breaking news
Sheila Balakrishnan
-
రంగంలోకి ‘అమ్మ’
అప్పీలు పిటిషన్ దాఖలు వ్యవహారాల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రభుత్వ పాలన, పార్టీ మీద అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత దృష్టి పెట్టారు. ప్రభుత్వ వ్యవహారాల్ని, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పరిశీలించే పనిలో తలమునకలై ఉన్నారు. పలువురు మంత్రుల్ని పిలిచి క్లాస్ పీకడంతో పాటుగా వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి హెచ్చరించి పంపినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అండ్ బృందానికి జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చిన జయలలిత పోయేస్ గార్డెన్కు పరిమితమయ్యారు. సీఎం పన్నీరు సెల్వం, నలుగురు మంత్రులతో తప్ప, మిగిలినెవ్వరితోను సంప్రదింపులు జరపడం లేదు. అవసరం అనుకుంటే ఆ నలుగురు మంత్రుల్ని పోయేస్ గార్డెన్కు పిలిపించడం లేకుంటే పన్నీరు సెల్వం, సలహాదారు షీలా బాలకృష్ణన్తో మాత్రమే సమీక్షిస్తున్నారు. జయలలిత ప్రభుత్వ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టని దృష్ట్యా, పన్నీరు ప్రభుత్వం గాడి తప్పిందంటూ ప్రతిపక్షాలు విమర్శించే పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి.. : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనకు పడ్డ శిక్షను వ్యతిరేకిస్తూ అప్పీలు పిటిషన్ దాఖలు చేసే పనిలో జయలలిత ఇన్నాళ్లు నిమగ్నమయ్యూరు. వేలాది పేజీలతో కూడిన అప్పీలు పిటిషన్లోని వివరాలన్నీ పరిశీలించాల్సి రావడంతో జయలలిత ప్రభుత్వ వ్యవహారాల్లో ఇన్నాళ్లు పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోలేక పోయారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా, కర్ణాటక హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేయడంతో ఇక, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు ఆమె సిద్ధమయ్యారు. అప్పీలు పిటిషన్ దాఖలు సజావుగా ముగియడంతో మంత్రులు, పార్టీ వర్గాల పని తీరును పరిశీలించడం మొదలెట్టారు. సీఎం పన్నీరు సెల్వం, సలహాదారులు షీలా బాలకృష్ణన్, రామానుజం, మంత్రులందర్నీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మరుసటి రోజు రాత్రి పోయెస్ గార్డెన్కు పిలిపించారు. క్లాస్ : ప్రభుత్వ వ్యవహారాలను పరిశీలించి, ప్రభుత్వ ఆదాయం పెంపు లక్ష్యంగా కొన్ని సూచనల్ని సలహాల్ని ఇచ్చారు. కుంటు పడ్డ పథకాల్ని కొనసాగించేందుకు ఆగమేఘాలపై చర్యలు తీసుకునే రీతిలో సూచించారు. కొందరు మంత్రుల పనితీరు మీద తీవ్ర ఆగ్రహాన్ని ఆమె వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఆనందన్, షణ్ముగనాథన్ను తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది. చక్కెర పరిశ్రమల కార్మికుల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టని మంత్రి తంగమణి, తమ తమ శాఖల్లో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటూ మంత్రులు వలర్మతి, పూనాక్షిలను మందలించారు. అలాగే , పార్టీ సంస్థాగత ఎన్నికలపై జిల్లాల వారీగా సమాచారం సేకరించిన జయలలిత ఏదేని వివాదాలు బయలు దేరినా, ఘర్షణలు చోటు చేసుకున్నా మూకుమ్మడిగా అందర్నీ బయటకు పంపించాల్సి ఉంటుందని ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులకు హెచ్చరికలు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ అమ్మ జయలలిత పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల మీద దృష్టి పెట్టడంతో నెలరోజుల వ్యవధిలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎవరెవ్వరు ఏఏ తప్పులు చేశారో వాటిని ఫిర్యాదుల రూపంలో జయలలితకు పంపిం చేందుకు పలువురు నాయకులు సిద్ధమయ్యారు. జయలలిత కొందరు మంత్రుల్ని తీవ్రంగా మందలించిన సంకేతాలతో త్వరలో మంత్రి వర్గం లో మార్పులు తప్పని సరి..! అన్న చర్చ అన్నాడీఎంకేలో మొదలైంది. -
సీఎస్గా మోహన్ వర్గీస్
సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మోహన్ వర్గీస్ సుంగత్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆమెను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా దేబేంద్రనాథ్ సారంగిని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సారంగి తన వంతు కృషి చేశారు. గత ఏడాది జనవరిలో ఆయన పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్గా 1976 బ్యాచ్కు చెందిన షీలా బాలకృష్ణన్ నియమితులయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత, సీఎస్లు మహిళలు కావడంతో ఇద్దరు కలసికట్టుగా కీలక నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నా యి. జయలలిత ఎక్కడకు వెళ్లినా, ఆమె వెన్నంటి షీలా బాలకృష్ణన్ ఉండే వారు. రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు లబ్ధిదారుల చెంతకు చేర్చడంలో షీలా బాలకృష్ణన్ తన వంతు కృషి చేశారు. అటు అధికారులతో, ఇటు మంత్రి వర్గంతోను సన్నిహితంగా ఉండి అందరి మన్నలు అందుకున్న షీలా బాలకృష్ణన్ సోమవారం పదవీ విరమణ పొందనున్నారు. దీంతో ఆమె స్థానంలో కొత్త సీఎస్ నియామకం అనివార్యం అయింది. సీఎస్గా మోహన్ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న మోహన్ వర్గీస్ సుంగత్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మోహన్ వర్గీస్ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన 1978 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. సబ్ కలెక్టర్గా తమిళనాడులో విధుల్లోకి చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగి ప్రధాన కార్యదర్శి హోదాను తన వశం చేసుకున్నారు. ఈయన సతీమణి షీలా రాణి సుంగత్ కూడా ఐఏఎస్ అధికారి. హస్త కళలు, చేతి వృత్తి దారుల సంక్షేమ బోర్డుకు డెరైక్టర్గా ఈమె వ్యవహరిస్తున్నారు. కొత్తగా సీఎస్ బాధ్యతలు చేపట్టనున్న మోహన్ వర్గీస్ అదనంగా ఏసీబీ, అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ బాధ్యతలను సైతం నిర్వర్తించనున్నారు. పదవీ విరమణ పొందనున్న షీలా బాలకృష్ణన్ సేవలను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది దేబేంద్రనాథ్ సారంగి సేవల్ని వినియోగించుకోవడం ధ్యేయంగా కొత్తగా ప్రభుత్వ సలహాదారు పదవిని ఏర్పాటు చేశారు. ఆయన ఏడాది పాటు ఆ పదవిలో ఉండి ప్రభుత్వానికి సేవలు అందించారు. ఇక నుంచి ఆ పదవిలో షీలా బాలకృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు అందించనున్నారు. షీలా బాలకృష్ణన్, మోహన్ వర్గీస్లు రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలితను శనివారం కలుసుకున్నారు. పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్నాళ్లు సేవలు అందించిన షీలాను జయలలిత అభినందించారు. కొత్త సీఎస్కు శుభాకాంక్షలు తెలియజేశారు.