breaking news
ST Gurukuls
-
పురుగుల అన్నం తినమంటున్నారు..!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: తాము తినే అన్నంలో పురుగులొస్తే సైతం తీసేసి తినమని వార్డెన్ చెబుతున్నారని జిల్లా కేంద్రంలోని తిరుమలాహిల్స్ వద్ద ఉన్న ఎస్టీ బాలికల గురుకుల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం తిరుమలాహిల్స్ వద్ద నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు విద్యార్థినులు ర్యాలీగా వచ్చి, కలెక్టరేట్ ముందు భైఠాయించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. అన్నం ఇలాగే ఉంటుందని, లేకుంటే వండుకుని తినాలని వార్డెన్ అనేక సార్లు పేర్కొంటుందన్నారు. హాస్టల్లో మూడేళ్ల నుంచి ఉంటూ తాము చదువుతున్నామని, ప్రిన్సిపాళ్లు మారినా హాస్టల్లో పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు. తమ హాస్టల్కు కలెక్టర్, మాజీ విద్యాశాఖ మంత్రి వచ్చి వెళ్లినా సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ప్రహరీ లేకపోవడంతో పాములు, ఇతర జంతువులు హాస్టల్లోకి వస్తున్నాయని, వీటి వల్ల ఏ ఇబ్బందులు వచ్చిన ఎవ్వరు పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు, బాత్రూంలు, నీటి వసతి లేకపోవడం వంటి అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఎవరైనా చనిపోతే ఇంటికి వెళ్లాల్సి వస్తే చనిపోయిన దానికి ప్రూఫ్ చూపిస్తేనే పంపిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. సమస్యలపై అనేక సార్లు రీజినల్ కోఆర్డినేటర్తో పాటు పై అధికారులకు ఎన్ని సార్లు నివేదించినా అసలు స్పందిచలేదని, తాము నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నామ న్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో ఏఓకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు లోకేష్నాయక్, రవీందర్, సంతోష్, డీవైఎఫ్ఐ నాయకులు రాజ్కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీ గురుకులాలకు కీర్తిని తెచ్చారు
పర్వతారోహణలో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి చందూలాల్ సన్మానం హైదరాబాద్: పర్వతారోహణలో గిరిజన విద్యార్థులు కొత్త చరిత్రను సృష్టించి, ఎస్టీ గురుకులాలకు ఎనలేని కీర్తిప్రతిష్టలను తీసుకొచ్చారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. గత ఏడాది మౌంట్ రెనాక్ను అధిరోహించిన 16 మంది ఎస్టీ గురుకులాల విద్యార్థులు, ఒక కోచ్ను, ఇటీవల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఎస్టీ విద్యార్థులు జి.సింధు, ఎన్.కృష్ణలను శుక్రవారం సంక్షేమ భవన్లో మంత్రి చందూలాల్ ఘనంగా సన్మానించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వీరికి రూ.51 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని కూడా అందజేశారు. అలాగే ఇంటర్మీడియెట్లో స్టేట్ర్యాంకులు సాధించిన డి.నాగమణి, టి.భావనలకు రూ. 25 వేల చొప్పున, అత్యధిక మార్కులను సాధించిన మరో 8 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 9వ తరగతి నుంచే సివిల్స్కు శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎస్టీ విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్యసేవలను అందించేందుకు ఎస్టీ సంక్షేమశాఖ కేంద్ర కార్యాలయంలో 24 గంటలు నడిచేలా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీశాఖ కమిషనర్ లక్ష్మణ్, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.