breaking news
Serampore
-
నూరేళ్ల నమ్మకం
నమ్మకం, నిజాయితీ సహజీవనం చేసే చోటు ఆ చాయ్ దుకాణం. అది నిన్న మొన్నటి దుకాణం కాదు, వందేళ్ల నాటిది. దీనికి పెట్టుబడి నమ్మకం, రాబడి నిజాయితీ. ప్రపంచంలోనే అరుదైన లక్షణాలు ఉన్న ఆ చాయ్ దుకాణం పశ్చిమ బెంగాల్లోని శ్రీరామ్పూర్ పట్టణంలో ఉంది. నరేశ్చంద్ర షోమ్ అనే స్వాతంత్య్ర సమరయోధుడు 1920లలో ఈ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ చాయ్ దుకాణాన్ని ప్రారంభించడానికి కారణం లాభాపేక్ష కాదు, ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల చర్చలు, సమావేశాలకు ఒక కుదురైన వేదికగా ఉపయోగపడటానికి నరేశ్చంద్ర షోమ్ దీనిని ప్రారంభించారు. ఆయన ఏ ముహూర్తాన ఈ దుకాణాన్ని ప్రారంభించారో గాని, నేటి వరకు ఈ చాయ్ దుకాణం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. నేటికీ స్థానిక తేనీటిప్రియులకు అభిమాన ఆలవాలంగా నిలిచి ఉంది.స్వాతంత్య్ర పోరాట కాలంలో మిగిలిన సమరయోధుల మాదిరిగానే నరేశ్చంద్ర కూడా తరచు అరెస్టయి జైలుకు వెళుతుండేవారు. తాను అరెస్టయినప్పుడల్లా ఆయన ఈ దుకాణం బాధ్యతలను స్థానిక కస్టమర్లకే అప్పగించేవారు. వారు చాలా నమ్మకంగా టీ పెట్టుకుని తాగి, అందుకు తగిన డబ్బును అక్కడే ఉంచి వెళ్లేవారు. వారు తమ తర్వాత వచ్చే కస్టమర్లకు ఆ బాధ్యతను అప్పగించేవారు. ఇప్పటికీ ఈ దుకాణంలో ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. నరేశ్చంద్ర తదనంతరం ఆ భవన యజమాని ‘లఖీరాణి దఖీ’ అల్లుడు అశోక్ చక్రవర్తి ఈ దుకాణం బాధ్యతలు తీసుకున్నాడు. క్లరికల్ ఉద్యోగం చేస్తున్న ఆయన ఉదయాన్నే దుకాణం తెరిచి; దుకాణానికి కావాల్సిన పాలు, టీ పొడి, పంచదార వంటివి ఏర్పాటు చేసి ఉద్యోగానికి వెళ్లిపోతారు. ఇక సాయంత్రం విధుల నుంచి రాగానే మళ్లీ దుకాణానికి వచ్చి, మూసేంత వరకు ఉంటారు. మరి మధ్య కాలంలో దుకాణంలో సిబ్బంది ఎవరూ ఉండరు. ఆ సమయంలో కొందరు స్వచ్ఛందంగా ఈ టీ దుకాణాన్ని నడిపిస్తున్నారు. పదవీ విరమణ పొందిన వారు, ఈ టీ దుకాణంపై అభిమానం కలిగినవారు ఇలా చాలామంది ఈ దుకాణాన్ని నడిపిస్తున్నారు! ఆశిష్ బంధోపాధ్యాయ్ అనే పదవీ విరమణ పొందిన ఒక పెద్దాయన.. అశోక్ చక్రవర్తి లేని సమయంలో దుకాణంలో ఉంటారు. పాలు లేకపోయినా, పంచదార లేకపోయినా క్యాష్ కౌంటర్లో డబ్బు తీసి, బజారు నుంచి కొని తెచ్చి పెడతారు. ఆయన కూడా లేనప్పుడు, టీ తాగడానికి వెళ్లిన వారే టీ పెట్టుకుని కప్పుల్లో పోసుకుని, తాగి, వాటిని శుభ్రపరచి, డబ్బులు క్యాష్ కౌంటర్ దగ్గర వేసి వెళ్లిపోవచ్చు. ఇక్కడ కావాల్సినంత సమయం గడపొచ్చు. టీ తాగినవారంతా డబ్బు ఇస్తున్నారా లేదా అనే విషయం తెలియడానికి నిఘా నేత్రాలేమీ ఉండవు. ఇక్కడ రోజుకు సుమారు రెండు వందలకు పైగా టీలు అమ్ముడుపోతుంటాయి. ఈ దుకాణానికి ఎదురుగా ఛత్ర కాళీబాబు శ్మశానవాటిక ఉండటంతో అక్కడికి వచ్చేవారు సైతం ఇక్కడికి టీ తాగడానికి వస్తారు.ఒకవేళ డబ్బు లేకపోయినా ఇక్కడ టీ తాగి వెళ్లొచ్చు. అలా వెళ్లిన వాళ్లు మరోరోజు తాము ఇవ్వాల్సిన డబ్బుల్ని గుర్తుపెట్టుకుని మరీ తెచ్చి క్యాష్ కౌంటర్లో వేస్తారు. పైగా ఈ దుకాణానికి బోర్డ్ కూడా ఉండదు. చాలామంది ఛత్ర ఘాట్ ఎదురుగా ఉన్న టీ షాప్ అని పిలుస్తుంటారు.ఆశిష్ బంధోపాధ్యాయ్తో పాటు సుమారు పదిమంది స్నేహితులు ఒక బృందంగా ఉండి, అశోక్ చక్రవర్తి లేని సమయంలో వీలును బట్టి దుకాణం బాధ్యతలను పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ బ్లాక్ టీ, మసాలా టీ కూడా పెట్టుకోవచ్చు. అందుకు నిమ్మకాయలు, మసాలా పొడులు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే చాయ్లోకి బిస్కట్స్ కూడా లభిస్తాయి. ఇక సాయంత్రం అశోక్ చక్రవర్తి వచ్చి ఆ రోజు కలెక్షన్ను క్యాష్ కౌంటర్లో లెక్క చూసుకుని, మరునాటికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటారు. ఇలా సాగుతున్న దుకాణం స్థానికులకు గొప్ప కాలక్షేప కేంద్రం. ఈ చోటు మానసిక సంతోషానికి గొప్ప ప్రదేశం అంటుంటారు ఆశిష్. ఇక్కడికి చాయ్ తాగడానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎన్నో ఏళ్లుగా వస్తున్నవాళ్లే! ఎవరిని కదిలించినా ఏదో ఒక అనుభూతిని పంచుకుంటారు. ‘నరేశ్చంద్రగారు ఉన్నప్పటి నుంచి వస్తుంటాను’ అని కొందరు; ‘మా నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చేవాళ్లం’ అని ఇంకొందరు చెబుతుంటారు. కాని, ఈ రోజుల్లో కూడా ఒక వ్యాపార కేంద్రం ఎటువంటి నిఘా నేత్రాలు లేకుండా, ఏ ఒక్క సహాయకుడు లేకుండా కస్టమర్లతో కళకళలాడేలా నడిపించడం అబ్బురమే! -
Lok Sabha Election 2024: మాజీ మామా అల్లుళ్ల సవాల్
శ్రీరాంపూర్లో పర్సనల్ ఫైట్ సిట్టింగ్ ఎంపీ బెనర్జీపై మాజీ అల్లుడు కబీర్ పోటీ గట్టి పోటీ ఇస్తున్న సీపీఎం యువ అభ్యర్థి దీప్సిత పశి్చమబెంగాల్లోని శ్రీరాంపూర్ లోక్సభ స్థానంలో ఎన్నికలు మాజీ మామా అల్లుళ్ల మధ్య పోరుగా మారాయి. టీఎంసీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై ఆయన మాజీ అల్లుడు కబీర్ శంకర్ బోస్ను బీజేపీ బరిలోకి దింపింది. మూడుసార్లు నెగ్గిన కళ్యాణ్ పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉంటే ఇక్కడ ఎలాగైనా ఖాతా తెరవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. శ్రీరాంపూర్ ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా, కమ్యూనిస్టుల కంచుకోటగా విలసిల్లింది. అక్కడ కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ ఎర్రజెండా ఎగరేసేందుకు యువ నాయకురాలు దీప్సితా ధర్ను సీపీఎం రంగంలోకి దింపింది... హుగ్లీ నది.. శ్రీరాంపూర్ సంక్లిష్టమైన చరిత్రకు సాక్షి. ఇదే ఇక్కడి ఒండ్రుమట్టిని అన్నం గిన్నెగా