breaking news
smart electric grid
-
‘నిట్’లో స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ కోర్సు
కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఈ ఏడాది నుంచి స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ నూతన కోర్సు అందుబాటులోకి రానుందని నిట్ డైరెక్టర్ రమణారావు తెలిపారు. ఈ మేరకు నిట్ వరంగల్, ఏబీబీ పవర్ గ్రిడ్స్ ఇండియా సంస్థ గురువారం పరస్పర ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా నిట్ వరంగల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి రమణారావు ఆన్లైన్లో ఏబీబీ పవర్ గ్రిడ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వేణు ఎంఓయూపై సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏబీబీ పవర్ గ్రిడ్స్ ఇండియా సౌజన్యంతో నిట్ వరంగల్ ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది నుంచి స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్పై ఎం టెక్, ïపీహెచ్డీ స్కాలర్లకు నూతన కోర్సును అందించనున్నట్లు తెలిపారు. నాణ్యమైన, 24 గంటలు అంతరాయం లేని విద్యుత్ అందించేందుకు అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల పరిశోధనలకు అనుగుణంగా స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘వన్ నేషన్, వన్గ్రిడ్, వన్ ఫ్రీక్వెన్సీ’అనే నినా దంతో భారతదేశ ఎలక్ట్రిక్ గ్రిడ్ ముందడుగు వేస్తుందని, స్కిల్ ఇండియా మిషన్ అనుసంధానంతో నిట్ వరంగల్లో స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ కోర్సుకు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు. -
విజయవాడలో స్మార్ట్ గ్రిడ్
కరెంటును ఎంత వాడుకుంటున్నారు, రాబోయే 24 గంటల్లో ఎంత డిమాండు ఉంటుందనే విషయాన్ని కూడా కనిపెట్టే స్మార్ట్ గ్రిడ్ ఒకటి విజయవాడకు త్వరలో రానుంది. జపాన్కు చెందిన ఫుజి ఎలక్ట్రిక్ సంస్థ ఈ గ్రిడ్ను ఏర్పాటు చేయనుంది. ఏపీ సీఎం చంద్రబాబును శుక్రవారం కలిసిన ఫుజి ప్రతినిధులు ఆయనకు విజయవాడలో పైలట్ ప్రాతిపదికన స్మార్ట్ గ్రిడ్ ఏర్పాటుచేస్తున్న విషయాన్ని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫీజిబులిటీ స్టడీలను కంపెనీ ఇప్పటికే పూర్తిచేసింది. కొత్త రాజధానికి కూడా ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలలో భవనాల మీద సెన్సర్లను అమరుస్తారు. అవి ఇంధన వినియోగాన్ని ముందుగా అంచనా వేసి, దాని ప్రకారం ఎంత అవసరమో చెబుతాయి. డిమాండ్ తక్కువగా ఉంటే, విద్యుత్తును వేరే గ్రిడ్కు పంపేందుకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. ఈ పరిజ్ఞానంతో విద్యుత్ సరఫరాలో వస్తున్న నష్టాలను 12.9 శాతం నుంచి 6 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం.