breaking news
Telugu desam alliance
-
Babu : కరకట్టపై పొత్తులు.. బాబు ఏమన్నాడంటే.?
కరకట్ట నివాసం వేడేక్కింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారం రోజులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని స్వగృహానికే పరిమితమయిన చంద్రబాబు.. ఇవ్వాళ ఉండవల్లిలోని కరకట్ట నివాసానికి వచ్చాడు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పొత్తులపై ఆధారపడి అత్యధికంగా ప్రయోజనం పొందిన చంద్రబాబులో.. ఈ సారి మాత్రం ఆ వెలుగు కనిపించడం లేదు. రాజ్యసభలో సైకిల్ మాయం రాజ్యసభ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. గత పది రోజులుగా తెలుగుదేశం వర్గాలు పోటీ చేస్తామంటూ రంకెలేస్తున్నాయి. మా బాబు మామూలోడు కాదని నేతలు పకడ్భందీగా ప్రకటనలిచ్చేశారు. చంద్రబాబు మీద పార్టీ సీనియర్లకు ఎంత నమ్మకం అంటే.. తమ పార్టీ తరపున గెలిచింది 23 మందే అయినా.. తమకు బలం లేదని తెలిసినా.. తమకు అవకాశమిస్తే.. గెలుస్తామని చెప్పుకున్నారు. ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నిక ఏదైనా ఎమ్మెల్యే ఎవరైనా.. ఎంత డబ్బైనా ముట్టజెప్పి.. తమవైపుకు తీసుకురాగల శక్తి చంద్రబాబుకు ఉందని నమ్మారు. అయితే ఇవ్వాల్టి కరకట్ట మీటింగ్లో ఈ విషయం తేలిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని చంద్రబాబు ప్రకటించారు. YSRCPకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేల కోసం తెరవెనక టిడిపి బృందం ఆహర్నిశలు కృషి చేసినా.. ఫలితం దక్కలేదన్న ఆవేదన బాబు మాటల్లో కనిపించింది. పొత్తులుంటాయి.. కానీ..! కరకట్ట మీటింగ్లో ప్రధానంగా చర్చ జరిగిన రెండో అంశం పొత్తులు. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయంటున్నారు, మరి మనతో ఎవరున్నారని చంద్రబాబును పార్టీ సీనియర్లు అడిగారు. దీనిపై సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు.. పొత్తులు ఉంటాయని, ఆయా పార్టీల వాళ్లకు సీట్లు కేటాయించాలన్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉండదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కొత్త వాళ్లు పోటీ చేయడం వల్ల ఇప్పటివరకున్న కొందరికి సీట్లు దొరకవని, అయితే వారికి నష్టం కలగకుండా ఉండేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. (వాలంటైన్స్ డే సందర్భంగా చంద్రబాబు పొత్తుల గురించి సోషల్ మీడియాలో చురకలు) ఇంకా మారని తీరు చంద్రబాబు అంటేనే ఫిరాయింపులు. ఫిరాయింపులు అంటేనే చంద్రబాబు. ఎంత సేపు పక్కపార్టీ నేతలపై కన్నేసి పెట్టే చంద్రబాబు.. తాజాగా కరకట్ట మీటింగ్లో YSRCP నేతలెవరయినా వస్తారా అంటూ ఆరా తీసినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల మార్పు నిర్ణయం తర్వాత YSRCP నుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని భావించామని నేతలు ప్రస్తావించినట్టు తెలిసింది. కొందరు నేతలకు అక్కడ టికెట్ లేదనడంతో తమ దగ్గరకు వస్తున్నారని, అక్కడ గెలవలేని వాళ్లు.. ఇక్కడ కూడా గెలుస్తారని అనుకోలేమని, అయినా అవకాశం ఉన్నచోట వారే పార్టీకి పెద్ద దిక్కని చెప్పినట్టు తెలిసింది. లోకేష్తో లాభమా? నష్టమా? ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చాయని, ఇప్పటివరకు అభ్యర్థులు సరికదా.. పొత్తులు కూడా ఖరారు కాలేదని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే పార్టీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క సభ కూడా పెట్టలేదని చెప్పినట్టు తెలిసింది. త్వరలో ‘‘రా....కదలి రా’’ పేరిట తాను సభలు పెట్టబోతున్నట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అలాగే లోకేష్ శంఖారావం మీటింగ్ గురించి నేతలతో ప్రస్తావించినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు తెలిసింది. తరచుగా లోకేష్ చేస్తున్న ప్రకటనలు అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయంటూ కొందరు బాబుకు చెప్పినట్టు తెలిసింది. ఎన్నికలకు కేవలం 56 రోజులే ఉన్నాయని, ఇంకా పార్టీ నేతలు ఎలక్షన్ మూడ్ లోకి రాకపోతే ఎలా అని చంద్రబాబు అడిగినట్టు సమాచారం. పొత్తులపై క్లారిటీ ఎప్పుడు.? బీజేపీతో పొత్తు పై ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఈనెల 16 సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృతస్థాయి సమావేశాలున్నాయి. ఈ సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీకి రావొద్దని పవన్, బాబులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం వారం రోజుల నుంచి వేచి చూస్తున్నా పవన్ను పట్టించుకోవడం లేదు. బీజేపీ సమావేశాలు ముగిశాక ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నారు. ఈలోగా 17న పర్చూరులో రా కదలిరా సభకు భారీగా జనాన్ని తీసుకురావాలని చంద్రబాబు నేతలకు ఆదేశాలిచ్చాడు. పార్టీలో ఎవరైనా చేరేవాళ్లుంటే.. తీసుకురావాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. -
పొత్తు లేకుండా గెలవలేమని తేలికగా చూస్తున్నార్సార్!
పొత్తు లేకుండా గెలవలేమని తేలికగా చూస్తున్నార్సార్! ఈ సారే సింగిల్గా పోటీ చేసి మన సత్తా చూపిద్దాం! -
.. ఓటు వేళ నవ్వులాట
