breaking news
special monitoring
-
వి'దాహ'నగరం
ఈ చిత్రంలో కనిపిస్తున్న మంచినీటి పథకం విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్కు కూతవేటు దూరంలో ఉన్న తోటపాలెం వైఎస్సార్నగర్లో ఉంది. సుమారు రూ. 45.5లక్షల వ్యయంతో 2015లో నిర్మించిన ఈ పథకం కొన్ని నెలలుగా పనిచేయడంలేదు. కానీ, ఏ ఒక్క అధికారీ పట్టించుకున్న పాపాన పోలేదు. మరమ్మతు చేయిద్దామని ముందుకు రావడం లేదు. ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అయినా వారికి పట్టడంలేదు. ఇది జిల్లా కేంద్రంలో ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్యే అనుకుంటే పొరపాటే. జిల్లాలో ఇలాంటి పథకాలు అనేకం ఉన్నాయి. ఒకవైపు క్రాష్ప్రొగ్రాం పేరిట హడావుడి చేస్తున్నా ఎక్కడా తాగునీటి సమస్య పరిష్కార దిశగా అడుగులైతే పడటంలేదు. ► జిల్లా కేంద్రంలోనే దాహం కేకలు ► తోటపాలెం వైఎస్సార్కాలనీలో పనిచేయని మంచినీటి పథకం ► వేసవి వచ్చేసినా చొరవ చూపని యంత్రాంగం ► మిగతా చోట్లా అదే పరిస్థితి సాక్షి ప్రతినిధి, విజయనగరం : వేసవి వచ్చేసింది. జిల్లా వ్యాప్తంగా అప్పుడే నీటి ఎద్దడి మొదలైంది. తాగునీటి ఇక్కట్లు లేకుండా, పరిష్కార చర్యలు తీసుకునేందుకు అప్రమత్తమైనట్టు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా క్రాష్ ప్రొగ్రామ్ నిర్వహిస్తుండగా, పట్టణాల్లో మున్సిపల్ యంత్రాంగం తగు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఎక్కడే సమస్య ఉన్నా ఇట్టే పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్టు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేశారు. కానీ ఇవేవీ అమలు కావడం లేదని చెప్పడానికి తోటపాలెం వైఎస్సార్కాలనీలో లక్షలాది రూపాయలతో నిర్మించిన మంచినీటి పథకాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇదేదో నదిపై ఆధారపడిన మంచినీటి పథకం అనుకుంటే పొరపాటే. ఊటబావుల రీచార్జ్తో పనే లేదు. స్థానికంగా తీసిన బోరు ద్వారా కాలనీ వాసులకు నీరు సరఫరా చేయాల్సి ఉంది. జిల్లాలో పరిస్థితులూ అంతే...: జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలో మిగతా చోట్ల ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 150 వరకు మంచినీటి పథకాలు చెడిపోయినట్టు లెక్కలు ఉన్నాయి. వీటి సంగతి ఎలా ఉందో స్థానికులకే ఎరుక. ఒకవైపు కలెక్టర్ సీరియస్గా తీసుకుని సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో మంచినీటి సమస్య తలెత్తకూడదని, నిధుల కోసమని వెనక్కి చూడొద్దని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశిస్తున్నారు. తరచూ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ, అధికారులకు ఇవేవీ తలకెక్కడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పాలకులు కూడా వీటిగురించి పట్టించుకోవడంలేదు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి: వాస్తవానికి ఈ పథకం 2013 డిసెంబర్ 11వ తేదీన మంజూరైంది. దీన్ని నిర్మించడానికి అధికారులకు రెండేళ్లు పట్టింది. 2015లో ప్రారంభమైంది. కానీ, కాలనీ వాసులకు సక్రమంగా ఎప్పుడూ నీరందించడం లేదు. ఎప్పటికప్పుడు మొరాయిస్తోంది. మున్సిపల్ అధికారులకు ఎప్పుడో బుద్ధి పుడితే అలా వచ్చి ఏదో చేసి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత పరిస్థితి మామూలే. సాధారణంగా వేసవి సీజన్ వచ్చేసరికి మరమ్మతుకు గురైన మంచినీటి పథకాలను యుద్ధ ప్రతిపాదికన బాగు చేయాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందిస్తారు. కానీ, విజయనగరం మున్సిపల్ అధికారులకు తోటపాలెం వైఎస్సార్ కాలనీలో మూలకు చేరిన మంచినీటి పథకం గుర్తుకు రాలేదు. అసలిక్కడ బోర్లు ఎలా ఉన్నాయి? మంచినీటి పథకం ఎలా ఉంది? అన్నదానిపై పరిశీలనే జరగలేదు. వేసవి నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. ఇక్కడదేమీ జరగకపోవడంతో నెలల తరబడి పనిచేయని మంచినీటి పథకానికి మోక్షం కలగడం లేదు. చెప్పాలంటే అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో 250కి పైగా కుటుంబాలు తాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నాయి. మరమ్మతు చేయిస్తాం: ఆ నీటి పథకం పనిచేయడం లేదని నా దృష్టికి రాలేదు. తప్పని మరమ్మతు చేపట్టి సమస్య పరిష్కరిస్తాం. మున్సిపల్ డీఈని పంపిస్తాను. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. తాగునీటి సమస్య లేకుండా చూసుకుంటాను. ---నాగరాజు, మున్సిపల్ కమిషనర్, విజయనగరం -
