-
చింత గింజలోయ్.. మంచి కాసులోయ్..
మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలీదు కానీ.. చింత కాయలతో పాటు వాటి గింజలకూ కాసులు రాలుతున్నాయి. చింత పిక్కలాట.. వామన గుంటలు.. వైకుంఠపాళీ.. అష్టా–చెమ్మా వంటి ఆటలకు మాత్రమే వినియోగించే చింత గింజలు వ్యాపారులకు, కూలీలకు సిరులు కురిపిస్తున్నాయి. వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా మారిన చింత పిక్కలు ఇప్పుడు అమెజాన్ లాంటి ఈ–కామర్స్ ఆన్లైన్ సైట్లలోనూ అమ్ముడుపోతున్నాయి. ఏటా వేలాది టన్నుల చింత గింజలు మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నాయి. పిఠాపురం: చింత గింజలూ వ్యాపార వస్తువుగా మారాయి. వ్యాపారులకు మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. దీంతో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుతో పాటు పలు ప్రాంతాల్లో చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు వెలిసాయి. చింతపండు వ్యాపారుల నుంచి చింత గింజలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. అక్కడ వాటిని శుభ్రం చేసి.. గింజలకు పైన ఉండే తోలు తొలగించి గుజరాత్, మహారాష్ట్ర, సూరత్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోలు తీసిన చింత గింజల టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది. కాకినాడ జిల్లాలో రోజుకు 60 టన్నుల వరకు చింత గింజలు లభ్యమవుతుండగా 20 టన్నుల వరకు ప్రాసెసింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న అన్ని అటవీ ప్రాంతాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో చింత గింజలు లభ్యమవుతున్నాయి. కాకినాడ, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో చింత గింజల్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఏటా 18 వేల టన్నుల చింత గింజలు ఎగుమతి అవుతుండగా.. వాటి విలువ రూ.36 కోట్ల పైమాటే. వీటి కొనుగోళ్లు, ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.65 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఏడాదంతా వ్యాపారం చింత పిక్కలను ప్రాసెసింగ్ చేసే ఫ్యాక్టరీలు ఏడాదంతా పని చేస్తున్నాయి. చింతపండు సీజనల్గా మాత్రమే లభిస్తున్నప్పటికీ.. కోల్డ్ స్టోరేజిలలో నిల్వ ఉంచి ఏడాదంతా గింజలు తొలగించి అమ్ముతుంటారు. దీనివల్ల ఏడాదంతా చింత గింజలు అందుబాటులో ఉంటున్నాయి. చింతగింజలను కేజీ రూ.5 నుంచి రూ.8కి కొంటున్నారు. తోలు తీసిన తరువాత కేజీ రూ.20కి పైగా అమ్ముతారు. ప్రత్యక్షంగా చింతపండు గింజలు తీసే కుటుంబాలు రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉండగా.. వ్యాపారాలు, ఫ్యాక్టరీలలో పని చేసే కార్మిక కుటుంబాలు వెయ్యి వరకు ఉన్నాయి. చింతపండు వ్యాపారులే గింజలను సేకరిస్తారు. ఐదు కేజీల చింతపండులోంచి కేజీ చింత గింజలు వస్తాయి. ప్రాసెసింగ్ ఇలా.. చింతపండు నుంచి వేరు చేసిన గింజలను చింతపండు వ్యాపారులు ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. వాటిని ప్రాసెసింగ్ యూనిట్లలోని బాయిలర్లో (240 డిగ్రీల వేడి వద్ద) నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం దానిపై ఉండే తొక్కను తొలగించి బస్తాల్లో నింపుతారు. వాటిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళతారు. రాష్ట్రంలోని హిందూపురంలో చింత గింజల పౌడర్ తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలలో ఈ గింజలను వైట్ పౌడర్గా మార్చి.. ఏ1, ఏ2, ఏ3, ఏ4 గ్రేడ్లుగా విభజించి జర్మనీ, జపాన్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ, రష్యా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పౌడర్ ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఉపయోగాలివీ రంగులు చిక్కగా.. పటిష్టంగా ఉండడానికి ఆయా కంపెనీలు చింతగింజల పౌడర్ను ఉపయోగిస్తాయి. పట్టు వస్త్రాలకు తళతళలాడే మెరుపుతో పాటు పెళుసుగా ఉండేందుకు, గంజి పట్టించేందుకు వస్త్ర పరిశ్రమలూ ఈ పౌడర్ను వినియోగిస్తున్నాయి. మస్కిటో కాయిల్స్ తయారీలోనూ (యూరప్లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు) దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల మందుల తయారీలోనూ వాడుతుండటం వల్ల ఫార్మా కంపెనీలు ఈ పౌడర్ను కొనుగోలు చేస్తున్నాయి. ప్లైవుడ్ షీట్స్, పేపర్ తయారీతోపాటు జూట్ పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. పాలిస్టర్ గమ్, ప్లాస్టిక్ తయారీలోనూ దీనిని వాడతారు. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఉండటంతో ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయని చెబుతుండటంతో పలువురు వంటకాల్లోనూ వినియోగిస్తున్నారు. ఆన్లైన్లో విక్రయిస్తున్నాం చింత గింజలను శుభ్రం చేసి గ్రేడ్ల వారీగా విభజిస్తున్నాం. మా వద్ద ఉన్న సరుకు వివరాలను ఆన్లైన్లో పెడితే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మా గ్రామంలో చాలాకాలంగా చింతపండు నుంచి గింజలను వేరుచేసే పనిని మహిళలు చేస్తుంటారు. అందువల్ల మా గ్రామంలో ఎక్కువగా చింత గింజలు లభ్యమవుతాయి. దీంతో నేను చింత గింజల ఫ్యాక్టరీ నడుపుతున్నాను. –ఓరుగంటి రాంబాబు, చింత గింజల ఫ్యాక్టరీ యజమాని, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం తూర్పు గోదావరి జిల్లాలో ఒకటే ఉంది చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు పెద్దగా ఎక్కడో గాని ఉండవు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చింతపిక్కల ఫ్యాక్టరీ ఒకటి మాత్రమే రిజిస్టర్ అయ్యింది. జిల్లాలో చింత గింజల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. వీటిని సేకరించి ఇక్కడే తొక్క తీసి ఎగుమతి చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో చింత గింజల్ని పౌడర్గా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే పూర్తి సహకారం అందిస్తాం. –తామాడి మురళి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ, కాకినాడ -
Health Tips: తరచూ చింత చిగురును తింటే..
చింతచిగురును తలచుకోగానే నోట్లో నీళ్లు ఊరతాయి. పులుపు సంగతి ఎలా ఉన్నా చింతచిగురును తీసుకోవడం వల్ల మనకెన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ క్రమంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి తెలుసుకుందాం. ► చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది. ► ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింతచిగురు చెడు కొలెస్టరాల్ను తగ్గించి మంచి కొలెస్టరాల్ను పెంచుతుంది. చలి జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ► చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ► కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి. ►పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింతచిగురులో ఉన్నాయి. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు తమ ఆహారంలో చింత చిగురును భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చింత చిగురును పేస్టులా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రింజెంట్లా పనిచేస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది. -
Chinta Chiguru: కిలో రూ.500.. అయినా తగ్గేదేలే!
