-
‘స్వైన్’ విహారం
* గత 15 రోజుల్లోనే 15 మంది మృతి * ఐదేళ్లలో 200 మందికి పైగా మృత్యువాత * కేంద్ర సాయం కోరిన తెలుగు రాష్ట్రాలు * నేడు హైదరాబాద్కు ఎన్సీడీసీ బృందాలు * ఏపీలో ఒకరి మృతి * ప్రాణాంతకం కాదు.. ఆందోళన వద్దు: వైద్యులు సాక్షి, హైదరాబాద్: స్వైన్ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ మహానగరాన్ని స్వైన్ఫ్లూ వణికిస్తోంది. గత పదిహేను రోజుల్లో స్వైన్ఫ్లూ కారణంగా 15 మంది మృతి చెందారంటే హెచ్1 ఎన్1 వైరస్ తీవ్రత ఎలా ఉందో ఊహించుకోవచ్చు. 2009 నుంచి ఇప్పటివరకూ ఏటా స్వైన్ఫ్లూ వైరస్ కేసులు నమోదవుతున్నా నివారణకు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకున్న సందర్భాల్లేవు. ఇప్పుడు రోజూ మరణాలు చోటుకుంటున్న దశలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. మెడికల్ టూరిజానికి దక్షిణాదిలోనే మహానగరంగా చెప్పుకునే హైదరాబాద్లోనే పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాలకు అంటువ్యాధులు విస్తరిస్తే ఎలా ఉం టుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ను స్వైన్ఫ్లూ వణికిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోనూ ఒకరు మరణించగా.. 11 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించడం ఈ భయాలను రెట్టింపు చేస్తోంది. విధిలేని పరిస్థితుల్లో రెండు తెలుగు ప్రభుత్వాలు కేంద్రాన్ని సాయం కోరాయి. ఈ నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) వైద్య బృందాలు గురువారం హైదరాబాద్కు రానున్నాయి. నిరోధానికి, నివారణకు చర్యలెక్కడ?: జలుబుతో మొదలై ఆయాసంతో ఉధృతమయ్యే ఈ వ్యాధి మనిషిని క్షణక్షణానికీ కుంగదీస్తూంటుంది. అలాంటి ఈ వ్యాధి నిరోధానికి, నివారణకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్దిష్ట చర్యలు శూన్యం. తెలంగాణలో 10 జిల్లాలుంటే హైదరాబాద్లోని ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలకు వీలుంది. ఓ వైపు హైదరాబాద్, మహబూబ్నగర్లలో స్వైన్ఫ్లూ కేసులు నమోదై, జనం పిట్టల్లా రాలుతున్నా.. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా నివారణ చర్యల్లేవు. మందులు తగినన్ని ఉంచడంగానీ, ప్రత్యేక వార్డులు ఏర్పాటు, ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చర్యలుగానీ లేనేలేవు. రెండేళ్లకోసారి వైరస్ సైక్లింగ్ హెచ్1ఎన్1 వైరస్ ప్రతి రెండేళ్లకోసారి విజృంభిస్తోంది. ఎందుకంటే దీని పునరుత్పత్తికి సమయమిదే. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి 2009లో ప్రవేశించింది. 2010లోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. తరువాత తగ్గుముఖం పట్టింది. 2011లో కేవలం 11 కేసులే నమోదయ్యాయి. 2012 చివర్లో మళ్లీ కేసులు నమోదయ్యాయి. 2013, 2014 సంవత్సరాల్లో రెండంకెల కేసులు నమోదవగా.. వైరస్ పునరుత్పత్తిలో భాగంగా 2015లో విజృంభించింది. ఇప్పటికే 650 కేసులు నమోదయ్యాయి. అయితే వైరస్ విజృంభించేవరకూ చర్యల్లేకపోవడం విస్మయపరిచే అంశం. హైదరాబాద్లోనే స్వైన్ఫ్లూ ఎందుకు ఎక్కువ.. 2009 నుంచి ఇప్పటివరకూ మొత్తం నమోదైన కేసుల్లో 80 శాతం స్వైన్ఫ్లూ కేసులు హైదరాబాద్, దాని పరిసర ప్రాంతమైన రంగారెడ్డి జిల్లానుంచి నమోదైనవే. దీనికి ప్రధాన కారణం.. ఎక్కడ జనసమర్థం ఎక్కువ ఉంటుందో అక్కడే ఈ వైరస్ విస్తరిస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండి, ప్రయాణం ఎక్కువగా చేస్తే దీని వ్యాప్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ఈ వ్యాధి సోకిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై అవగాహన లేకపోవడం వ్యాప్తికి మరో కారణం. స్వైన్ఫ్లూ లక్షణాలున్న వ్యక్తి గదికే పరిమితం కాకపోవడం, జనంలో ఉండటం వల్ల ఈ వైరస్ మరింతమందికి సోకుతోంది. ఇప్పటి వరకూ 200 మృతులు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటినుంచి ఇప్పటివరకూ స్వైన్ఫ్లూ వైరస్ సోకి 200 మంది మృతి చెందినట్టు అధికారవర్గాలే చెబుతున్నాయి. ఎక్కువగా 2010లో 56 మంది మృతిచెందారు. ఇక అమెరికా నుంచి దిగుమతి అయిన స్వైన్ఫ్లూ(హెచ్1ఎన్1) వైరస్ ద్వారా మన దేశంలో నమోదైన మొదటి కేసు హైదరాబాద్లో చోటుచేసుకోవడం విశేషం. 