూనియాన్ (టీఎంయూ) 106 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందింది. దీంతో టీఎంయూ నాయకులు గంధసిరి వెంకన్న, బీకే. స్వామి, మల్లికార్జున్, బీవీ.స్వామి, సోమన్న, రమేష్, ఉప్పలయ్య, శంకరయ్య, కార్మికులు సంబరాలు చేసుకున్నారు. భూపాలపల్లిలో.. భూపాలపల్లి : భూపాలపల్లి డిపోలో టీఎంయూ ఘన విజయం సాధించింది. టీఎంయూ, ఎన్ఎంయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్డబ్ల్యూయూ) ఒంటరిగా పోటీ చేయగా.. ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) కూటమిగా బరిలో నిలిచాయి. ప్రధానంగా ఈయూ కూటమికి, టీఎంయూకు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. భూపాలపల్లి డిపోలో 292 మంది ఓటర్లు ఉండగా ఈ ఎన్నికల్లో 290 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరు కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటింగ్ ముగిసిన అనంతరం సుమారు 6.30 గంటలకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. గంట వ్యవధిలోనే లెక్కింపు పూర్తయింది. స్థానిక డిపోలో క్లాస్–3 (రాష్ట్రస్థాయి), క్లాస్–6(రీజియన్ స్థాయి)లో ఎంయూ కూటమిపై టీఎంయూ ఆధిక్యం సాధించింది. ఈయూపై రీజియన్కు 14, రాష్ట్రస్థాయికి 10 ఓట్ల ఆధిక్యం టీఎంయూకు లభించింది. నర్సంపేటలో టీఎంయూకు భారీ మెజారిటీ.. నర్సంపేట : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూ భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల ఇన్చార్జి, లేబర్ ఆఫీసర్ విక్టోరియా తెలిపారు. నర్సంపేట డిపో పరిధిలో మొత్తం 462 ఓట్లకు 458 ఓట్లు పోలయ్యాయి. హెడ్ ఆఫీస్ లెవల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్కు 254, బహుజన కార్మిక యూనియన్కు 03, ఎంప్లాయీస్ యూనియన్కు 140, నేషన్ మజ్దూర్ యూనియన్కు 57 ఓట్లు వచ్చాయి. రీజినల్ లేవల్లో టీఎంయూకు 228, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ 6, బహుజన కార్మిక యూనియన్ 02, ఎన్ఎంయూ 34, సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్ 01, ఎస్డబ్ల్యూఎఫ్కు 179 ఓట్లు పోలైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నర్సంపేట డిపో గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో కార్మికులు సంబరాలను జరుపుకున్నారు. డిపో ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నర్సంపేట రూరల్ సీఐ బోనాల కిషన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ మధుసూదన్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.