‘మిషన్ భగీరథ’ వేగవంతం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసి సురక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఈ నెల 2, 3 న జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపై అధికారులతో సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో మిషన్ భగీరథ పనుల్లో అలసత్వంపై ఆయన అసంతృప్తిని కూడ వ్యక్తం చే శారు. మిషన్ భగీరథ పనుల వేగం పెంచేందుకు సీఎం కార్యాలయపు అదనపు కార్యదర్శి స్మితసబర్వాల్ను ప్రత్యేక పర్యవేక్షణ కోసం పంపిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతోసమావేశం నిర్వహించి పనుల వేగం పెంచారు. ఇదే సమయంలో మిషన్ భగీరథ పనులు నిర్దేశిత లక్ష్యం ప్రకారం పూర్తయ్యేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ మంగళవారం మెదక్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు రొనాల్డ్రోస్, డాక్టర్ యోగితారాణాలు, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థల నిర్వాహకులతో కలిసి పనులను పరిశీలించారు. మెదక్, నిజామాబాద్లో పనుల పరిశీలన.. జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.1300 కోట్ల అంచనాతో మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు సమీపంలో పెద్దరెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న ఇన్టెక్ వెల్, వాటర్ గ్రిడ్ ట్రిట్మెంట్ ప్లాంట్, పంపింగ్ వెల్ పనులను స్మిత సబర్వాల్ తనిఖీ చేశారు. అనంతరం బాల్కొండ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్తో జలాల్పూర్ వద్ద నిర్మించే మిషన్ భగీరథ పనులను సబర్వాల్ పరిశీలించారు. ఇన్టెక్ వెల్, పంపింగ్ హౌస్, రోజుకు 14 కోట్ల లీటర్ల సామర్థ్యం గల మూడు వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 1350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆమె తెలిపారు. జలాల్పూర్ ఇన్టెక్ వెల్కు అనుసంధానంగా అర్గుల్ వద్ద రోజుకు 6 కోట్ల లీటర్లు, ఇందల్వాయి వద్ద రోజుకు 4 కోట్ల లీటర్లు, మల్లన్నగుట్ట వద్ద రోజుకు 4 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ట్రిట్మెంట్ ప్లాంట్ల పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు. వీటికి తోడుగా గతంలో ఈ ప్రాంతంలో నిర్మించిన ఒక్కొక్కటి 3 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన 3 వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్లకు జలాల్పూర్ వద్ద నిర్మించే ఇన్టెక్ వెల్ నుంచి నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జలాల్పూర్ ఇన్టెక్ వెల్ నుంచి 20 మండలాల్లోని 860 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇంటింటికీ సురక్షిత నీరు.. స్మిత సబర్వాల్తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జగన్మోహన్రెడ్డి, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఎస్ఈ ప్రసాద్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మితసబర్వాల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు రాష్ట్రానికే తలమానికం కావాలన్నారు. నిర్ణీత కాలంలో నిర్దేశించిన గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రధాన పనులతో పాటు గ్రామాలలో ఇంటింటికి అనుసంధానం చేసే పైపులైన్ల పనులను కూడా ఏకకాలంలో చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పైపులైన్ల నిర్మాణపు పనులను మే నెలాఖరులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులకు నష్టం జరగరాదన్నారు. పెద్దరెడ్డిపేట వద్ద నిర్మించే వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు 14 కోట్ల 50 లక్షల లీటర్లు ఉందని తెలిపారు. పెద్దరెడ్డి పేట నుంచి 5.25 కిలో మీటర్లు దూరంలో ఉన్న తడమనూరు (మెదక్ జిల్లా)కు 100 మీటర్ల ఎత్తున పంపింగ్ చేయనున్నట్లు తెలిపారు. తడమనూరు నుంచి గ్రావిటి ద్వారా జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజక వర్గాలలోని అన్ని గ్రామాలతో పాటు బోధన్ మున్సిపాలిటీకి, ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని కొన్ని గ్రామాలకు సింగూరు జలాలను శుద్ధిచేసి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 16 మండలాల్లోని 785 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయడం లక్ష్యమన్నారు. 2017 జూన్ నాటికి 213 గ్రామాలకు, 2017 డిసెంబరు నాటికి 512 గ్రామాలకు సింగూరు జలాలు అందుతాయని తెలిపారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయించేందుకు ప్రభుత్వం రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.