సాక్షి, అమలాపురం: ‘ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా!.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా!.. అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగా.. బతుకు పండగ చేయరా’ అని ఒక సినిమా పాటలో అన్నట్టు మానవ జీవితంలో ‘రుచి’ని మించిన మాధుర్యం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే రుచికి ఇచ్చే ప్రాధాన్యం శుచికి కూడా ఇవ్వరన్నది విదితమే. అందులోనూ ఆతిథ్యానికి పేరొందిన కోనసీమలో రుచికరమైన వంటలకు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. రకరకాల రుచికరమైన కూరల కోసం ఆస్తులు కూడా అమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదేమో. కోనసీమ వాసులకు పులసకే కాదు.. సాధారణంగా గోదారికి ఎదురీదే పులసలకు ప్రసిద్ధి కోనసీమ. కానీ దానితో పాటు సీజన్ వారీగా దొరికే పలు రకాల ఆహార ఉత్పత్తులపై కోనసీమ వాసులకు ఆసక్తి ఎక్కువే. దాని ఖరీదు ఎంతైనా వెనకాడరు. ఈ సీజన్లో దొరికే ‘చింత చిగురు (వాడుక భాషలో చింతాకు)’ ఒకటి. దీనితో చేసే శాకాహార, మాంసాహార వంటలకు దాసోహం కానివారంటూ ఉండరు. వివిధ రకాల కూరలకు సరిపడినంత కంటే కొంచెం అదనంగా పులపునిచ్చే చింతాకుకు ఫిదా కానివారు ఉండరు. అందుకే గుప్పెడు చింతాకు రూ.25 అన్నా వెనుకాడరు. ప్రస్తుత మార్కెట్లో వంద గ్రాముల చింత చిగురు ధర రూ.50 వరకు ఉంది. అంటే కిలో రూ.500 అన్నమాట. వారపు సంతలు, రోజువారీ సంతలు, ఇళ్లకు వచ్చేవారి వద్ద చింతాకు ఎగబడి కొంటున్నారు. చింత చిగురు పప్పు, చింతాకు కూర (ఉల్లిపాయలు వేసి), చింత చిగురు పనస పిక్కల కూర శాకాహారల జిహ్వ చాపల్యాన్ని తీర్చేవే. మాంసాహార వంటల్లో చింత చిగురు ఇచ్చే రుచి మరింత స్పైసీగా ఉంటుంది. చింత చిగురు పచ్చిరొయ్యలు, ఎండు రొయ్యల రుచి ఆస్వాదించాల్సిందే తప్ప వర్ణించతరం కాదు. కోనసీమ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని బంధు, మిత్రులకు కూరలు తయారు చేసి పంపేవారున్నారిక్కడ. ఇక మేక బోటీని చింతచిగురుతో కలిపి తింటే జీవితాంతం ఆ రుచి మనసుని వదలిపోదంటే నమ్మండి! ముద్ద నోటిలో పెట్టుకుంటే వేడివేడి అన్నంలో వెన్నపూసలా నమలకుండానే కరిగిపోతోందని మాంసప్రియులు లొట్టలు వేస్తూ గొప్పలు చెబుతారు. ఇవే కాకుండా చింతాకు మాంసం, చింత చిగురు మదుళ్లు (చిన్న రకం చేపలు), చింత చిగురు కొతుకు పరిగి (చేప పిల్లలు) కూరలు సైతం పుల్లపుల్లగా లాగించేవారెందరో..! చైత్రమాసం దాటిన వెంటనే చింతచెట్టు చిగురు సేకరించి విక్రయిస్తుంటారు. అయితే ఒకప్పుడు వచ్చినట్టు ఇప్పుడు చింతాకు మార్కెట్కు రావడం లేదు. చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో పాటు దీనిని సేకరించడం పెద్ద ప్రయాసగా మారింది. చెట్టు చివరి భాగంలో ఉండే లేత చిగురు చెట్లు ఎక్కి కోసేవారు తగ్గడం వల్ల చింతాకుకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మేము ఎక్కువ ధర పెట్టి కొంటాం చింతాకు కోసేవారి నుంచి మేము ఎక్కవ ధర పెట్టి కొంటున్నాం. రేటు తక్కువ ఉన్నప్పుడు సంతలకు పట్టుకుని వెళితే రోజుకు రూ.300 మిగిలేది. ఇప్పుడు రేటు పెరిగినా అంతే ఆదాయం వస్తోంది. వచ్చే వారం మాకు చింతాకు కావాలని ముందుగా చెప్పి కొనేవారు ఎక్కువ మంది ఉన్నారు. – అనంతలక్ష్మి, గంగలకుర్రు, అంబాజీపేట మండలం సీజన్లో తినాల్సిందే సీజన్లో చింతాకుతో తయారు చేసే కూరలు ఒకసారైనా తినాల్సిందే. చింతాకుతో చేసిన ఎటువంటి కూరైనా ఇష్టమే. మాకు హైదరాబాద్లో విరివిరిగా చింతాకు దొరుకుతోంది. అయితే మా ఇంటి వద్ద నుంచి వండి పంపించిన చింతాకు కూరల రుచేవేరు. – పి.రాజేష్, కఠారులంక, పి.గన్నవరం మండలం -
ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వాటి గురించి పిల్లలకు తెలుసా!
