breaking news
Telangana Political Parties
-
సంఘం శరణం.. ఓటు గచ్ఛామి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఓట్ల వేటను ముమ్మరం చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమకు మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అభ్యర్థులంతా సంఘాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గ్రాడ్యుయేషన్ చదివి వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారందరినీ నేరుగా కలవలేని పరిస్థితుల్లో... ఆయా ఉద్యోగ, వృత్తి సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా తమకు వీలున్న సంఘాలను కలుస్తూ మద్దతు అభ్యర్థిస్తున్నారు. కాగా అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలతో కూడా భేటీ అవుతూ ఓట్లు అడుగుతున్నాయి. మొత్తం మీద పోలింగ్కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. పోటీలు పడి.. మద్దతు వివిధ సంఘాలను కలిసి మద్దతు కూడగట్టే క్రమంలో మిగతా పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ ముందంజలో కనిపిస్తోంది. ఇప్పటికే పలు తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవీలకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. పారామెడికల్, సెర్ప్, ఐకేపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగులతో పాటు పలు సంఘాలు టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరికీ పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు ఆయా సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులతో సమావేశాలు పెట్టి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తుండటంతో వారంతా పల్లా, వాణీదేవీలను గెలిపించాలని తమ సంఘ సభ్యులను కోరుతున్నారు. బీజేపీ అభ్యర్థులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాంచందర్రావులు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు, ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగడుతున్నారు. పార్టీకి అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సహకారంతో ముందుకెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలు కూడా తమ పార్టీ అనుబంధ సంఘాల నేతల సాయంతో గ్రామస్థాయిలో ప్రచారానికి వెళ్తున్నారు. నల్లగొండ స్థానం పరిధిలో లెఫ్ట్ అభ్యర్థి జయసారథిరెడ్డి పక్షాన వామపక్ష అనుబంధ సంఘాలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రంగారెడ్డి స్థానంలో లెఫ్ట్ పార్టీలకు అనుబంధంగా ఉండే ప్రజాసంఘాలు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్. కె.నాగేశ్వర్కు మద్దతు ప్రకటించాయి. నల్లగొండ స్థానంలో బీసీ సంఘాలు, ఎమ్మార్పీఎస్, ఇతర కుల సంఘాలు తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్. చెరుకు సుధాకర్కు మద్దతు తెలిపాయి. ఇలా ఎవరికి వారే వృత్తి, కుల సంఘాల సహకారం కోసం నానాపాట్లు పడుతుండటం ఎమ్మెల్సీ రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది. గ్రామాల్లో నేరుగా ఓటర్లను కలస్తూ... గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించినా... ఓటరు జాబితాను దగ్గర పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్లి ప్రతి ఓటర్ను కలవడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. స్వతంత్రులతో సహా అన్ని పార్టీలు ఇప్పటికే గురుకులాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను ఓమారు చుట్టేసి... ఇప్పుడు గ్రామాలపై దృష్టి సారించాయి. ఆయా గ్రామాల్లోని పార్టీ నేతలు తమ ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో కలిసి బ్యాలెట్ పేపర్లను పట్టుకుని ఓటర్లను నేరుగా కలిసి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఈ సామాజిక వర్గాల సమావేశాలు బహిరంగంగా జరుగుతుండగా, మరికొన్ని చోట్ల అంతర్గతంగా మద్దతు కూడగట్టుకుంటున్నారు. మార్నింగ్ వాక్ల పేరుతో ఎన్నికల ప్రచారం ఇంకా సాగుతుండగా, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హౌసింగ్ సొసైటీల వారీగా కూడా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పట్టభద్రుల ఓట్ల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
కొత్త జిల్లాలు.. పార్టీలకు కొత్త తలనొప్పులు
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాలకు రాజకీయ పార్టీలు కొత్త కమిటీలను ఏర్పాటు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంధిగ్ధం నుంచి బయట పడటానికి ఆయా పార్టీలు చర్చలు చేపట్టాయి. కొత్త జిల్లాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా కమిటీలన్నింటినీ పునర్వ్యవస్థీకరించక తప్పడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు జిల్లా కమిటీలపై కసరత్తు చేపట్టాయి. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు, కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయంగా ఆయా పార్టీల నేతలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. జిల్లా పార్టీ కమిటీల్లో ప్రతి నాయకుడికి ఏదో ఒక పదవి దక్కే అవకాశాలున్నాయి. జిల్లాల పరిధి చిన్నగా ఉండటంతో జిల్లా కమిటీల్లో ఏదో ఒక పదవి దక్కుతుందని నేతలు ఎవరికి వారు అంచనాల్లో ఉన్నారు. కొందరు చిన్నస్థాయి నాయకులు కూడా రాష్ట్ర పార్టీ నేతలను కలిసి ఈ విషయాలపై ఆరా తీస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. జిల్లా కమిటీలను పునర్వ్యవస్థీకరించడానికి కొన్ని పార్టీలు ఇప్పటికే చర్యలు ప్రారంభించగా, మరికొన్ని పార్టీలు ఆ దిశగా ఇంకా ఆలోచనలు కూడా చేయడం లేదు. ఇప్పటివరకు ఒక పెద్ద జిల్లాకు పార్టీ నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన నేతలకు మాత్రం తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. ఇప్పుడు తన పరిధి తగ్గడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న జిల్లాకు ప్రాతినిథ్యం వహించడం ఇష్టంలేని నాయకులు రాష్ట్ర కమిటీల్లో చోటు కావాలని కోరుతున్నారు. ఇకపోతే, ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేతను ఎప్పటిలాగే అలాగే కొనసాగించి కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కొత్త వారిని నియమించాలన్న ఆలోచనకు కొన్ని పార్టీలు వచ్చాయి. అయితే, అందులోనూ పార్టీలకు చిక్కులు తప్పడం లేదు. జిల్లా కమిటీ నాయకులు విభజనలో వారు ప్రాతినిథ్యం వహించే ప్రాంతం వేరే జిల్లాకు వెళ్లిపోవడం, ఆ ప్రాంతంలో ఆ నేతలు అంతగా పట్టులేకపోవడం రాష్ట్ర నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మొత్తం జిల్లా కమిటీలను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని జిల్లా కమిటీలకు కొత్త వారిని అధ్యక్షులుగా నియమిస్తారని అంటున్నారు. ఇకపోతే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా అన్ని జిల్లాల డీసీసీలను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నప్పటికీ ప్రస్తుత డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలన్న భావనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే వారు ప్రాతినిథ్యం వహించే ప్రాంతం ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా బాధ్యతలను అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. పీసీసీ సమావేశం నిర్వహించి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా పార్టీ కొత్త కమిటీలను నియమించే విషయంలో సీపీఎం మిగతా పార్టీలకన్నా ముందుంది. ఆ పార్టీ నల్గొండ జిల్లా కమిటీలను ఇప్పటికే విభజించింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు కొత్త కార్యదర్శులను జాబితాను సీపీఎం ప్రకటించింది. -
కారులేని కేసీఆర్