మార్చింది. జనపనార, పత్తి, కాగితం పరిశ్రమల ఏర్పాటుతో స్థిరమైన పారిశ్రామికీకరణ జరిగింది. కానీ ఇప్పుడు హింద్ మోటార్స్ మూతబడింది. పత్తి మిల్లులు చరిత్ర పుటల్లోనే మిగిలాయి. జూట్, పేపర్ మిల్లులు లాక్డౌన్లను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు వ్యవసాయ, పారిశ్రామిక శక్తిగా వేలాది మంది వలసదారులకు ఉపాధి కలి్పంచిన ఈ నేల నుంచి ఇప్పుడు వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన 17 లోక్సభ ఎన్నికల్లో సీపీఎం ఏడుసార్లు, టీఎంసీ, కాంగ్రెస్ నాలుగేసి సార్లు, సీపీఐ రెండుసార్లు చొప్పున శ్రీరాంపూర్ను గెలుచుకున్నాయి. దేశంలో బీజేపీ ఎన్నడూ గెలవని లోక్సభ స్థానాల్లో ఇదీ ఒకటి.బెనర్జీది దిగజారుడుతనం: బోస్.. కేవలం ఎన్నికల విజయం కోసం వ్యక్తిగత విషయాలను వక్రీకరించి ప్రజల ముందు పెట్టే స్థాయికి బెనర్జీ దిగజారిపోయారంటూ కబీర్ దుయ్యబడుతున్నారు. ఆయన సానుభూతి డ్రామా ఫలించదని, ప్రజలకు అంతా తెలుసని చెప్పుకొచ్చారు. ‘‘కేవలం బెనర్జీ వల్లే ఆయన కూతురితో నా వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది. తను మళ్లీ పెళ్లి కూడా చేసుకుంది. అలాంటప్పుడు కూతురి గత జీవితాన్నే ఇలా ప్రచారానికి వాడుకోవడం చౌకబారుతనం’’ అంటూ మండిపడ్డారు. మాజీ మామకు గట్టి పోటీ ఇచ్చి తీరతానని కబీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘‘బెంగాల్లో పరిస్థితి మారింది. మమత ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పురోగతి, అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. సామాన్యులంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బెనర్జీ లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో నా చేతిలో ఓడటం ఖాయం. బీజేపీకి బెంగాల్లో 35 లోక్సభ స్థానాలకు పైగా వస్తాయి’’ అని బోస్ జోస్యం చెబుతున్నారు.తక్షణావసరం ‘భారత్ బచావో’ సీపీఎం అభ్యర్థి దీప్సితా ధర్ జేఎన్యూ విద్యారి్థ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా, మోటివేషనల్ స్పీకర్గా, రెడ్ వాలంటీర్గా బాగా పేరు సంపాదించారామె. సీఏఏ, ఎన్ఆర్సీ పేరుతో ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బెంగాల్లో ఫలించబోవని అంటున్నారు. ‘‘3 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ మాటలు బూటకమని తేలిపోయింది. ప్రజలు అన్నివిధాలా మోసపోయారు. పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రత, యువతకు ఉద్యోగావకాశాలు, అవినీతిరహిత అభివృద్ధి సీపీఎంతోనే సాధ్యం’’ అంటూ దీప్సిత చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. ప్రజల విచక్షణపై నమ్మకముంది: బెనర్జీ న్యాయశాస్త్ర పట్టభద్రుడైన కళ్యాణ్ బెనర్జీ సీఎం మమతకు నమ్మకస్తుడు. 