breaking news
Sikh families
-
దేశ విభజనతో విడిపోయిన కుటుంబాన్ని.. 75 ఏళ్లకు ఫేస్బుక్ ఒక్కటి చేసింది..!
లాహోర్: 1947లో దేశ విభజనతో వేరు పడిన ఇద్దరు సిక్కు సోదరుల కుటుంబాలు 75 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా సాయంతో ఎట్టకేలకు కలుసుకున్నాయి. కర్తార్పూర్ కారిడార్ వద్ద వీరి కుటుంబసభ్యులు ఆనందంతో పాటలు పాడుతూ ఒకరిపై ఒకరు పూలు చల్లుకున్నారు. గురువారం గురుదేవ్ సింగ్, దయాసింగ్ కుటుంబాల కలయికతో గురుద్వారా దర్బార్ సాహిబ్, కర్తార్పూర్ సాహిబ్ల వద్ద ఉద్విగ్నపూరిత వాతావరణం ఏర్పడింది. హరియాణా రాష్ట్రం మహేద్రగఢ్ జిల్లా గోమ్లా గ్రామానికి చెందిన ఈ సోదరులు తమ తండ్రి స్నేహితుడైన కరీం బక్ష్ తో కలిసి నివసించేవారు. దేశ విభజనతో కరీం బక్ష్ వీరిలో గురుదేవ్ను తన వెంట పాకిస్తాన్కు తీసుకెళ్లగా గోమ్లాలోనే మేనమామ వద్దే దయాసింగ్ ఉండిపోయారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఝాంగ్ జిల్లాలో నివాసం ఏర్పరుచుకున్న కరీంబక్ష్ గురుదేవ్ పేరును గులాం మహ్మద్గా మార్చాడు. గురుదేవ్ కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తన సోదరుడు దయాసింగ్ ఎక్కడున్నారో జాడ తెలపాలంటూ గురుదేవ్ భారత ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారని ఆయన కొడుకు మహ్మద్ షరీఫ్ తెలిపారు. ఎట్టకేలకు ఫేస్బుక్ ద్వారా ఆరు నెలల క్రితం తమ అంకుల్ దయాసింగ్ జాడ కనుక్కోగలిగామన్నారు. కర్తార్పూర్ సాహిబ్ వద్ద ఇరువురు కుటుంబాలు కలుసుకోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. వీసా మంజూరు చేసి హరియాణాలోని తమ పూర్వీకుల నివాసాన్ని చూసుకునే అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు కిలోమీటర్ల పొడవైన కర్తార్పూర్ కారిడార్తో భారతీయ సిక్కు యాత్రికులు పాక్ వైపు ఉన్న పవిత్ర దర్బార్ సాహిబ్ గురుద్వారాను వీసాతో అవసరం లేకుండా దర్శించుకునే అవకాశం ఉంది. కాగా, సోషల్ మీడియా సాయంతో భారత్, పాక్ల్లో ఉంటున్న సిద్దిక్(80), హబీబ్(78) అనే సోదరులు కూడా గత ఏడాది జనవరిలో కర్తార్పూర్ కారిడార్లో కలుసుకున్న విషయం తెలిసిందే. -
సిక్కులకూ ‘కల్యాణ లక్ష్మి’
♦ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి ♦ ప్రభుత్వ సెలవు దినంగా గురునానక్ జయంతి ప్రకటన హైదరాబాద్: ఇక నుంచి సిక్కు కుటుంబాల్లోని ఆడపిల్లలకూ ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలలోని అమ్మాయిల పెళ్లి ఖర్చుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సిక్కులకు కూడా విస్తరించనున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. సిక్కుల గురువు గురునానక్దేవ్జీ మహారాజ్ 545(ప్రకాష్ ఉత్సవ్)వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అఫ్జల్గంజ్ అశోక్బజార్లోని గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ, గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విశాల్దివాన్(ఆధ్యాత్మిక సభ)లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,మూడు వందల ఏళ్లుగా నగరంతో అనుబంధం ఉన్న సిక్కులు సామూహిక ప్రార్థనలు నిర్వహిం చుకునేందుకు, సభలు, సమావేశాల ఏర్పాటుకు కమ్యూనిటీ భవనం, ప్రార్ధనామందిరం కోసం మూడెకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ. కోటి నిధులను అందజేయనున్నట్లు వెల్లడిం చా రు. దక్షిణ భారత్లోనే అతి పెద్ద గురుద్వారా నగరంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సెలవు దినంగా నానక్ జయంతి గురునానక్ జయంతి రోజును ఇక నుంచి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించనున్నట్లు చెప్పారు.అపారమైన ధైర్య సాహసాలతో పాటు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో, కష్టపడేతత్వం గల సిక్కుల జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అనంతరం కేసిఆర్ తన కుటుంబం తరపున రూ.1.16 లక్షల చెక్కును గురుద్వారా నిర్మాణం నిమిత్తం నిర్వాహకులకు విరాళంగా అందజేశారు. ఉదయం 11గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుమారు 30వేలమంది సిక్కులు కుటుంబాల సమేతంగా పాల్గొని భక్తి, శ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ సందర్భంగా సిక్కు మతగురువులు భక్తి, భజన కీర్తనలు ఆలపించడంతో పాటు గురునానక్ దేవ్జీ మహరాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాలను, సందేశాలను బోధించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ, అల్పాహారం, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా గురుద్వారాల ఛైర్మన్ గురుచరణసింగ్బగ్గా, టీఆర్ఎస్ పార్టీ గోషామహల్, అంబర్పేట్ నియోజకవర్గాల ఇంచార్జిలు ప్రేమ్కుమార్ధూత్, ఎడ్ల సుధాకర్రెడ్డి, అశోక్బజార్ గురుద్వారా శ్రీ గురుసింగ్సభ అధ్యక్షుడు కుల్దీప్సింగ్బగ్గా, గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ అధ్యక్షుడు బల్దేవ్సింగ్ బగ్గా, కార్యదర్శులు ఇంద్రజిత్సింగ్ టుటేజా, అవతార్సింగ్ కనూజా, గురుద్వారాల ప్రబంధక్ కమిటీ ప్రతినిధులతో పాటు పెద్దసంఖ్యలో సిక్కుసోదరులు పాల్గొన్నారు.