అశ్రునయనాల మధ్య వి.రామారావు అంత్యక్రియలు
హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు అంత్యక్రియలు అశ్రునాయనాల మధ్య సోమవారం హైదరాబాద్ రాయదుర్గంలోని శ్మశానవాటికలో జరిగాయి. అంతకు ముందు ఆయన పార్థీవదేహాన్ని అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, ఎంఆర్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ సహా పలువురు సీనియర్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. తర్వాత ఆయన పార్థివదేహాన్ని భారీ ర్యాలీగా రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటికకు తరలించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు గౌరవవందనం చేసి సంతాపసూచకంగా తుపాకులతో మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. చితికి రామారావు కుమారుడు శ్రీనివాస్ నిప్పం టించారు. అంత్యక్రియల్లో తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, మాజీ మంత్రులు నాగం జనార్దన్రెడ్డి, శ్రీధర్బాబు, బీజేపీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, సోము వీర్రాజు, బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, సినీనిర్మాత దగ్గుబాటి సురేష్బాబు, రామారావు బంధువులు, స్నేహితులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.