ఉగాది సమయం ఆ వేప పూత ఆ మావి వగరు ఆ చింత చిగురు ‘పదిగ్రాముల వేపపూత 200 రూపాయలు’... ఆన్లైన్లో చూసి కొనేంతగా ఎదిగాం. ప్రకృతితో కలిసి చేసేదే పండగ... ఉగాది వేళలో మావిచిగురు కోకిల పాట... గాలికి ఊగే వేపపూత... ఈకాలపు పిల్లలకు తెలియని దూరానికి చేరాం. గతంలో వేప చెట్టు, మావిడి చెట్టు... ప్రతి వీధిలో ఉండేవి. ఇప్పుడు? పండగ హడావిడికి సిద్ధమవుతున్నాం. ప్రకృతి స్తబ్దతను గమనిస్తున్నామా? ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వేపచెట్టు. వేపపువ్వు చేదుకి. మామిడి చెట్టు. మామిడి పిందె వగరుకి. చింతచెట్టు. పులుపు రుచికి. కొన్నిచోట్ల కొబ్బరి కోరు వేస్తారు. అంటే కొబ్బరి చెట్టు. మరికొన్ని చోట్ల బాగా మగ్గిన అరటిపండు ముక్కలు కలుపుతారు. అంటే అరటి చెట్టు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఇళ్లల్లో ఉన్నాయి. పిల్లలు ఎంతమంది వీటిని తాకి చూస్తున్నారు. ఎందరు వీటి నీడలో ఆడుతున్నారు. ఎందరు వీటిని చూశాం అని చెబుతున్నారు. నగరం అయినా.. పట్టణం అయినా.. పల్లె అయినా. ఆ వేప కొమ్మలు... చెట్టు పెంచడం మన ఆచారం. చెట్టుతో పాటు ఇల్లు ఉండాలనుకోవడం మన సంస్కృతి. ప్రతి వీధికి వేప చెట్టు అరుగు ఉండేది. వీధిలోని ఒకటి రెండు ఇళ్ల వాళ్లయినా ముంగిలిలో వేప చెట్టు వేసుకునేవారు. కొన్ని చెట్లు పెరిగి పెద్దవై ప్రహరీగోడను కప్పేసేవి. చెట్ల కొమ్మలు ఇంటి వైపుకు వాలి నీడను పెంచేసేవి. పిల్లలు రాలిన వేప ఆకులు తొక్కుకుంటూ ఆడుకునేవారు. పసుపుపచ్చటి వేపపండ్లు తుంచి వగరు తీపితో ఉండే వాటి రుచిని చూసేవారు. వాటి గింజలను గుజ్జును పారేసి ఖాళీ డిప్పలలో పుల్లను గుచ్చి ఆడుకునేవారు. వేణ్ణీళ్లలో వేపాకులను కలిపి తల్లులు స్నానం చేయిస్తుండేవారు. నెలకు ఒకటి రెండుసార్లు లేత వేపాకులను నూరి చిన్ని ముద్దలను చేసి చక్కెర అద్ది మింగించేవారు. దడుపు చేస్తే, జ్వరం వస్తే వేప మండలు దిష్టి తీసి నెమ్మది కలిగించేవారు. వేపపుల్లతో పళ్లుతోమడం అలవాటు చేసేవారు. వేపబద్దతో నాలిక గీసుకోవడం ఆరోగ్యం. ఉగాది పండగ రోజు వేపపూత పిల్లల చేతే కోయించేవారు. వేప బెరడుకు బంక కారితే పిల్లలు దానిని గిల్లి సీసాల్లో దాచుకునేవారు. వేప కాండంపై పాకే గండు చీమలు, గెంతుతూ వెళ్లే ఉడతలు, కొమ్మల్లో గూడు పెట్టే కాకులు, ఇంట్లో కోళ్లు పెంచుతుంటే గనక అవి ఎరిగి రాత్రిళ్లు ఆ కొమ్మలపైనే తీసే నిద్ర... పండగలో చెట్టును పెట్టింది చెట్టును కాపాడుకోమని. ప్రకృతిని తెలుసుకోమని. ఇవాళ పెద్ద చెట్లు వేస్తున్న ఇళ్లు ఎన్ని? పెద్ద చెట్లకు వీలైన స్థలం ఎక్కడ దొరుకుతోంది? పూల కుండీలు, మిద్దెతోట... సర్దుబాటు జీవనం... రెక్కలు సాచిన విశాలమైన వృక్షాలు గత చరిత్రగా మారాయి. ఆ మామిడి పిందెలు... మామిడి చెట్టు ఉన్న ఇంటికి మర్యాద జాస్తి. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా వచ్చి మామిడి ఆకులు అడుగుతారు. ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే ‘ఆ మామిడి చెట్టున్న ఇల్లు’ అని చెబుతారు. మామిడి చెట్లు చాలామటుకు శుభ్రంగా ఉంటుంది. వాటి గుబురు ఆకులను చూస్తే ఆనందం కలుగుతుంది. వచ్చిన బంధువులంతా ‘ఏ మామిడి’ అని ఆరా తీస్తారు. బంగినిపల్లో, బెంగుళూరో, నీలమో, నాటు మామిడో... ఏదో ఒక జవాబు చెప్పాలి. పిల్లలు మామిడి కొమ్మలకు తాళ్లు కట్టి ఊయల ఊగుతారు. చిన్న కొమ్మలపై ఎక్కి కూచుంటారు. వేసవి వస్తే ఒళ్లంతా విరగబూసే మామిడి పూత మీద అందరి కళ్లు పడతాయి. పిందెల వేస్తున్నప్పటి నుంచి దిష్టి తగలకుండా యజమానులు నానా పాట్లు పడతారు. ఉండుండి పాడిగాలి వీచి పిందె రాలితే అదో బాధ. కోతుల దండు ఊడి పడితే వాటిని తరిమికొట్టే వరకూ గాబరా. కాయ గుప్పిటంత పెరిగాక కోసి పచ్చడి చేస్తే ఆ రుచి అద్భుతం. ఉగాది పచ్చడి మన ఇంటి కాయ తెచ్చే రుచి అద్భుతం. చిటారున గుబురులో పండిన కాయ పిల్లలు నిద్ర లేచి చెట్టు కిందకు వెళితే రాలి కనపడుతుంది. కోయిలలు వచ్చి పాట పాడి పిల్లలను బదులివ్వమంటుంది. చిలుకలు పండిన కాయలను సుష్టుగా భోం చేసి ఎర్ర ముక్కులు చూపించి పోతాయి. మామిడి చెట్టు ఉంటే ఇంట్లో ఇంకో మనిషి ఉన్నట్టే. కాని కారు పార్కింగ్ కోసం ఆ చెట్టును వదిలేసిన ఇళ్లే ఇప్పుడు. పిల్లలూ... మామిడిపండ్లను మీరు మోర్ మార్కెట్స్లోనే చూడక తప్పదు. చింతచెట్టు కథలు జాస్తి... చింతచెట్టు ఇంట్లో పెంచరు. ఆ చెట్టు ఊరిది. ప్రతి ఊళ్లో చింతచెట్టు అరుగు ఉంటుంది. అది మనుషులు కూడా తమ చింతలు మాట్లాడుకునేంత గాఢమైన నీడను కలిగి ఉంటుంది. వేసవి మధ్యాహ్నాలు చింత చెట్టు కింద పట్టే నిద్ర సామాన్యంగా ఉండదు. చింతకాయలు కాస్తే పిల్లలు వాటిని రాళ్లతో రాల్చి నోట పెట్టుకుంటారు. ఆడవాళ్లు దోటీలు పట్టుకుని వచ్చి చింత చిగురు కోసి వండుతారు. ఊరికి కొత్తగా ఎవరైనా వస్తే చింత చెట్టు ఆరా తీస్తుంది. గూడు లేని వాళ్లకు రాత్రిళ్లు అది ఇల్లు అవుతుంది. కాని చింత చెట్టు అంటే భయం కూడా ఉంటుంది. దెయ్యాలు దానిలో టూ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుని ఉంటాయని పుకార్లు ఉంటాయి. చింతచెట్టు కింద పడుకున్నవారి గుండెల మీద రాత్రుళ్లు దెయ్యం కూచుంటుంది. చింతచెట్టుకు రాత్రిళ్లు కార్బన్ డై ఆక్సైడ్ విడిచే సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్లే తగిన ఆక్సిజన్ అందక ఈ భ్రాంతులు. చింతచెట్టు లేని బాల్యం చాలా బోసి. కొంగలు వాలడానికి ఇష్టపడే చెట్టు అది. ఇవాళ ఊళ్లలో ఫ్లెక్సీలు ఉన్నాయి. విగ్రహాలు ఉన్నాయి. చింత చెట్టు మాత్రం లేదు. ఆలోచించాలి అందరం... గతంలో ఎన్నో ఇళ్ల పెరళ్లలో అరటి చెట్లు ఉండేవి. చాలా ఇళ్లల్లో కొబ్బరి చెట్లు వేసేవారు. బాదం చెట్లు పెంచే ఇళ్లకు లెక్క ఉండేది కాదు. చెట్టుకు వదిలాకే కట్టుబడికి స్థలం వదిలేవారు. కట్టేది ఒక ఇల్లయితే చెట్టు నీడ ఒక ఇల్లు అని ఆ కాలంలో తెలుసు. కాని ఇవాళ కాంక్రీట్ ఇళ్లు మాత్రమే కట్టి వేడి పెంచుతున్నాం. ఎండ మండుతోందని అవస్థలు పడుతున్నాం. ఉగాది అంటే చెట్లకు ప్రాభవ సమయాలు ఉన్నట్టు బతుకుకు కూడా ప్రాభవ సమయాలు ఉంటాయని తెలుసుకోవడం. తీపిని ఆస్వాదించడంతో పాటు చేదును మింగాలని తెలుసుకోవడం. తుఫానొచ్చి కొమ్మలు విరిగి పడినా మళ్లీ చిగురించవచ్చని తెలుసుకోవడం. చెట్టుకు పిల్లల్ని దూరం చేయవద్దు. బాల్యాన్ని అరుచితో నింపొద్దు. ఆలోచించండి. కొత్త ఉగాదికి ఆహ్వానం పలకండి. -
