breaking news
Tera Software Ltd.
-
'టెరాసాఫ్ట్' మమ్మల్నీ మోసగించింది
సాక్షి, అమరావతి: ‘ఫైబర్ గ్రిడ్ల టెండర్లలో టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వాన్నే కాదు కన్సార్టియం ఒప్పందాన్ని ఉల్లంఘించి మా కంపెనీని కూడా మోసం చేసింది’ అని హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కె.జైన్ పేర్కొన్నారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. టెండర్లు దక్కించుకోవడం కోసం తమను కన్సార్టియంలో భాగస్వామిని చేసుకుని అనంతరం మోసం చేశారని ఆయన చెప్పారు. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై సీఐడీ అధికారులు టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు ఆ కంపెనీ కన్సార్టియంలో భాగస్వామి అయిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీతోపాటు అందుకు సహకరించిన అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. టెరాసాఫ్ట్ కంపెనీ తమ కంపెనీని ఎలా మోసం చేసిందనేది అనిల్ కె.జైన్ మాటల్లోనే.. టెండర్ల కోసమే కన్సార్టియంలో భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైబర్ గ్రిడ్ టెండర్లలో పాల్గొనాలంటే కనీసం మూడు కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడాలి. వాటిలో ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టు కోసం ఆప్టికల్ ఫైబర్లు సరఫరా చేసే కంపెనీ కూడా ఉండాలి. ఆ రంగంలో టెరాసాఫ్ట్ కు అనుభవం లేదు. కాబట్టి మమ్మల్ని సంప్రదించి కన్సార్టియంలో భాగస్వామిగా చేర్చుకుని, టెరాసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనుల కోసం పిలిచిన రూ.330 కోట్ల టెండర్లలో మా కంపెనీ రూ.134 కోట్ల విలువైన పనులు చేస్తుందని ఒప్పందంలో ఉంది. కానీ.. కేవలం బిడ్ దాఖలు చేయడానికి అర్హత సాధించేందుకే మాకు అవకాశం కల్పించారని ఆ తరువాత మేం గుర్తించాం. 20 శాతం పనులే ఇచ్చారు టెండర్లు దక్కిన తరువాత మమ్మల్ని పక్కనపెట్టేశారు. కన్సార్టియం ఒప్పందం ప్రకారం మేం రూ.134 కోట్ల విలువైన ఆప్టికల్ కేబుల్స్ వేయాల్సి ఉంది. కానీ మాతో కేవలం రూ.27 కోట్ల విలువైన పనులే చేయించారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ రంగంలో మా కంపెనీకి మంచి పేరుంది. మేం నాణ్యమైన పరికరాలు సరఫరా చేస్తాం. కేంద్ర టెలికాం శాఖ ప్రమాణాల మేరకు ఉండే మా పరికరాల ధర కూడా కాస్త ఎక్కువే. టెండర్ల కోసం వేసిన బిడ్లో మా కంపెనీ సరఫరా చేసే పరికరాలనే వేస్తామని చెప్పిన టెరాసాఫ్ట్ కంపెనీ ఆ తరువాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. చిన్నచిన్న కంపెనీలు ఉత్పత్తి చేసే నాసిరకం కేబుళ్లు, ఇతర పరికరాలతో పనులు చేశారు. ఆ పరికరాలు చాలా తక్కువ ధరకు మార్కెట్లో లభిస్తాయి. అడ్డదారిలో లాభాలు ఆర్జించడానికే టెరాసాఫ్ట్ కంపెనీ ఇలా చేసింది. అందుకే మమ్మల్ని తప్పించింది. టెరాసాఫ్ట్ కంపెనీ సరఫరా చేసిన నాసిరకం పరికరాలతో మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. కన్సార్టియం ఒప్పందం ప్రకారం సరఫరా చేస్తామన్న పరికరాలకు మేం బాధ్యత వహిస్తాం. కానీ ఆ పరికరాలు కాకుండా టెరాసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీల నుంచి నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి పనులు చేసింది. వాటితో మాకెలాంటి సంబంధం లేదు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు భయపడే మౌనంగా ఉన్నాం కన్సార్టియం ఒప్పందం మేరకు మా వాటా పని మాకు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా టెరాసాఫ్ట్ కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. అందుకోసం మేం పంపిన ఈ–మెయిల్స్ మా వద్ద ఉన్నాయి. కన్సార్టియం ఏర్పాటు చేసిన స్ఫూర్తికి విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీ వ్యవహరించింది. దీనిపై అప్పట్లోనే గట్టిగా నిలదీయాలని భావించాం. కానీ.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలు టెరాసాఫ్ట్ కంపెనీకి ఉన్నాయని మాకు తెలుసు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఆ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. అందుకే భయపడి ఏమీ చేయలేక మాకు అన్యాయం జరిగినా మౌనంగా ఉండిపోయాం. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై సీఐడీ కేసు పెట్టడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు రావాలి. -
బ్లాక్లిస్ట్లోని సంస్థకు రూ.333 కోట్ల పనులా?
సాక్షి, హైదరాబాద్: ‘చౌక దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలను అమర్చడంలో విఫలమైన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ను మీ ప్రభుత్వమే బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అలాంటి సంస్థకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.333 కోట్ల పనిని ఎలా అప్పగిస్తారు? హెరిటేజ్ పుడ్స్తో సన్నిహిత సంబంధాలు ఉన్న వేమూరి హరిప్రసాద్ టెరా సాఫ్ట్వేర్ సంస్థకు డెరైక్టర్గా వ్యవహరిస్తున్నారు. అంటే.. అస్మదీయ సంస్థకు రూ.333 కోట్ల పనిని దొడ్డిదారిన కట్టబెట్టారన్నది స్పష్టమవుతోంది. దీనిపై విచారణ జరిపి.. చర్యలు తీసుకునే దమ్ముందా?’ అంటూ సీఎం చంద్రబాబుకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ లేఖ ద్వారా సవాల్ విసిరారు. లేఖ సారాంశమిదీ.. : ‘రాష్ట్రంలో ప్రతి గ్రామానికీఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ పనులకు రూ.333 కోట్లకు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. పర్యవేక్షణకు కమిటీని నియమిస్తూ అందులో ఈ-గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీలో సభ్యుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్ను సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. ఈయన టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్కు డెరైక్టర్గా వ్యవహరిస్తున్నారు. దాని సోదర సంస్థ టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్. మే 11న బ్లాక్లిస్ట్లోకి టెరా..: రాష్ట్రంలోని చౌక దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు అమర్చే పనులను టెరా సాఫ్ట్ట్వేర్ లిమిటెడ్ సంస్థ చేజిక్కిచుకుంది. కానీ.. ఆ యంత్రాలను అమర్చడంలో విఫలమైంది. దాంతో.. టెరా సాప్ట్వేర్ లిమిటెడ్ను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్) బ్లాక్ లిస్ట్లో పెడుతూ ఈ ఏడాది మే 11న ఉత్తర్వులిచ్చింది. కానీ.. రూ.333 కోట్లతో చేపట్టిన పైబర్ గ్రిడ్ ప్రాజెక్టును టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్కు కట్టబెడుతూ నవంబర్ 2న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ పుడ్స్లో డెరైక్టర్గా వ్యవహరిస్తోన్న దేవినేని సీతారామయ్య 2014, సెప్టెంబర్ 30 వరకూ టెరా సాఫ్ట్వేర్ లోనూ డెరైక్టర్గా పనిచేశారు. హెరిటేజ్ పుడ్స్కు, టెరా సంస్థల ఆడిటింగ్ వ్యవహారాలను ఆర్ఎస్ బక్కన్నావార్ చక్కబెడుతున్నారు. హెరిటేజ్ అనుబంధ సంస్థల్లో డెరైక్టర్గా పనిచేస్తోన్న కోలార్ రాజేష్ సీతపల్లి గ్యాస్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు డెరైక్టర్గా వ్యవహరిస్తున్నారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్ కూడా ఆ సంస్థలో డెరైక్టర్గా ఉన్నారు. అందుకే బ్లాక్ లిస్ట్లో పెట్టామన్న అంశాన్ని కూడా విస్మరించి టెరా సాప్ట్వేర్ లిమిటెడ్కు రూ.333 కోట్ల పైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను అక్రమంగా కట్టబెట్టారు. దీనిపై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాలి’ అని చంద్రబాబుకు ఉండవల్లి సవాల్ విసిరారు.