breaking news
shah ghouse hotel
-
షాగౌస్లో అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి: కొత్తగూడలోని షాగౌస్ హోటల్లో గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కిచెన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి సీఐ ఆర్.శ్రీనివాస్ తెలిపిన మేరకు..కొత్తగూడలోని షాగౌస్ హోటల్లో శుక్రవారం మధ్యాహ్నం 12.55 గంటలకు గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో కిచెన్లో మంటలు చెలరేగాయి. మంటల తాకిడి పెరగడంతో కిచెన్లో పని చేస్తున్న 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్ అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో గంటసేపు శ్రమించి మంటలు ఆర్పారు. గాయపడిన క్షత గాత్రులను పక్కనే ఉన్న అపోలో ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి కొండాపూర్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారందరినీ అక్కడి నుంచి చాంద్రాయణగుట్టలోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర ఈద్గిర్కు చెందిన శాంతా బాయి (50) చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. భయానక పరిస్థితి షాగౌస్ హోటల్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ మంటలు రావడం, బాధితుల ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు హోటల్లోకి వెళ్లేందుకు యత్నించారు. మంటలు ఎక్కువగా ఉండటం, పొగ కమ్ముకోవడంతో ఎవరు లోపలికి వెళ్లే సహసం చేయలేదు. పోలీసులు వచ్చి సహాయక చర్యల్లో భాగంగా తలుపు, కిటికీలు, అద్దాలు పగులగొట్టారు. అనంతరం బాధితులను బయటకు తీశారు. హోటల్ నుంచి హెచ్పీ, ఇండేన్ గ్యాస్ (19.5) కేజీల సిలిండర్లు 26 స్వాధీనం చేసుకున్నారు. మరో అరగంట తరువాత హోటల్కు వినియోగదారులు వచ్చేవారు. గాయపడిన వారు వీరే... మహారాష్ట్ర ఈద్గిర్కు చెందిన శాంతా బాయి(50), ఆమె కుమారుడు రాజు(31)లు హఫీజ్పేట్లో నివాసం ఉంటూ షాగౌస్ హోటల్లో పాచిపనులు చేస్తున్నారు. శాంతాబాయికి 90 శాతం గాయాలయ్యాయి. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతోనే త ల్లిని హోటల్ గుమ్మం వరకు తీసుకొచ్చాడని సా ్థనికులు చెబుతున్నారు. హోటల్లో పనిచేసే ఒ డిషా కు చెందిన నిహజ్ అహ్మద్(38), ఎస్.కె.సయిఫుల్లా(30), ఎస్.కె.మనీర్(21), హజారుద్దీన్ ఖా న్(19), ఎస్.కె.హఫియుల్లా(25), జార్ఖండ్కు చెందిన మోనిస్(25), బీహర్కు చెందిన సయిపుల్లా(23), శామీర్పేట్కు చెందిన ఎస్.కె.తస్లీమ్(30)లకు 20 నుంచి 30 శాతం గాయాలయ్యాయి. హోటల్ సీజ్ శేరిలింగంపల్లి సర్కిల్ –20 ఏఎంహెచ్ఓ బిందు భార్గవి హోటల్ను పరిశీలించి సీజ్ చేశారు.హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించి హోటల్ను సీజ్ చేశారు. శభాష్ కుమార్... ఉబెర్ ఈట్స్లో డెలివరీ బాయ్గా పని చేసే కుమార్ షాగౌస్ హోటల్లో ప్రమాదం జరిగిందని తెలుసుకొని వెళ్లాడు. క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కాని కుమార్ నేనున్నా అంటూ హోటల్లోకి వెళ్లి బాధితులను అంబులెన్స్ ఎక్కించాడు. -
షాగౌస్ హోటల్లో తనిఖీలు
రాయదుర్గం: ఆహారాన్ని కల్తీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. రాయదుర్గం ఠాణాకు సమీపంలో ఉండే షాగౌస్ హోటల్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. వివరాలు ఇలా ఉన్నా యి. సోషల్ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు తనిఖీలకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ మూర్తిరాజు, వెస్ట్జోన్ వెటర్నీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వకీల్, సర్కిల్–11 ఏఎం హెచ్ఓ డాక్టర్ రవికుమార్, డాక్టర్ రంజిత్ హోటల్కు చేరుకుని ఆహార పదార్థాలను పరిశీలించారు. శాంపిల్స్ను సేకరించి నాచారంలోని స్టేట్ ఫుడ్ లేబరేటరీకి పంపించారు. అనంతరం హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. కాగా, తాము 25 ఏళ్లుగా హోటల్ బిజినెస్లో ఉన్నామని, 15 సార్లు ఉత్తమ హోటల్ అవార్డులను స్వీకరించామని హోటల్ యజమాని రబ్బానీ విలేకరులతో పేర్కొన్నారు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు సృష్టించిన ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. తమ హోటల్పై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలపై సైబర్ క్రైం విభాగంలోనూ, రాయదుర్గం ఠాణాలోనూ ఫిర్యాదు చేశామన్నారు. నగరంలోని పలు హోటళ్ల యజమానులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడిచే కబేళాల నుంచి మాత్రమే మాంసాన్ని కొనుగోలు చేయాలని షాగౌస్ హోటల్ నిర్వామకులను వెటర్నిటీ సెక్షన్ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు మరో నోటీసు కూడా జారీ చేశారు. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలోని అన్ని హోటళ్లకు ఇలాంటి నోటీసులే జారీ చేస్తామని తెలిపారు. మాంసం కొనుగోళ్లకు సంబంధించి జీహెచ్ ఎంసీ అధికారులు జారీ చేసిన నోటీసు ఇదే...