Chinta Chiguru: చింతలు తీర్చే చిగురు
చింత చిగురు.. ఇప్పుడంటే అంతా కమర్షియల్ అయింది కానీ గతంలో పల్లెటూర్లలో అలా నడుచుకుంటూ వెళ్లి కోసుకొచ్చుకొనేవాళ్లు. పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో చింతచిగురు చేరిస్తే దాని రుచే వేరంటారు భోజన ప్రియులు. కేవలం రుచి కోసమే కాదని, చింత చిగురు వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రధానంగా ఏప్రిల్– జూలై మాసాల్లో దొరికే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి, అవేంటో చూద్దాం.. ఇందులోనే ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్దకం సమస్య తొలగిపోతుంది. విరేచనం సులభంగా అయ్యేలా చూస్తుంది. పైల్స్ ఉన్న వారికి, జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి చింతచిగురు బాగా పనిచేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. టడయాబెటీస్ ఉన్న వారు చింత చిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి క్రమంగా తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టార్టారిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ తదితరాలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల ధృఢత్వానికి తోడ్పడతాయి. చింత చిగురును మెత్తగా నూరి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గుతాయి. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, పగుళ్లు వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్కర్వీ, మలేరియా వ్యాధులకు కూడా ఈ చిగురు చక్కగా పనిచేస్తుంది. కడుపులోని నులి పురుగులకు కూడా చింతచిగురు మంచి ఔషధం. చింతచిగురు టీ కానీ, చింతచిగురును వేణ్ణీళ్లలో మరిగించి కొంచెం తేనె కలుపుకుని తాగినా కానీ సాధారణ జలుబు, దగ్గులాంటివి మాయం అవుతాయి. చింతచిగురు జ్యూస్ ఆడవాళ్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ సమస్య కూడా దీనివల్ల తగ్గుముఖం పడుతుంది. కేవలం చిన్న చిన్న రోగాలకే కాదు.. పలు రకాల కాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. వందగ్రాముల చింత చిగురులో దాదాపుగా 239 కాలరీల శక్తి, ఒక్కగ్రాము ఫ్యాట్, 3 గ్రాముల ప్రోటీన్, 26 ఎంజీ సోడియం, 63 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాదాపు 16 శాతం ఐరన్, 6 శాతం విటమిన్ సీ, 1 శాతం విటమిన్ ఏ ఉంటాయి. సో... ఈసారి చింతచిగురు కనిపిస్తే వదలకండి! (చదవండి: నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement