breaking news
Sara Mafia
-
కొల్లేరులో సారా తయారీ గుట్టు రట్టు
కైకలూరు: సారా తయారీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సులో కిక్కిస పొదల మాటున సాగుతున్న సారా తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, పలువురు పోలీసులు బుధవారం పడవలపై వెళ్లి ఆ స్థావరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా కొల్లేరు కిక్కిస పొదలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. కైకలూరు రూరల్ ఎస్ఐ చల్లా కృష్ణ పందిరిపల్లిగూడెం పరిధిలో కొల్లేరు సరస్సు మధ్యలో సారా తయారీ కేంద్రాన్ని మంగళవారం గుర్తించి దాడి చేశారని చెప్పారు. అక్కడ వెయ్యి లీగర్ల సారా, సారా తయారీకి ఉపయోగించే 50 వేల లీటర్ల బెల్లపు ఊటను స్వా«దీనం చేసుకుని పందిరిపల్లిగూడెంకు చెందిన భలే సుబ్బరాజు (40), ఘంటసాల రాంబాబు (35), భలే కోటశివాజీ(35), ఆకివీడుకు చెందిన పన్నాస కృష్ణ (35) అనే వారిని అరెస్ట్ చేశారని వివరించారు. నిందితుల నుంచి సారా తయారీకి ఉపయోగించే రూ.6.80 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. -
సారా వ్యాపారుల బీభత్సం: కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి
పాట్నా: సారా తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో పెద్ద ఎత్తున పోలీసులు ఆ గ్రామంలో దాడులు చేశారు. అయితే పోలీసుల సమాచారం తెలుసుకున్న ఆ గ్రామస్తులు వారిని అడ్డగించారు. మూకుమ్మడిగా దాడి చేసి పోలీసులను చితకబాదారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు. ప్రాణభయంతో ఆ గ్రామం నుంచి బయట పడ్డారు. ఈ సంఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. మద్యపానం నిషేధించడంతో ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కల్తీ మద్యం తాగి కొందరు మృతి చెందారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. ఈ క్రమంలోనే జహనాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో సారా స్థావరాలు ఉన్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు శనివారం గ్రామానికి వెళ్లారు. ఈ సమాచారం ముందే తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులు రాగానే వారిని అడ్డగించారు. రోడ్లను బంద్ చేసి వారిపై ప్రతిదాడికి దిగారు. కర్రలు.. రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. కనిపించిన పోలీస్ను చితకబాదారు. దీంతో పోలీసులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఒక మహిళా కానిస్టేబుల్ మృతి చెందారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దాడి చేసిన వారిలో నలుగురైదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి అశోక్ పాండే తెలిపారు. కొన్ని పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
సారా మాఫియాకు అడ్డాగా రాజమండ్రి
రాజమండ్రి క్రైం : రాజమండ్రి సారా మాఫియాకు అడ్డాగా ఉందని, పుష్కరాల నాటికి ఈ ప్రాంతంలో సారాను నిర్మూలిస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్ ఇ.దామోదర్ అన్నారు. రాజమండ్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను రోజూ 13 జిల్లాల వార్తలూ చదువుతానని, ఎక్కువగా రాజమండ్రిలో సారా వ్యాపారం గురించే వార్తలు వస్తున్నాయని, ఎక్కడాలేనంతగా ఈ నగరంలో భారీగా సారా వ్యాపారం జరుగుతోందని అంచనాకు వచ్చామని పేర్కొన్నారు. రాజమండ్రిపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఇక్కడ మాఫియా ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. నిత్యం దాడులు చేసి కేసులు పెడుతున్నా.. దీనిని అరికట్టలేకపోతున్నామని, అదుపులోకి తీసుకున్నవారిపై సక్రమంగా కేసులు పెట్టకపోవడమే దీనికి కారణమని, ఇందులో తమశాఖాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని పేర్కొన్నారు. తమ సిబ్బంది మామూళ్లకు కక్కుర్తిపడి బడా తయారీదారులను వదిలేస్తున్నట్టు కూడా తమ వద్ద సమాచారం ఉందన్నారు. 500 మందితో 20 బృందాలు ఈ నెల 3న జిల్లాకు వచ్చిన తాను మూడు రోజుల పాటు పర్యవేక్షించి.. ఈ ప్రాంతంలో సారా ఎక్కడ నుంచి వస్తుంది... ఏ విధానంలో అమ్మకందారులకు చేరుతోందన్న అంశాలను పరిశీలించినట్టు చెప్పారు. దీనికోసం అంకితభావంతో పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆదివారం తెల్లవారు జామున రాజమండ్రి ఎక్సైజ్ డివిజన్ పరిధిలో దాడులు చేశామని, దీని కోసం పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ జిల్లాల ఎక్సైజ్ సిబ్బందిని రప్పించామని పేర్కొన్నారు. అలాగే పోలీసు, ఇంటిలిజెన్స్ సహకారం కూడా తీసుకున్నట్టు వివరించారు. మొత్తం 500 మందితో 25 మంది చొప్పు 20 బృందాలుగా విడిపోయి డివిజన్ పరిధిలోని 25 ప్రధాన ప్రాంతాల్లో దాడులు చేసినట్టు వెల్లడించారు. 30 మందిని అరెస్టు చేసి, 9 వాహనాలు, 552 లీటర్ల నాటు సారా, 70 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నామని, 5,500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని తెలిపారు. 40 మంది పరారీలో ఉన్నారని చెప్పారు. ఇందుకు తమ సిబ్బందే కారణమని, తాము దాడులకు వస్తున్నట్టు తమ సిబ్బంది మాఫియా లీడర్లకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, వారి ఫోన్ నంబర్ల డేటా ఆధారంగా సిబ్బందిపై చర్యలుంటాయని హెచ్చరించారు. రాజమండ్రిలో గతంలో సారా మాఫియా కోటిలింగాలపేటలో ఇద్దరు కానిస్టేబుళ్లను చంపిన కేసు నీరు గారిపోవడానికి, అలాగే ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్పై ఒక మహిళ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టేందుకు కూడా తమ శాఖలోని సిబ్బందే సహకరించారని గుర్తుచేశారు. పుష్కరమ్ స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్ పుష్కరాల నాటికి సారాను సమూలంగా నిర్మూలించేందుకు ‘పుష్కరమ్ స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్’ను సిద్ధం చేస్తున్నట్టు దామోదర్ తెలిపారు. ఈ గ్రూప్లో ఎవరు ఉండాలనే విషయంపై జాబితా తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. సారా నిర్మూలించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించినట్టు వివరించారు. చైన్ లింక్డ్ కేసులు సారా కేసుల నమోదులో ఇకపై భిన్నంగా వ్యవహరించనున్నట్టు వివరించారు. గ్రామాల్లో విక్రయదారులు, వారికి రవాణా చేసేవారు, తయారీదారులు, ముడిసరకు విక్రయించే వారందరిపైనా లింక్ కేసులు నమోదు చేస్తామన్నారు. కేసుల నమోదులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. కేసులు ఎలా పెట్టాలో తమ సిబ్బందికి హైదరాబాద్లో రెండు వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇక సారా మహమ్మారి గురించి అవగాహన కల్పించడంతోపాటు రిహాబిటేషన్ ప్యాకేజీలు ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇదంతా కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. అనంతరం తనకు సహకరించిన జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, లా అండ్ ఆర్డర్ మధ్య మండల డీఎస్పీ జె. కులశేఖర్ను అభినందించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.అనిల్కుమార్రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.