breaking news
speakar sirikonda madhusudana chari
-
చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తాం
11న జిల్లా ఆవిర్భావ వేడుకలు 10వేల బైక్ల ర్యాలీతో అధికారులకు ఘనస్వాగతం స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి : జయశంకర్ జిల్లా ఆవిర్భావ వేడుకలను చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. పట్టణంలోని భారత్ ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా ఏర్పాటులో భాగంగా ఈ నెల 11న భూపాలపల్లి పట్టణంలో 60 ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసేందుకు రానున్న ఉద్యోగులకు ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. 10వేల బైక్లతో భారీ ర్యాలీ, పూలవర్షం, బాణసంచా, కోలాటాలు, నృత్యాలు, డప్పు చప్పుళ్లతో స్వాగత ర్యాలీ ఉంటుందని వివరించారు. ఉద్యోగులు దసరా రోజున విధులకు హాజరవుతున్నందున వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. అన్ని సంఘాలు, పార్టీల నాయకులను ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోతున్న జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా భూపాలపల్లిలో భవనాలు, సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. భవనాల ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం ఎంతగానో కృషి చేసిందని, ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అదేరోజున పట్టణంలోని సింగరేణి వర్క్షాప్ కూడలి వద్ద 7 అడుగుల ఆచార్య జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఆయా కార్యక్రమాలకు మంత్రి చందూలాల్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధును ఆహ్వానిస్తామని చెప్పారు. జిల్లా ఆవిర్భావ వేడుకలకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్, వివిధ మండలాల నాయకులు మేకల సంపత్కుమార్, మందల రవీందర్రెడ్డి, మోడెం ఉమేష్గౌడ్, క్యాతరాజు సాంబమూర్తి, పైడిపెల్లి రమేష్, చెరకుతోట శ్రీరాములు, మారెల్ల సేనాపతి, గోవిందుల శ్యామ్ పాల్గొన్నారు. -
సహజ వనరుల కేంద్రం జయశంకర్ జిల్లా
శాసన సభాపతి మధుసూదనాచారి భూపాలపల్లి : జయశంకర్ జిల్లా సహజ వనరులకేంద్రంగా విలసిల్లుతుందని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జిల్లా కార్యాలయా లు తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న సింగరేణి, ప్రభుత్వ భవనాలను జేసీ ప్రశాంత్జీవన్పాటిల్, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్యతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. పట్టణంలోని మంజూర్నగర్లో ఉన్న ఇందూ అతిథిగృహం, ప్రభుత్వ ఐటీఐ భవనం, సింగరేణి ఎంవీ టీసీ కార్యాలయం, దేవాదుల డేటాబేస్ సెంటర్ను పరిశీలించారు. ఇందూ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.భూపాలపల్లి, మంథని, ములుగు నియోజకవర్గాలతో ఏర్పడబోతున్న జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాలు పరిశీలించినట్లు చెప్పారు. జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సహకరిస్తున్న సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చిట్యాల మండలం టేకుమట్ల గ్రామం 1987లోనే మండలంగా ఏర్పడాలని, అప్పుడు పట్టించుకోని వారు నేడు ఆరోపణలకు దిగడం సరికాదన్నారు. ములుగు ఆర్డీవో మహేందర్జీ, డ్వామా పీడీ వై.శేఖర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్రెడ్డి, పరకాల డీఎస్పీ సుధీంద్ర, నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ, వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, నిర్మల, భాస్కర్, వజ్రమణిబీబీచారి పాల్గొన్నారు.