2009 మే 13న అమెరికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి హెచ్1ఎన్1 సోకింది. దశలవారీగా విజృంభణ స్వైన్ఫ్లూ వైరస్ దశలవారీగా విజృంభిస్తుంది. తొలుత జలుబు చేయడం... ఆ తర్వాత జ్వరం రావడం తొలి దశగా గుర్తించాలి. ఇక రెండో దశలో ఆయాసం వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ దశలో తక్షణమే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. ఇక మూడవ దశ అంటే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం. ఈ దశ చాలా ప్రమాదకరమైనది. రోగిని వెంటిలేటర్పై పెట్టాలి. దురదృష్టవశాత్తూ మూడవ దశలోకి వచ్చినవారిలో 80 శాతంపైనే మృతులు చోటుచేసుకుంటున్నాయి. అప్రమత్తంగా ఉన్నాం..మంత్రి కామినేని స్వైన్ఫ్లూ వ్యాధి నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంలతో సమీక్ష జరిపారు. స్వైన్ఫ్లూ వ్యాధిపై అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అప్రమత్తం చేశామని, నిరోధానికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఇప్పటివరకూ ఏపీలో రెండు స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వాసుపత్రులతోపాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ స్వైన్ఫ్లూ మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఏపీలో ఒకరు మృతి: సీఎస్ వెల్లడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకూ 11 స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయని, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రులన్నిటిలో టామి ఫ్లూ మందులతోపాటు మిగతా వ్యాధి నిరోధానికి ఉపయోగపడే అన్ని మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలిచ్చారు. దగ్గు, జలుబు, జ్వరం బారిన పడి ఆసుపత్రులకు వచ్చేవారిపై ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రమాదం లేదు.. నిర్లక్ష్యం పనికిరాదు స్వైన్ఫ్లూ వ్యాధి సోకితే పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మొత్తం మూడు దశల్లో స్వైన్ఫ్లూ ఉంటుంది. తొలి దశలో ఉన్నవారికి రక్తపరీక్షలు అక్కర్లేదు. రెండోదశ, మూడో దశలో ఉన్నవారికి పీసీఆర్ టెస్టు చేయాలి. తొలి దశలో జలుబు, స్వల్పంగా జ్వరం ఉంటుంది. రెండో దశలో ఆయాసం, శ్వాసపీల్చడం కష్టమవుతుంది. మూడో దశలో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ వేసుకోవచ్చుగానీ.. అందరికీ పనికిరాదు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఇది వేసుకోవాలి. వ్యాక్సిన్ 70 శాతం వరకే రక్షణనిస్తుంది. మిగతా 30 శాతం జాగ్రత్తలతోనే సాధ్యం. - డాక్టర్ నాగేశ్వరరెడ్డి, చైర్మన్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆందోళన అవసరం లేదు స్వైన్ఫ్లూ గురించి ఆందోళన వద్దు. అవగాహనతో నివారించవచ్చు. స్వైన్ఫ్లూ నివారణ స్వీయ నియంత్రణపైనే ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణ జనం కంటే గర్భిణుల్లో వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువ. స్థూల కాయుల్లో 9 రెట్లు ఎక్కువ. అందుకే వీళ్లిరువురూ రోగ నిరోధక శక్తినిచ్చే బలమైన ఆహారం తీసుకోవాలి. స్వైన్ఫ్లూ వ్యాధి లక్షణాలున్నవారు బయటకు రావడంగానీ, ప్రయాణాలు చేయడంగానీ, ఫంక్షన్లకుగానీ వెళ్లకూడదు. - స్వైన్ఫ్లూ నోడల్ అధికారి డా.శుభాకర్ -
స్వైన్పై సమరం