హ్హ.. హ్హ.. హవా.. హ్హ అశాస్త్రీయ సర్వేలతో ప్రజలను పక్కదోవ పట్టించే యత్నం వైఎస్సార్ సీపీ ఓటు శాతం తగ్గిందంటూ దుష్ర్పచారం ఇరవై రోజుల్లోనే పెను రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయా అంటూ పరిశీలకుల ఆశ్చర్యం ఎన్నికల ముందు గందరగోళం సృష్టించేందుకే పచ్చ మీడియా ఎత్తుగడలంటూ అనుమానాలు ఎన్నికల వేళ ప్రతిసారీ జాతీయ ఛానళ్లదీ ఇదే తంతు 2004, 2009లో వైఎస్ సారధ్యంలోని పార్టీకి ఎదురుగాలి అంటూ అశాస్త్రీయ సర్వేలను పెకైత్తిన ఎల్లో మీడియా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా మారని తీరు ఊదరగొట్టి ఉట్టికెత్తి.. ‘‘చూడండి బాబూ.. చూడండి.. మాయా లేదు.. మంత్రం లేదు.. మీ కళ్ల ముందే వంద నోటును ఈ డబ్బాలో పెట్టా. ఇప్పుడది 500 రూపాయల నోటు అయింది. ఇదంతా ఈ తాయత్తు మహిమ...’’ - పొట్ట నింపుకునేందుకు రోడ్డుమీద గారడీ చేసే వాళ్ల మాటలివీ! ‘‘నాయనలారా.. అమ్మల్లారా.. చూడండి.. అంతా మావైపే ఉంది.. ఆ సర్వే చూడండి.. ఈ సర్వే చూడండి.. ఎన్నికల్లో విజయం మాదే.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే...’’ - ఎన్నికల చౌరస్తాలో నిలబడి టీడీపీ అధినేత చంద్రబాబు, రాజగురవింద రామోజీ, బాబు అనుకూల జాతీయ చానెళ్లు ప్రదర్శించే టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలివీ!! ఐదేళ్ల కోసారి పచ్చ బుట్టలోంచి బయల్దేరే ‘సర్వే’ పాములు బాబుకు వంత పాడటం, ఆ వెంటనే తన్మయత్వంలో ‘బాబూ.. నీవు రావాలి..’ అని పలవరిస్తూ రామోజీ తన పత్రికలో అక్షరాలను అచ్చొత్తి జనాలపైకి విసిరేయడం గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నదే. అధికారం లేక బక్కచిక్కిన చంద్రబాబుకు గాలి కొట్టి..కొట్టి.. కొండంత ‘బెలూన్ బాబు’ను చేసుకొని రామోజీ మురిసిపోవడం, నిజంగానే పెరిగిపోతున్నానేమోనని బాబు భ్రమించడం, చివరికి జనం ఓటు అనే సూదితో ఆ బెలూన్ గాలి తీసేయడం ప్రజలకు సుపరిచితమే! 2004, 2009 ఎన్నికల్లో జరిగిందే. ఇప్పుడు కూడా అచ్చంగా అదే జరుగుతోంది. వనం దుర్గాప్రసాద్, ఎలక్షన్ సెల్: కేవలం 20 రోజులు... రెండు అవే సంస్థలు.. కానీ సర్వేల్లో ఎంత తేడా? ఈ కొద్ది రోజుల్లోనే దేశ, రాష్ట్ర రాజకీ యాలగతి మొత్తం మారిపోయిందా..? రాజకీయ సమీకరణలన్నీ తలకిందులయ్యాయా..? ప్రజల ఆలోచనల్లో ఇంతటి అనూహ్య మార్పు వచ్చిందా..? ఇవేవీ జరగలేదు. జరిగిందల్లా ‘పచ్చ’బుట్టల్లోంచి సర్వే పాములు బయటకొచ్చాయి. అవన్నీ ఎప్పట్లాగే ఎన్నికలకు ముందు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. జాతీయ ఛానళ్లలో ఊదరగొడుతున్నాయి. వాటినే నెత్తినెత్తుకొని ‘బాబు ఆహో.. ఓహో’ అంటూ పచ్చ మీడియా వీరంగం వేస్తోంది. ఇదే సీఎన్ఎన్-ఐబీఎన్ మార్చిలో నిర్వహించిన సర్వేలో సీమాంధ్రలో వైఎస్సార్సీపీ 45 శాతం ఓట్లు సాధిస్తుందని చెప్పగా.. అంతలోనే మాట మార్చి 33 శాతానికి పరిమితం చేయడం అనేక అనుమానాలకు తావి స్తోంది. ఇంత తక్కువ వ్యవధిలో వైఎస్సార్సీపీకి ఏకంగా 12 శాతం ఓట్లు తగ్గేలా పెను రాజకీయ మార్పులు ఏం జరిగాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో టీడీపీకి ఉన్నట్టుండి ఆరు శాతం ఓట్లు పెరిగాయనడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. 2004, 2009 ఎన్నికల ముందు కూడా జాతీయ ఛానళ్లు ఇలాగే టీడీపీ బలాన్ని అతిగా చూపించి బొక్కబోర్లా పడ్డాయి! 2009లో టీడీపీకి 13 సీట్లు వస్తాయని ఎన్డీటీవీ, 14-16 సీట్లు వస్తాయని ఇండియా టుడే, 16 సీట్లు వస్తాయని సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రకటించాయి. కానీ తీరా ఆ ఎన్నికల్లో టీడీపీకి దక్కింది ఆరు సీట్లు మాత్రమే కావడం గమనార్హం. 2009లో జాతీయ స్థాయిలో నీల్సన్ వెల్లడించిన సర్వే ఫలితాలు మాత్రమే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. గతంలోనూ జాతీయ ఛానళ్లు చంద్రబాబు బలాన్ని ఎక్కువ చేసి చూపించాయని, ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నమే జరుగుతోందని పాలగుమ్మి సాయినాథ్, సంజయ్బారు వంటి విశ్లేషకులు అంటున్నారు. భారీ శాంపిల్ తీసుకుని మార్చి 30న నీల్సన్ వెలువరించిన సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 19-21 ఎంపీ సీట్లు, టీడీపీకి 4-6 స్థానాలు వస్తాయని తేలింది. ఈ సర్వే వెలువడిన నాలుగైదు రోజుల్లోనే సీఎన్ఎన్-ఐబీఎన్, ఎన్డీటీవీ.. తాము కొద్దిరోజుల కిందటే వెలువరించిన ఫలితాలకు పూర్తి విరుద్ధంగా సర్వేలను వెలువరించడంపై విశ్లేషకులు, ప్రొఫెసర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2004లో ఇదే ప్రచారం.. తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకోవడం, వాటిని ‘ఈనాడు’ ద్వారా ప్రచారంలో పెట్టడం అలవాటైన చంద్రబాబు 2004లో ఇదే పంథా అవలంబించారు. తొమ్మిదేళ్లపాటు నరకాన్ని చవిచూసి, టీడీపీపై జనం విసుగెత్తిపోయిన సమయంలో కూడా టీడీపీ హవా వీస్తోందంటూ సర్వేలు చేయించుకున్నారు. దాని ప్రకారం సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సర్వేలో టీడీపీ-బీజేపీకి కలిసి 208 సీట్లు వస్తాయని చెప్పింది. వైఎస్ సారథ్యంలోని పార్టీకి 83 స్థానాలు, ఇతరులకు మూడు స్థానాలు లభిస్తాయని పేర్కొంది. లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 30 సీట్లు దక్కుతాయని, కాంగ్రెస్ కూటమికి 11 స్థానాలు వస్తాయని వెల్లడించింది. తెలుగుదేశం కూటమికి తొలి దశలో 103 సీట్లు, రెండో దశలో 105 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక రెండో దశకు ముందురోజు డీఆర్ఎస్ సర్వే పేరుతో మరో జిమ్మిక్కు చేశారు. టీడీపీకి ఒంటరిగానే 160 స్థానాలు వస్తాయని ఆ సర్వే ద్వారా చెప్పించారు. కాంగ్రెస్కు 120 సీట్లు, బీజేపీకి 6 సీట్లు వ స్తాయని ఆ సర్వే తెలిపింది. తొలి విడతలో తాము జరిపిన ఎగ్జిట్ పోల్స్లో 147 సీట్లకు గాను 77 టీడీపీకి వచ్చాయని సర్వే వివరించింది. రెండో విడతలో మరో 89 సీట్లు వస్తాయని చెప్పింది. జరిగిందేమిటి? - సర్వేల పేరుతో చంద్రబాబు ఎంత హంగామా చేసినా.. జనం వైఎస్ రాజశేఖరరెడ్డికే పట్టం కట్టారు. అఖండ మెజారిటీ కట్టబెట్టి అధికార పీఠంపై కూర్చోబెట్టారు. బలమైన స్థానాలని చెప్పుకునే చోట్ల కూడా టీడీపీకి చావుతప్పి కన్ను లొట్టబోయింది. 2009లో ‘మహా’ మాయ... 2009 ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని మహాకూటమి ప్రభంజనం సృష్టిస్తుందంటూ ప్రచారం చేశారు. అందుకు అవసరమైన సర్వేలను విడతల వారీగా సిద్ధం చేశారు. చంద్రబాబును ఏ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయో ఆ వర్గాల నుంచే మద్దతు వస్తున్నట్టు సర్వేల్లో చెప్పించారు. మారిన మనిషి చంద్రబాబుగా చూపించే ప్రయత్నాలు చేశారు. ఎలా చూసినా మహాకూటమికి 178-190 సీట్లు ఖాయమని సర్వేల ద్వారా పదేపదే చెప్పించారు. అంతేనా... ఫలితాలు వెలువడకముందే ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనే దానిపై టీడీపీలో చర్చలు జరుగుతున్నాయంటూ ఈనాడులో వార్తలు రాయించారు. మహా కూటమికి 149 సీట్లు వస్తాయని మహా ఛానల్ చెప్పింది. టైమ్స్ నౌ సర్వే కూటమికి 121 సీట్లు వస్తాయని తెలిపింది. టీవీ-9 సర్వే టీడీపీకి 105 సీట్లు వస్తాయని పేర్కొంది. మొదటి విడత పోలింగ్ ముగియడంతోనో టీడీపీ గ్యాంగ్ ఎగ్జిట్ పోల్స్తో మరో నాటకానికి తెరదీశారు. తొలి విడతలోనే మహాకూటమికి 120 సీట్లు ఖాయమని ప్రచారం చేశారు. తద్వారా రెండో విడత పోలింగ్పై ప్రభావం పడేలా వ్యూహరచన చేశారు. అంతేగాకుండా డీఎన్ఏ సర్వే ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్కు 14 ఎంపీ స్థానాలు కూడా రావని ‘ఈనాడు’లో రాయించారు. కాంగ్రెస్కు ఎదురుగాలేనంటూ పేరూ ఊరులేని సర్వే గణాంకాలన్నింటినీ ప్రచురించారు. జరిగింది ఇదీ.. మహా కూటమి ప్రభంజనం అంటూ ఎల్లో మీడియా పెకైత్తిన సర్వేలన్నీ ప్రజాతీర్పులో కొట్టుకుపోయాయి. అందులో ఏ ఒక్క సర్వే నిజం కాలేదు. టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి చావు దెబ్బతింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. 157 సీట్లను దక్కించుకున్న వైఎస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇంత తేడా ఉండకూడదు పది రోజుల్లో జరిగిన సర్వేకి... రెండ్రోజుల క్రితం జరిగిన సర్వే ఫలితాల్లో జగన్కు ఇంతగా ఓట్లు తగ్గుతాయంటూ వెల్లడైన అంశాల్లో శాస్త్రీయత కనిపించడంలేదు. వారం పది రోజులో రాజకీయాల్లో భారీ మార్పులుగానీ... ఇతరత్రా పెద్ద ఎత్తున సంఘటనలు గానీ జరగలేదు. కాబట్టి ఇంత తేడా ఉండకూడదు. ఉంటేగింటే ఒకట్రెండు శాతం మాత్రమే తేడా ఉండే అవకాశం ఉంది. ప్రజాభిప్రా య సేకరణ ఇంత పెద్ద ఎత్తున మారే అవకాశమే ఉండదు. ఈ పరిస్థితి చూస్తుంటే ఏదో ఒకవైపునకు సర్వే ఉంటుందన్న విమర్శ వచ్చే అవకాశం ఉంది. - ప్రొఫెసర్ అనిత, జర్నలిజం శాఖ, నాగార్జున యూనివర్సిటీ ఆ సర్వేల్లో శాస్త్రీయతేది..? ‘సీఎన్ఎన్-ఐబీఎన్, ఎన్డీటీవీలు నెల క్రితం వెల్లడించిన సర్వేకి తాజా సర్వే ఫలితాలను విశ్లేషిస్తే వాటిలో శాస్త్రీయత లేదన్నది రూఢీ అవుతోది. కేవలం 1300 నుంచి 1400 మందిని సర్వే చేసి.. అదే కోట్ల మంది ప్రజల అభిప్రాయంగా చెప్పడం హేయం. నెల రోజుల్లో ఇంత మార్పు ఎలా సాధ్యమన్నది ఆ సర్వేల విశ్లేషణల్లో కన్పించడం లేదు. 2004, 2009 ఎన్నికల సమయంలో ఆ రెండు సంస్థలు ప్రకటించిన సర్వే ఫలితాలు..ఎన్నికల ఫలితాలతో సరిపోలేదు. ఇప్పుడు సర్వేలు సైతం 2014 ఫలితాలతో సరిపోలే అవకాశమే లేదు.’ - బి.మురళీధర్రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్కేయూ, అనంతపురం వాస్తవానికి విరుద్ధం ఎన్నికల సర్వేలు శాస్త్రీయంగా జరగాలి. అన్ని వర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్ తీసినప్పుడే ఫలితాలు సక్రమంగా తెలుస్తాయి. శాంపిల్స్ తక్కువగా తీస్తే ఆ సర్వేలు వాస్తవాలను ప్రతిబింభించలేవు. సీఎన్ఎన్, ఐబీఎన్ సర్వేలు చాలా తక్కువ శాంపిల్స్తో చేశారు కాబట్టి ఇవి వాస్తవానికి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. ఇదే విషయాన్ని సర్వే ప్రముఖులు పి.సాయినాథ్, సంజయ్బారులు తేల్చి చెప్పిన విషయాన్ని మనం గమనించాలి. రాజకీయ ప్రముఖులు, మేధావులే కాదు సామాన్యజనం కూడా ఆ సర్వే నమ్మే పరిస్థితి లేదు. - ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు పచ్చ పత్రికలు నెత్తికెత్తుకున్న సర్వేలు - 2009లో వైఎస్ నేతృత్వంలోని పార్టీకి 124 సీట్లు, మహా కూటమికి 106 సీట్లు వస్తాయని ‘ది వీక్, సీ ఓటర్’ తేల్చింది. - రాష్ట్రంలో వైఎస్ సారథ్యంలోని పార్టీకి 14 ఎంపీ సీట్లు మాత్రమే రావచ్చు. ఇదీ డిఎన్ఏ సర్వే. - రాష్ట్రంలో అధికార పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. - స్టార్ న్యూస్, నీల్సన్ సర్వే. రాష్ట్రంలో అధికార పార్టీకి 21 ఎంపీ స్థానాలే రావచ్చు - టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే శాంపిల్ చాలా తక్కువ వారం పది రోజుల వ్యవ ధిలో జరిగిన రెండు సర్వేల మధ్య సీమాంధ్రలో వైఎస్ జగన్కు ఏకంగా పది శాతం ఓట్లు పడిపోతాయని సర్వే తేల్చడం ఆశ్చర్యకరం. ఈ కాలంలో రాజకీయంగా పెద్ద ఎత్తున వచ్చిన మార్పులేమీ లేవు. నీల్సన్-ఎన్టీవీ సర్వే వారు దేశవ్యాప్తంగా 40 వేల శాంపిల్స్ తీసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున సర్వే శాం పిల్స్ తీసుకోవడం వల్ల రాబోయే ఎన్నికల ఫలితాలు కూడా అందుకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. సీఎన్ఎన్-ఐబీఎన్ దేశవ్యాప్తంగా 18,000 శాంపిల్స్ (రాష్ర్టంలో కేవలం 1,300 శాంపిల్స్) మాత్రమే తీసుకుంది. దీని వల్ల సర్వే ఫలితాలు ఎన్నికల ఫలితాలకు వాస్తవ దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీవీ-నీల్సన్ ప్రశ్నలు అన్ని కోణాల్లో ఉన్నాయి. శాస్త్రీయంగానూ ఉన్నాయి. అయితే ఎన్టీవీ సర్వే నచ్చని వారు తమకు జరిగిన నష్టాన్ని నివారించేందుకు మరో సర్వే ద్వారా ఇలా చేశారన్న విమర్శలు వినవస్తున్నాయి. - ప్రొఫెసర్ జి.తులసీరావు, అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం ఎందరిని చేశారన్నది ముఖ్యం ఇంత తక్కువ వ్యవధిలో సర్వేల్లో ఇంత తేడా ఉండటం సాధ్యం కాదు. అయితే ఎన్నికల సర్వేలకు సంబంధించి రెండు అంశాలు అత్యంత కీలకమైనవి. 1) ఎంత మందిని శాంపిల్ సర్వే చేశారన్నది ముఖ్యం, 2) ఎవరితో మాట్లాడారు అన్నది. ఉదాహరణకు పాతబస్తీకి వెళ్లి ఎవరికి ఓటేస్తారు అంటే చాలామంది ఎంఐఎం అనే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ లేదా టీడీపీ బలంగా ఉన్నచోట్లకు వెళ్లి అడిగితే ఆయా పార్టీలకే అని చెప్తారు. పార్టీ కార్యకర్తల వద్దకు వెళితే వాళ్లు తమ పార్టీనే గెలుస్తుంది అంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలా గందరగోళం సృష్టించేందుకు వెనుకబడిన పార్టీ ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అయితే సర్వే చేసే సంస్థ గతంలో వెల్లడించిన ఫలితాలు ఎన్నికల ఫలితాలకు ఏ మేరకు దగ్గరగా ఉన్నాయో గుర్తించి నమ్మాల్సిందే. - ప్రొఫెసర్ స్టీవెన్సన్, జర్నలిజం శాఖ, ఉస్మానియా యూనివర్సిటీ సర్వేలు మేనేజ్ అవుతున్నాయి ఈమధ్య పెద్దగా రాజకీయ మార్పులు జరగలేదు. అందువల్ల సర్వేల్లో భారీగా తేడా ఉండే అవకాశం లేనేలేదు. అలా ఉందంటే సర్వేలను మేనేజ్ చేసే అవకాశాలను తోసిపుచ్చలేం. సర్వేలు శాస్త్రీయంగా చేశారా? ఎవరిని అడిగారు? సర్వే చేస్తున్న వారు ఏ ఉద్దేశంతో చేశారు? అనేవి చూడాల్సి ఉంటుంది. ఎవరు చేస్తున్నారు? ఎవరిని ఎంపిక చేసుకున్నారు? ఇలాంటివన్నీ ఉంటాయి. ఏదో పార్టీకి అనుకూలంగా రావాలంటే దాని ప్రకారం సంబంధిత సర్వే సంస్థ ప్రశ్నలు రూపొందించే అవకాశం ఉంటుంది. ఎంపిక చేసే శాంపిల్స్ కూడా అలాగే ఉంటాయి. తటస్థంగా సర్వే ఫలితాలు రావాలంటే అందుకనుగుణంగా ప్రశ్నలను రూపొందించి శాంపిల్స్ను అదే పద్ధతిలో సేకరిస్తారు. - బాలస్వామి, జర్నలిజం శాఖాధిపతి, ఉస్మానియా యూనివర్సిటీ సీఎన్ఎన్-ఐబీఎన్ మార్చి 4 వైఎస్సార్సీపీకి 11-17 ఎంపీ సీట్లు. 45 శాతం ఓట్లు. టీడీపీకి 10-16 సీట్లు. 33 శాతం ఓట్లు ఏప్రిల్ 2 వైఎస్సార్సీపీకి 9-15 ఎంపీ సీట్లు. 33 శాతం ఓట్లు. టీడీపీకి 13-19 సీట్లు. 39 శాతం ఓట్లు. ఎన్డీటీవీ మార్చి 14 వైఎస్సార్సీపీకి 15 ఎంపీ సీట్లు. 43 శాతం ఓట్లు. టీడీపీకి 9 సీట్లు. 37 శాతం ఓట్లు. ఏప్రిల్ 3 వైఎస్సార్సీపీకి 10 ఎంపీ సీట్లు. 38 శాతం ఓట్లు. టీడీపీకి 14 సీట్లు 46 శాతం ఓట్లు.