breaking news
sarita nair
-
'నా కంపెనీ ఎదుగుదల, పతనానికి సీఎం కారణం'
కోచి: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై సోలార్ స్కాం నిందితురాలు సరితా నాయర్ ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తోంది. కోచిలో జ్యుడిషియల్ కమిషన్ ఎదుట మరోసారి హాజరైన సరిత.. ఉమెన్ చాందీపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన కంపెనీ ఎదుగుదలకు, పతనానికి ముఖ్యమంత్రే కారణమని చెప్పింది. సరిత వ్యాపార భాగస్వామి, సహ నిందితుడు బిజూ రాధాకృష్ణన్ కూడా ఇవే ఆరోపణలు చేశాడు. సరిత ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ.. ఉమెన్ చాందీకి తాను లంచం ఇచ్చానని మరోసారి చెప్పింది. 'ముఖ్యమంత్రి చాందీకి 1.9 కోట్ల రూపాయల చెక్లను ఇచ్చాను. నేను ఇచ్చింది సీఎం సహాయక నిధికి కాదు. ఇది లంచంగా ఇచ్చింది' అని వెల్లడించింది. సోలార్ స్కాం కేసును విచారిస్తున్న రిటైర్డ్ జడ్జి ఎదుట తాను ఇదే విషయం చెప్పినట్టు ఇటీవల పేర్కొంది. రిటైర్డ్ జడ్జి ఎదుట సీఎం ఊమెన్ చాందీ కూడా హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 11 గంటల పాటు చాందీ తన వాదన వినిపించారు. సోలార్ స్కాంలో 2013లో అరెస్టయిన సరిత.. బెయిల్ మీద విడుదలైనప్పటి నుంచి సీఎం మీద ఆరోపణలు గుప్పిస్తోంది. ఉమెన్ చాందీకి రూ. 2 కోట్ల లంచం ఇచ్చానని సరిత ఆరోపించడం కేరళ రాజకీయాలను కుదిపేసింది. -
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మహిళా సునామీ!
సాక్షాత్తు ముఖ్యమంత్రికి రూ. 2 కోట్ల లంచం ఇచ్చానని చెప్పడానికి ఎన్నో గట్స్ కావాలి. అలాంటిది ఓ మహిళ ఎంతో సాహసం చేసి.. కేరళ ముఖ్యమంత్రి మీద ఆరోపణల సునామీ గుప్పించింది. చివరకు దాదాపు ముఖ్యమంత్రి మీద కేసు నమోదయ్యేంత పరిస్థితి ఏర్పడింది. అయితే చివరి నిమిషంలో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్ దాఖలు మీద రెండు నెలల స్టే విధించడంతో ఊమెన్ చాందీ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మహిళ పేరు సరితా నాయర్. సోలార్ స్కాం నిందితులలో ఒకరు. 2013లోనే ఆమె ఈ కేసులో అరెస్టయినా.. మళ్లీ బెయిల్ మీద విడుదలై, అప్పటి నుంచి సీఎం మీద ఆరోపణలు గుప్పిస్తోంది. అసలే త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇదంతా సీఎం తలకు భారంగా చుట్టుకుంటోంది. రాబోయే పదేళ్లలో కేరళను సంపూర్ణ మద్యరహిత రాష్ట్రంగా చేయాలనుకున్న తమ ప్రభుత్వ నిర్ణయం కారణంగా బార్ యజమానులు ఆగ్రహించి, సరితా నాయర్ను తమమీద ప్రయోగించారని సీఎం చాందీ ఆరోపిస్తున్నారు. కాగా, పారిశ్రామిక వేత్తలకు చవగ్గా సోలార్ ప్యానళ్లు సరఫరా చేస్తామని సరితా నాయర్ చెప్పింది గానీ, ఆమె అసలు సరఫరా చేయలేదని మంత్రులు ఆరోపిస్తున్నారు. కానీ ఆమె మాత్రం సోలార్ స్కాం కేసును విచారిస్తున్న రిటైర్డ్ జడ్జి ఎదుట కూడా తాను సీఎంకు రూ. 1.90 కోట్ల లంచం ఇచ్చినట్లు చెప్పేశారు. కాగా, గత సోమవారం నాడు రిటైర్డ్ జడ్జి ఎదుట సీఎం ఊమెన్ చాందీ దాదాపు 11 గంటల పాటు తన వాదన వినిపించారు. అవతలి వాళ్లు ఆయనను క్రాస్ ఎగ్జామిన్ కూడా చేశారు. అయితే ఇప్పటివరకు కేరళలో ఒక ముఖ్యమంత్రిని జ్యుడీషియల్ కమిషన్ విచారించడం మాత్రం ఇదే మొదటిసారి. దీనికి తోడు కేరళ కాంగ్రెస్ నాయకుడు ఒకరు సరితా నాయర్తో మాట్లాడుతున్నట్లుగా చెబుతున్న ఆడియో టేప్ లీకవ్వడం కూడా సర్కారు కష్టాలకు మరింత ఆజ్యం పోసింది.