* ఆగమేఘాలపై కదిలిన తెలంగాణ ప్రభుత్వం * యుద్ధప్రాతిపదికన చర్యలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు * ఇప్పటికి 19 మంది మృతి, ఆసుపత్రుల్లో 30 మంది వరకు రోగులు * ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రితోనూ మాట్లాడిన కేసీఆర్ * తక్షణ సాయానికి కేంద్రం సంసిద్ధత.. నేడు రాష్ట్రానికి నిపుణుల బృందం * కేబినెట్ భేటీలో సమీక్షించిన సీఎం, కార్పొరేట్ వైద్యులతోనూ సమావేశం * జిల్లాకో ఐఏఎస్ కేటాయింపు.. హైదరాబాద్లో ఐదు జోన్లకు ఐదుగురు * వెంటనే చర్యలు చేపట్టేలా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి * ప్రాణాంతకం కాదు.. ఆందోళన వద్దని వైద్యుల సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విజృంభిస్తున్న స్వైన్ఫ్లూపై సర్కారు యుద్ధం ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. స్వైన్ఫ్లూతో మంగళవారం ఒక్కరోజే ముగ్గురు మృత్యువాత పడడంతో ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. వైరస్ వల్ల ఇప్పటివరకు 19 మంది మరణించారని, మరో 30 మంది వరకు చికిత్స పొందుతున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో స్వయంగా మాట్లాడారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన సాయం అందించాలని, నిపుణుల బృందాన్ని పంపించాలని కోరారు. స్వైన్ఫ్లూపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ను ఎదుర్కొనేందుకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి నడ్డా హామీ ఇచ్చారు. అవసరమైన మందులు, సిరప్లతో పాటు నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపేందుకు అంగీకరించారు. రాష్ర్టంలోని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో కేసీఆర్ సమావేశమై స్వైన్ఫ్లూను అరికట్టడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి మంత్రులతోనూ దీనిపై చర్చిం చారు. వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. భేటీ తర్వాత సహచర మంత్రులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహమ్మారి కాదు.. భయం వద్దు.. ‘స్వైన్ఫ్లూ మహమ్మారి కాదు. ఒకరి నుంచి మరొకరికి వచ్చే వైరస్. ఇది సోకిన వారు జనసమ్మర్దం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిరగకుంటే వైరస్ వ్యాపించదు. రోగుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్తోపాటు జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తాం. పూర్తి చికిత్స అందించిన తర్వాతే బాధితులను బయటకు పంపిస్తాం. ఇందుకు అవసరమైన టామీఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయి. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే ప్రజలు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ ఆ లక్ష ణాలు ఉన్నట్లు తేలితే.. వారిని 108 అంబులెన్సుల్లో నగరానికి తీసుకుని వచ్చి చికిత్స చేయిస్తాం. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు సామాజిక పరిశుభ్రత కూడా ఉండాలి. స్వైన్ఫ్లూను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ఉత్తర్వులిచ్చాం. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లుదాటిన పెద్దలు, గర్భిణీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. వైరస్ సోకిన రోగుల వివరాలు సేకరించి వారి ఇంట్లోనూ పూర్తిగా స్టెరిలైజేషన్ చేస్తాం. ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులు ఇకపై పూర్తి సమన్వయంతో ఈ కార్యక్రమం చేపడతాం. 50 వేల ట్యాబ్లెట్లు, పదివేల సిరప్లు, రోగ నిర్ధారక యంత్రాలు ఇవ్వడానికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది’ అని సీఎం వివరించారు. స్వైన్ ఫ్లూ వస్తుందని ముందస్తుగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారని, దానివల్ల అనర్ధాలు జరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. కాగా, స్వైన్ఫ్లూ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ తగినవిధంగా స్పందించలేదని మంత్రులతో సమీక్ష సందర్భంగా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెనుకబడ్డాం: రాజయ్య స్వైన్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం వెనుకబడిందని వైద్య శాఖ మంత్రి రాజయ్య అంగీకరించారు. ఈ వైరస్ విషయంలో తగిన ప్రచారం నిర్వహించడంలో లోపం జరిగిందన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వైన్ ఫ్లూను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఇకపై విస్తృత ప్రచారం కూడా నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలోనే నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తామన్నారు. హైదరాబాద్లో రూ. 