ఆర్టీసీ బస్సులో మహిళపై బ్లేడుతో దాడి
గార: సాఫీగా సాగుతున్న ఆర్టీసీ బస్సు ప్రయాణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏమైందోనని చూసేసరికి ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించి ఓ మహిళను బ్లేడుతో గాయపర్చి తనూ గాయపర్చుకున్నాడు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం నుంచి కళింగపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ రామచంద్రాపురం పంచాయతీ పరిధి జొన్నలపాడు గ్రామం వచ్చేసరికి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ... గార మండలం కొర్నికి చెందిన పిట్ట తిరుపతమ్మకు కొన్నేళ్ల కిందట పోలాకి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన పిట్ట గణేష్తో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు.
దంపతులిద్దరి మధ్య తగాదా చోటుచేసుకోవడంతో ఏడాదిగా కోర్టు లో కేసు నడుస్తోంది. తిరుపతమ్మ వారి కన్నవారి ఇంటి వద్ద ఉంటోంది. కోర్టు పనిమీద శ్రీకాకుళం తరుచూ వస్తుండడంతో శ్రీకాకుళం మండలం మునసబుపేటకి చెందిన నాగళ్ల మల్లేసుతో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా పెళ్లి చేసుకోమని వేధించసాగాడు. ఈ క్రమంలో కోర్టు వాయిదాకు తిరుపతమ్మ తన తల్లి తాండ్ర రాజులుతో కోర్టుకు వచ్చింది. అక్కడ మల్లేసు ఆమెతో గొడవపడ్డాడు.
అక్కడే కత్తితో ఆమెను బెదిరించాడు. ఆ తర్వాత తిరుపతమ్మ తల్లితో కలిసి ఇంటికి బయలుదేరింది. వీరికి తెలియకుండా మల్లేసు కూడా ఆర్టీసీ బస్సు ఎక్కాడు. జొన్నలపాడు వచ్చేసరికి తనతో తె చ్చుకున్న బ్లేడుతో ఆమెను కోసేందుకు ప్రయత్నించాడు. తిరుపతమ్మ తప్పించుకొనే ప్రయత్నంలో వీపుకు గాయమైంది. దీంతో మల్లేసు తన మెడను కోసుకున్నాడు. ప్రయాణికులు 108కు సమాచారమివ్వడంతో రిమ్స్కు తరలించారు. క్రైమ్ డీఎస్పీ ఎన్.శ్రీదేవిరావు, ఎస్ఐ చిన్నంనాయుడు రిమ్స్కు వెళ్లి బాధితురాలి పరిస్ధితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.