breaking news
Soil testing centers
-
అలంకారప్రాయమే..
నిరుపయోగంగా భూసార పరీక్ష కేంద్రాల రైతులకు అందుబాటులో లేని అధికారులు పరీక్షలపై కొరవడిన ప్రచారం పాత పద్ధతుల్లోనే సాగు చేస్తున్న అన్నదాతలు ఖమ్మం :అధునాతన వ్యవసాయ పద్ధతులు, హరిత విప్లవ ఫలితాలను అందించి రైతులను రాజుగా చూడాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. జిల్లాలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంతో పాటు, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో ఈ కేంద్రాలు నెలకొల్పారు. ఇందులో ఒక ఏడీ స్థాయి అధికారి, నలుగురు ఇతర అధికారులు, సిబ్బంది ఉండాలి. అయితే ప్రస్తుతం ఖమ్మం మినహా ఏ కేంద్రంలోనూ సరిపడా ఉద్యోగులను నియమించడం లేదు. వీటి ద్వారా ప్రతి సంవత్సరం ఖమ్మం వంటి పెద్ద కేంద్రంలో ఆరువేల మట్టి నమూనాలు, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం కేంద్రాలలో రెండువేల చొప్పున సేకరించి పరీక్షలు నిర్వహించి ఆ వివరాలును రైతులకు చేరవేయాలి. కానీ భద్రాచలంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాన్ని ఇంతవరకూ తెరిచిన పాపాన పోలేదు. ఇక ఖమ్మంలో ఇప్పటి వరకు కేవలం రెండువేల నమూనాలు, కొత్తగూడెం, సత్తుపల్లిలో వెయ్యి మేరకు మాత్రమే పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు లెక్కలే చెపుతున్నాయి. జిల్లాలో మొత్తం సుమారు ఆరు లక్షల మంది రైతులు 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఇలా జాప్యం జరిగితే రానున్న 20 సంవత్సరాల్లో కూడా జిల్లాలో ఉన్న భూమి మొత్తాన్ని పరీక్షించలేరని స్పష్టం అవుతోంది. ఇక పరీక్షలు నిర్వహించిన భూముల్లోనూ ఆ వివరాలను ఆయా మండల వ్యవసాయ శాఖ అధికారి ద్వారా రైతులకు చేరవేసి, ఆ భూమికి అనుకూలంగా పంటలు సాగుచేసేలా సూచనలు ఇవ్వాలి. కాగా, ఇటీవల కొత్త విధానం పేరుతో రైతుల సెల్ఫోన్ నంబర్లు సేకరించి మెసేజ్ ద్వారా వివరాలు అందిస్తున్నామని అధికారులు చెపుతున్నారు. అయితే ఆ మెసేజ్ వివరాలు అర్థం కాక, చేసేదేమీలే పాత పద్ధతిలోనే వ్యవసాయం చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగానే పరీక్షలు.. భూమిలో ఉన్న పోషక విలువలు ఏమిటి..? ఏ పోషకాలు అధికంగా ఉన్న నేలల్లో ఏ పంటలు వే యాలి. ఏవి సాగుచేస్తే అధిక దిగుబడి వస్తుంది.. అనే వివరాలను భూసార పరీక్షల ద్వారా అధికారులు రైతులకు తెలియజేయాలి. దీనికి ముందు రైతులకు దీనిపై అవగాహన కల్పించాలి. కానీ జిల్లాలో అత్యధిక మంది రైతులకు భూసార పరీక్షలు నిర్వహిస్తారనే విషయమే తెలియక పోవడం శోచనీయం. ఇక కొంతమేర అవగాహన ఉన్న రైతులు మట్టి నమూనాలు ఇచ్చినా.. పరీక్షలు చేసే నాథుడే లేడు. కొన్ని కేంద్రాల్లో అధికారులు ఉన్నా.. అవసరమైన పరికరాలు, రసాయనాలు లేకపోవడంతో తూతూ మంత్రంగా పరీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఇదంతా తెలిసినా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొరవడిన ప్రచారం... భూసారం తెలుసుకుని వ్యవసాయం చేస్తే లాభదాయకమనే ప్రచారం చేయడంలో జిల్లా వ్యవసాయశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో నల్లరేగడి, ఎర్రచెక్క, చౌడు, ఇసుక నేలలు ఉన్నాయి. ఈ నేలల్లో కొన్నింటిలో భాస్వరం, పొటాష్ విలువలు, మరి కొన్నింటిలో నత్రజని అధికంగా ఉన్నాయి. అయితే ఏ నేలల్లో ఏ పంటలు వేయాలో అధికారులు రైతులకు వివరించాలి. ఇందుకోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖర్రెడ్డి క్షేత్రస్థాయిలో ఆదర్శ రైతులను నియమించి వారికి భూసార పరీక్ష కిట్లను అందజేశారు. అయితే ఆయన మరణానంతరం రైతులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రైతు చైతన్య సదస్సులు, పొలంబడి, ఇతర కార్యక్రమాలు నిర్వహించడంలో అధికారులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు చేసేదేమీ లేక పురాతన వ్యవసాయ పద్ధతులనే పాటిస్తూ.. దేవుడిపై భారం వేసి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి రైతు భూమిని పరీక్షించి ఏ పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుంది.. తమ చేలల్లో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి.. వాటిని అధిగమించేందుకు ఏం చేయాలి అనే విషయాలపై అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