5 కోట్లతో ప్రత్యేక స్వైన్ఫ్లూ వార్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2009 నుంచి ఇప్పటివరకు 10,513 మందిని పరీక్షించగా... అందులో 1953 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిం దని, వీరిలో సగం మంది చనిపోయారని వెల్లడించారు. రాష్ర్టంలో ఇప్పటివరకు 142 మందికి సమర్థంగా వైద్యం అందించి నయం చేయగా, ఏడుగురు మరణించారని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 38 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, సీఎం చెప్పిన గణాంకాలు వేరుగా ఉండటంపై స్పందిస్తూ.. తాను ప్రభుత్వాసుపత్రుల్లో నమోదైన కేసుల వివరాలే చెప్పినట్లు వివరణ ఇచ్చారు. మాస్క్లు అవసరం లేదు: వైద్యులు స్వైన్ ఫ్లూ ప్రాణాంతకం కాదని, అది ఉత్తుత్తి దగ్గు, జలుబేనని రాష్ట్రంలో పేరొందిన కార్పొరేట్ ఆసుపత్రుల వైద్య నిపుణుల బృందం పేర్కొంది. ప్రజలు భయాందోళన చెందవద్దని ధైర్యం చెప్పింది. మాస్క్లు వాడాల్సిన అవసరం లేనే లేదని, వాక్సిన్ వేయించుకోవాలనే తొందరపాటు నిర్ణయాలేమీ తీసుకోవద్దని కూడా సూచించింది. చలి కాలంలోనే ఈ వైరస్ విజృంభించేందుకు అవకాశముందని, మరో రెండు వారాలు గడిస్తే దాని ప్రభావం తగ్గిపోతుందని తేల్చి చెప్పారు. సచివాలయంలో సీఎంతో భేటీ తర్వాత ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్య బృందం మీడియాతో మాట్లాడింది. ఐదేళ్ల కిందట ఉన్న తీవ్రత ఇప్పుడు లేదని, ఇప్పుడు అందరిలోనూ స్వైన్ఫ్లూను తట్టుకునే శక్తి సమకూరిందని వారు పేర్కొన్నారు. జలుబు, దగ్గు బారిన పడ్డ వారి నుంచి వైరస్ సోకకుండా కనీస జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నారు. ఐఏఎస్లకు ప్రత్యేక బాధ్యతలు స్వైన్ఫ్లూ నియంత్రణ చర్యల కోసం జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారి చొప్పున పరిశీలకులను ప్రభుత్వం నియమించింది. వీరు సీఎస్కు రోజూ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పత్రికలకూ తగిన సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నియమించిన 14 మంది ఐఏఎస్ అధికారుల్లో అదర్సిన్హా(ఆదిలాబాద్), వినోద్కుమార్ అగర్వాల్(కరీంనగర్), రంజీవ్ ఆచార్య(నల్లగొండ), రేమండ్పీటర్(మహబూబ్నగర్), వాణిప్రసాద్(రంగారెడ్డి), అరవింద్కుమార్(ఖమ్మం), బీపీ ఆచార్య(వరంగల్), బి. వెంకటేశం(మెదక్), డాక్టర్ జనార్దన్రెడ్డి(నిజామాబాద్), హైదరాబాద్లో రాజేశ్వర్ తివారి(జోన్-1), ఆర్వీ చంద్రవదన్(జోన్-2), సునీల్శర్మ(జోన్-3), అహ్మద్ నదీం(జోన్-4), హర్ప్రీత్సింగ్(జోన్-5) ఉన్నారు. రాష్ట్రానికి నేడు కేంద్ర బృందం స్వైన్ఫ్లూను అరికట్టేందుకు రాష్ట్రానికి తమ వంతు సహకారం అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మరిన్ని కేసులు న మోదుకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బుధవారం ఆయన రాష్ర్ట ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. పరిస్థితి అంచనాకు, రాష్ర్ట యంత్రాంగానికి మార్గనిర్దేశం చేయడానికి ముగ్గురు సభ్యుల బృందాన్ని గురువారం రాష్ట్రానికి పంపుతున్నట్లు చెప్పారు. అన్ని అంశాలపై ఈ బృందం సమీక్ష నిర్వహించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తుందన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందిస్తూ జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం(ఎన్డీసీసీ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అశోక్ కుమార్, అదనపు డెరైక్టర్ శశి ఖరేతో పాటు సమీకృత వ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమం(ఐడీఎస్పీ) అధికారి డాక్టర్ ప్రదీప్ ఖస్నోబిస్తో కూడిన బృందం రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు. తెలంగాణకు సాయం అందించాలని మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement