breaking news
Teaching Problem
-
బోధన.. వేదన
– అధ్యాపక పోస్టుల కేటాయింపులో అసంతృప్తి – ప్రాధాన్యమున్న విభాగాలకు రిక్తహస్తం – అప్రాధాన్య విభాగాలకు పోస్టుల మంజూరు – ఆరు విభాగాలకు ఒక్కో పోస్టుతో సరి ఎస్కేయూ : రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో బోధన పోస్టులు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి రాత పరీక్ష నిర్వహించి ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. ఆయా వర్సిటీలకు సంబంధించి విభాగాల వారీగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల జాబితాను రూపొందించారు. ఇందుకు రోస్టర్ పాయింట్లు నిర్ధారించాల్సి ఉంది. శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని విభాగాల వారీగా నిర్ధారించిన బోధన పోస్టులు సమతూకం పాటించలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏళ్ల తరబడి బోధన పోస్టుల కోసం నిరీక్షించిన వారికి నిరాశ తప్పలేదు. మరో వైపు బోధన పోస్టులు కేటాయించని విభాగాల్లో సిబ్బంది కొరత యథాతథం కానుంది. తెరపైకి ఆంధ్ర భారతి 5 విభాగాలకు ఒక్క పోస్టును కూడా కేటాయించకుండా నిరాశ కలిగించారు. బయోటెక్నాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ ,హిందీ , సెరికల్చర్ విభాగాలకు అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులు నిర్ధారించలేదు. రెండు దఫాలుగా భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సెరికల్చర్ విభాగానికి మాత్రం రెండో దఫా నోటిఫికేషన్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టును కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ , కంప్యూటర్ సైన్సెస్ , సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాలకు కేవలం ఒకే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. ప్రస్తుతం తెలుగు విభాగాన్ని తెలుగు తులనాత్మక సాహిత్య శాఖ అని పిలుస్తున్నారు. కానీ పోస్టులు పొందుపరిచిన జాబితాలో ఆంధ్రభారతి అనే పేరు ఉంది. దీంతో రోస్టర్ పాయింట్లు మారే ప్రమాదం లేకపోలేదు. తెలుగు తులనాత్మక అధ్యయన శాఖ అనే పేరుతో ‘ టీ’ అనే అక్షరంతో రోస్టర్ పాయింట్లు ప్రారంభం కావాల్సి ఉంది. ఆంధ్రభారతి అనే పేరును వెబ్సైట్లో ప్రకటించడంతో ‘ఏ’ అనే అక్షరాన్ని రోస్టర్ పాయింట్లు నిర్ధారించడానికి తీసుకొంటారు. ఇలాంటి చిక్కులు ఉత్పన్నమవుతున్నాయి. ఎకనామిక్స్ విభాగంలో ప్రాజెక్ట్ గడువు పూర్తీ అయినప్పటికీ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టు ఉన్నట్లు చూపడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురుకానున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
టీచర్ల సమస్యలను పరిష్కరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించిన ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. తాత్కాలిక టీచర్లతో కలిసి కొన్ని రోజులగా ఢిల్లీ సెక్రటేరియట్ వద్ద చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తుంటే ఆమ్ ఆద్మీ సర్కార్గా చెప్పుకుంటున్న కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆ పార్టీ కార్యకర్తలు టీచర్ల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం జంతర్మంతర్లో ఆందోళన నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో ఢిల్లీ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, కాంగ్రెస్ శాసనసభ పక్షనాయకుడు హరూన్ యూసుఫ్, మాజీ ఎమ్మెల్యే ముఖేశ్శర్మ, పార్టీ కార్యకర్తల తోపాటు స్థానికులు పాల్గొన్నారు. ఆప్ సర్కార్ ధోరణి మారకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు వెనకాడబోమని లవ్లీ ప్రకటించారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో ధర్నాకు తరలివచ్చారు. కేజ్రీవాల్ సర్కార్ తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని ఇక్కడ ప్రసంగించిన పలువురు నాయకులు విమర్శించారు. సామాన్యుడి సమస్యలు పట్టని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ ఎలా అవుతారంటూ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమను పావులా వాడుకున్నారని కేజ్రీవాల్పై ఆరోపణలు గుప్పించారు. రైల్భవన్ వద్ద ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాలో నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన ఉపాధ్యాయులతోనూ ఆప్ కార్యకర్తలు అసభ్యంగా వ్యవహరించారని ముఖేశ్శర్మ ఆరోపించారు.