breaking news
theam park
-
ప్రేమతో...
బనశంకరి: ప్రేమికులందరూ ఎంతో ఆరాటంగా ఎదురుచూసే వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) వచ్చేయడంతో యువతీ యువకుల హృదయాలు తుళ్లిపడుతున్నాయి. మనసైనవారి ముందు తమ ఆకాంక్షను వ్యక్తంచేయడానికి, ఇప్పటికే మనసిచ్చినవారికి ప్రేమ కానుకలతో ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. బళ్లారి, మైసూరు, హుబ్లీ–ధార్వాడ, మంగళూరు తదితర నగరాల్లోనూ ప్రేమికుల రోజు సందడి మొదలైంది. ప్రేమ పేరు, ప్రేమికుల రోజు పేరు తలుచుకున్నా ప్రతీఒక్కరికీ మదిలో ఠక్కున మెదిలేది గులాబీలే. ప్రేమికులు రోజా పూలను ఇవ్వడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచడం ఆనవాయితీ అయ్యింది. బుధవారం కోసం గులాబీలకు డిమాండ్ అమాంతం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల గులాబీలకు ఆర్డర్లు రాగా, మరో 42 లక్షల గులాబీ పుష్పాలు విదేశాలకు ఎగుమతైనట్లు సమాచారం. పార్కులు కిటకిట ప్రముఖ పార్కులైన కబ్బన్పార్క్, లాల్బాగ్లతో పాటు చిన్నచితకా పార్కులు కూడా ప్రేమ జంటలకు విడిది కాబోతున్నాయి. సాధారణ రోజుల్లో కబ్బన్పార్క్, లాల్బాగ్లలో 300 జంటల వరకు కనిపిస్తే, ప్రేమికుల రోజు ఆ సంఖ్య వెయ్యికి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాల్స్, హోటళ్లలోథీమ్ పార్టీల జోరు వాలంటైన్స్ డే సందర్భంగా నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లు, పబ్లలో సరికొత్త థీమ్ పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ థీమ్ పార్టీల్లో ప్రేమ జంటల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తున్నాయి. ఒకరి అభిరుచులు, ఇష్టాఇష్టాలపై వారి భాగస్వామికి ఉన్న అవగాహనను పరీక్షించడానికి నిర్వహించే చిన్నపాటి క్విజ్లు, తమ తమ జీవితాల్లో మరుపురాని రోజులుగా నిలిచిన తేదీల గురించి ప్రశ్నలు వేయడం లాంటి పోటీలు ఈ థీమ్పార్టీలో భాగంగా ఉన్నాయి. ఈ తరహా పోటీల్లో గెలిచిన వారికి రకరకాల బహుమతూల లభిస్తాయి. కాలేజీల్లోనూ సందడే నగరంలోని కొన్ని కళాశాలల్లోను వాలంటైన్స్ డే సరదాల సందడి కనిపిస్తోంది. ‘ప్రేమ’ అంటే? ఈ ప్రశ్నకు తమదైన రీతిలో సమాధానం చెప్పాల్సిందిగా కళాశాల యాజమాన్యాలు విద్యార్ధులకు పోటీలు నిర్వహిస్తున్నాయి. విద్యార్ధులు కూడా ఈ తరహా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రేమకు నిర్వచనాన్ని తమదైన రీతిలో చెబుతున్నారు. కొంతమంది విద్యార్ధులు ఇందుకోసం చిత్రకళను ఎంచుకుంటే, మరికొంత మంది విద్యార్ధులు కుడ్యచిత్రాల ద్వారా తమ సమాధానాలను చెబుతున్నారు. నగరంలోని పలు ఫ్యాషన్ టెక్నాలజీ కళాశాల్లో ఈ తరహా పోటీలనే నిర్వహించారు. సంఘాల కన్నెర్ర, పోలీసుల భద్రత ప్రేమికుల రోజు పేరుతో యువతీ, యువకులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారనీ దేశ సంస్కృతికి భంగం కలిగించే కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వరాదని కోరుతూ హిందూ జనజాగృతి సమితి కార్యకర్తలు నగర పోలీస్ కమిషనర్ సునీల్కుమార్కు వినతిపత్రం అందించారు. ఏటా మాదిరిగా ఈసారి ప్రేమికుల రోజుకు మద్దతుగా వాటాళ్ నాగరాజు ఏం కార్యక్రమం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. వాలెంటైన్స్డేను వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు ప్రేమ జంటలపై దాడులకు పాల్పడవచ్చనే అనుమానంతో బెంగళూరులో కబ్బన్ పార్క్, లాల్బాగ్ పార్కుల్లో సుమారు వంద మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా 30కిపైగా పోలీసుల బృందాలు పహరా కాస్తాయి. -
అరెవో సాంబ! షోలే థీమ్ పార్క్ ఎక్కడ?
బెంగళూరు: 1975లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన బాలీవుడ్ చిత్రం ‘షోలే’ గురించి తెలియని తరంగానీ, వినని తరంగానీ ఉండదేమో! అందులో ఏదో సీను, ఎప్పుడోసారి ప్రేక్షకుల మనోఫలకంపై ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అందుకనే బెంగళూరు–మైసూర్ మధ్య పర్యటించే పర్యాటకులు షోలే సినిమా షూటింగ్ జరిగిన కర్ణాటకలోని రామనగర ప్రాంతాన్ని సందర్శిస్తారు. ‘అదిగో ఆ పర్వతంపైనే, అక్కడే గబ్బర్ సింగ్ గుర్రంపై వచ్చి ఠాకూర్ బల్దేవ్ సింగ్ భార్య, పిల్లల్ని కాల్చి చంపుతాడు. ఈ పక్కన బల్దేవ్ సింగ్ ఇల్లు సెట్టింగ్ ఉండేది. అదిగో అల్లంత దూరాన ఠాకూర్ రెండు చేతులు నరికేసిన గబ్బర్ సింగ్ డెన్’ అంటూ దారినపోయే దానయ్యలెందరో ఇక్కడికొచ్చిన పర్యాటకులకు చెబుతుంటారు. ఈ రామనగరాన్నే సినిమాలో రామ్గఢ్గా వ్యవహరించారు. ఈ ప్రాంతాన్ని ‘షోలే’ థీమ్తోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసి సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కానీ అటవి శాఖ మాత్రం అందుకు అనుమతించడం లేదు. షోలే షూటింగ్ జరిగిన ప్రాంతం కేంద్ర రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తోందని, తాము ఎట్టి పరిస్థితుల్లో పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేసేందుకు అనుమతించమని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఈ భూమంతా తమ రెవన్యూ శాఖ పరిధిలోనే ఉన్నందున షోలే థీమ్ పార్క్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెబుతున్నారు. ఇక్కడ షోలో సినిమాలో ఉన్నట్లుగానే గ్రామం సెట్టింగ్, గబ్బర్ సింగ్ గుడారాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 120 ఎకరాల పరిధిలో ట్రెక్కింగ్, ఇతర సాహస క్రీడలను ప్రోత్సహించే సౌకర్యాలు, ఎంటర్టైన్మెంట్ పార్కులు ఉంటాయని ఆయన చెప్పారు. రాబందుల సంరక్షణ కేంద్రం దేశంలో నానాటికి అంతరించిపోతున్న రాబందులను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడే 2012లో 346 హెక్టార్లలో ఓ శాంక్చరీని ఏర్పాటు చేసింది. భారత్, నేపాల్, పాకిస్థాన్ దేశాల్లో కనిపించే లాంగ్ బిల్డ్ జాతితోపాటు ఈజిప్టు, వీపు తెలుపురంగులో ఉండే మరోజాతి రాబందులు ఇప్పుడు ఈ శాంక్చరీలో ఉన్నాయి. భారత దేశంలో లాంగ్ బిల్డ్ జాతి రాబందులు 97 శాతం, ఈజిప్టు జాతి రాబందులు 99 శాతం నశించి పోయిన నేపథ్యంలో కేంద్రం ఈ శాంక్చరీని ఏర్పాటు చేసింది. అభ్యంతరం పెడుతున్న పర్యావరణవేత్తలు షోలే థీమ్ పార్క్ను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేస్తే శాంక్చరీకి ముప్పు వాటిల్లుతుందని ఈ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పర్యావరణవేత్త శివనంజయ్య తెలిపారు. గబ్బర్ సింగ్ గుహ వాస్తవానికి సాంక్చరీ లోపల ఉన్నప్పటికి అక్కడికి పర్యాటకులను అనుమతించమని, శాంక్చరీ సరిహద్దు నుంచే ఆ గుహ గురించి చెబుతామని, పైగా శాంక్చరీకి పది కిలోమీటర్ల ఇవతల నుంచి నిర్మించే షోలే థీమ్ పార్కులోనే గబ్బర్ గుహను ఏర్పాటు చేస్తామని పర్యాటక మంత్రి ఖర్గే చెబుతున్నారు. రాబందులవి చాలా సున్నితమైన జీవితాలని, వాటికి సరిహద్దులు గుర్తించే తెలివితేటలు కూడా లేవని శివనంజయ్య అంటున్నారు. ఇప్పటికే శాంక్చరీ లోపలున్న రామ మందిరాన్ని సందర్శించేందుకు భక్తులు రావడం, అప్పుడప్పుడు ఉత్సవాలు జరపడం వల్ల రాబందులకు ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్యాసేజ్ టూ ఇండియా’ కూడా ఇక్కడ తీసిందే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు డేవిడ్లీన్ తీసిన ‘ఏ ప్యాసేజ్ టు ఇండియా’ చిత్రం కూడా ఇక్కడ తీసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం షూటింగ్ను 1983–1984లో ఇక్కడ రామనగరలో నిర్వహించారు. అప్పడు ఇక్కడి పర్వతాలపై కొన్ని బండరాళ్లను బాంబులతో పగులగొట్టడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లిందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో తొలిసారిగా 1966లో జాన్బెర్రీ తీసిన జంగిల్ అడ్వెంచర్ చిత్రం ‘మాయా’ షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన రామ్ యెదేకర్ ఆ తర్వాత ‘షోలే’కు పనిచేశారు. యెదేకర్ సూచన మేరకే రమేష్ సిప్పీ షోలే షూటింగ్ను ఇక్కడ తీశారు. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయి షోలో షూటింగ్ నాటి జ్ఞాపకాలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని రాబందుల శాంక్చరీకి వాచ్మేన్గా పనిచేస్తున్న 60 ఏళ్ల వీరయ్య తెలిపారు. షూటింగ్ నాటికి 18 ఏళ్లు ఉన్న వీరయ్య ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను కూడా పోషించారు. అవసరమైనప్పుడల్లా గబ్బర్ సింగ్కు తుపాకీ తెచ్చియ్యడమే తన పాత్రని, ప్రభుత్వం థీమ్ పార్క్ను అభివద్ధి చేస్తే తాను గైడ్గా పనిచేస్తానని వివాదంతో సంబంధంలేని వీరయ్య చెప్పారు. షోలో థీమ్ పార్క్ అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నాలు కూడా వివాదాల కారణంగా ఫలించలేదు. ఈసారి ఎందుకో తమ ప్రయత్నాలు ఫలిస్తాయన్న ఆశతో ఉంది.