భూసారం.. నిస్సారం..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయాధికారులు, ఆదర్శ రైతులు భూసార పరీక్షలపై అవగాహన కల్పించాలి. భూసారం దెబ్బతినకుండా, ఎరువుల వాడకం వల్ల నష్టాలపై వివరించాలి. మట్టినమూనాలు సేకరించి, పరీక్షలు జరిపి వాటి వివరాలు రైతులకు తెలియజేయాలి. కానీ, భూసార పరీక్ష కేంద్రాలు పరీక్షలకే పరిమితం అవుతున్నాయి. పరీక్షలు చేసి రైతులకు తెలియజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సిబ్బంది వ్యవసాయధికారులకు తెలియజేసినా వారు రైతులకు తెలుపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా భూసార పరీక్ష కేంద్రాల సిబ్బంది సెల్ మెసేజ్ రూపకంగా తెలియజేస్తున్నారు. సెల్ఫోన్ లేక కొందరు రైతులకు సమాచారం అందడం లేదు. కొందరు నిరక్ష్యరాస్యులు కావడంతో తెలియక పాతపద్ధతిలోనే సాగు చేస్తున్నారు. దిగుబడులు రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శాంపిళ్ల లక్ష్యం 11,500 ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షల హెక్టార్లకు పైగా వివిధ పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. పత్తి సుమారు 3.90 లక్షలు, సోయా 1.25 లక్షలు, వరి 60 వేలు, కందులు 50 వేలు, జొన్న 27 వేలు, మొక్కజొన్న 15 వేలు, పెసళ్లు 11 వేలు, మినుములు 10 వేల హెక్టార్లలో సాగు అవుతాయని అంచనా వేశారు. ఖరీఫ్, రబీ పంట కాలానికి సంబంధించి 10,300 నమూనాలు సేకరించారు. ఇప్పటివరకు 520 పరీక్షలు నిర్వహించి రైతులను సెల్ మెసేజ్ రూపంలో పంపించారు. ఇందులో ఖరీఫ్లో 6,500, మిగతావి రబీ సీజన్కు పరీక్షించి సేద్యానికి ముందే ఫలితాలు అందించాలి. ఖరీఫ్కు ముందే అందించాల్సిన నమూనా ఫలితాలు రైతులకు చేర డం అసాధ్యంగా కనిపిస్తుంది. జిల్లాలో భూసార కేంద్రాలు జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఇంద్రవెల్లిలో భూసార పరీక్ష కేంద్రాలున్నాయి. వీటిలో ఆదిలాబాద్ మినహ మిగత కేంద్రాలు తెరుచుకోవడం లేదు. తగిన సిబ్బంది, అధునాతన పరికరాల కొరతతో ఇవి పనిచేయడం లేదని పలువురు అధికారులే చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడా నమూనాలు సేకరించిన జిల్లా కేంద్రానికి పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోనూ ఇద్దరే అధికారులు ఉండటంతో జాప్యం జరుగుతోంది. దీంతో నమూనాలు హైదరాబాద్కు పంపించాల్సి వస్తుంది. దీంతో భూసార నమూనా పరీక్షల్లో జాప్యం జరుగుతుంది. భూసార పరీక్షల ఫలితాల ద్వారానే పంటలు వేయాలి.. - మంత్రి జోగురామన్న జిల్లాలో ఖరీఫ్, రబీ పంటలు సాగు చేసుకునే ముందు వ్యవసాయ భూమిలోని మట్టి నమూనాలను సేకరిం చి భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఫలితాల అ ధారంగానే పంటలు వేసుకోవాలని రాష్ట్ర అటవీ, ప ర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. రైతు లు వేసిన పంటనే వేస్తూ పంట మార్పిడి చేయకుండా పోటీ పడి ఎరువులు వేస్తూ పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి నష్ట పోతున్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాలు ఉ న్నాయని, మరిన్ని భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి తగినంత సిబ్బందిని నియమించి అధునాతన పరీక్ష యంత్రాలను అందేలా చూస్తామని అన్నారు.