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత శ్రీరాంపూర్ నుంచి మూడుసార్లు ఎంపీ అయ్యారు. తన కూతురిని వేధించి చివరికి విడాకులు తీసుకున్న వ్యక్తికి టికెటివ్వడం బీజేపీ కుత్సిత మనస్తత్వానికి నిదర్శనమని బెనర్జీ మండిపడ్డారు. బోస్కు తన మాజీ అల్లునిగా తప్ప మరో గుర్తింపే లేదంటూ ఎద్దేవా చేశారు. ‘‘నేను మాట నిలుపుకునే వ్యక్తినని నియోజకవర్గ ప్రజలకు తెలుసు. వాళ్లు ఈసారీ నన్నే గెలిపిస్తారు. శ్రీరాంపూర్ నుంచి అత్యధికసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు నాకు కట్టబెడతారు’’ అని అన్నారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'సింహాసనం' కోసం 'డిస్కో డాన్సర్' గా మారిన 'గ్యాంగ్ లీడర్'
ఎక్కడైనా ఎన్నికల సభలో 'ఐయామ్ ఎ డిస్కో డాన్సర్' 'ఊ లలా ఊ లలా' అంటూ కిక్కెక్కించే పాటలు వినిపించాయనుకొండి. దూరం నుంచే ఒకాయన మెడలో బంగారం హారాలు తళుక్కుమంటున్నాయనుకొండి. సందేహం లేదు. అది మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లాహిరీయే! బిజెపి అభ్యర్థిగా శ్రీరామ్ పూర్ నుంచి లోకసభ ఎన్నికల బరిలో ఉన్న బప్పీదా 'నా పాట పంచామృతం' అంటూ ఎన్నికల సభలను సంగీత సభలుగా మార్చేస్తున్నారు. అంతే కాదు ... నా మ్యూజిక్ కి, నరేంద్ర మోడీ మ్యాజిక్ కలిస్తే ఇక గెలుపు నాదే అంటున్నారు. మరీ మూడొస్తే నాలుగైదు స్టెప్పులు కూడా వేస్తున్నారు. బప్పీదా భలే డిప్లోమాటిక్. ఆయనప్రత్యర్థులను అస్సలు విమర్శించడం లేదు. నా పాటతో కమలం విచ్చుకునేలాచేస్తానని మాత్రమే చెబుతున్నాడు. అన్నట్టు బప్పీ లాహిరీ తెలుగులోనూ సింహాసనం, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇప్పుడీ గ్యాంగ్ లీడర్ సింహాసనం కోసం డిస్కో డాన్సర్ గా మారిపోయారు. -
పశ్చిమబెంగాల్లో ర్యాగింగ్.. నలుగురి అరెస్టు
పశ్చిమబెంగాల్లో విద్యార్థిని ర్యాగింగ్ వల్ల మరణించిన సంఘటన బయటపడి, దాంతో తీవ్రమైన అల్లర్లు జరిగినా.. ఇంకా అక్కడ ర్యాగింగ్ సంఘటనలు ఆగలేదు. హుగ్లీ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజిలో ర్యాగింగ్ ఘటన జరగడంతో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. సెరాంపూర్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ కళాశాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థి యూజీసీకి ఫిర్యాదుచేయడంతో వీరు నలుగురిని అరెస్టు చేశారు. తాను కాలేజి హాస్టల్లో సెప్టెంబర్ 1న చేరగా, అప్పటినుంచి ఈ నలుగురు సీనియర్లు మద్యం మత్తులో తనను పదే పదే శారీరకంగా, మానసికంగా వేధించారని రెండో సంవత్సరం విద్యార్థి ఫిర్యాదు చేశాడు. దాంతో అతడు హాస్టల్ నుంచి పారిపోయి, యూజీసీకి ఫిర్యాదు చేశాడు. అనంతరం విచారణ జరిపి, నలుగురు సీనియర్లు తప్పు చేసినట్లు తేల్చి పోలీసులకు తెలిపారు. పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.