breaking news
samudrala Satopadha charyulu
-
ఉత్తముల స్వభావం మహోన్నతం
స్వార్థచింతన లేని స్వభావం కలవారే ఉత్తములు. వారు లోకహితాన్నీ, సర్వప్రాణి క్షేమాన్నీ కోరుకుం టారు. శ్రీరామచంద్రుని స్వభావమే ఇం దుకు తార్కాణం. శ్రీరామచంద్రుడు రావణుని వధించిన తర్వాత పుష్పక విమానంలో సపరివారంగా అయోధ్యకు తిరిగి వస్తూ భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్లి నమస్కరించాడు. భరద్వాజ మహర్షి శ్రీరామచంద్రునితో- నీ అరణ్యవాస వృత్తాంతాన్ని, సీతాన్వేషణ, రావణవధ వంటి ఘనకార్యాలను తెలుసుకున్నాను. నేను నీకు సంతోషంతో ఒక వరాన్ని ఇస్తానని చెప్పాడు. శ్రీరామచంద్రస్వామి తన కోసం ఏమీ కోరుకోలేదు. కాని మహర్షి మాటను తిరస్కరించకూడదు కాబట్టి ఒక వరాన్ని అడిగాడు. ఓ మహర్షీ! రుతునియమం లేకుండా అన్ని కాలాల్లో చెట్లు మధుర రసభరితములైన, అమృతతుల్యమైన పళ్లు ఇచ్చే వరమివ్వమని కోరాడు. ‘‘అకాలే ఫలినో వృక్షాః సర్వేచాపి మధుస్రవాః ఫలాన్యమృతకల్పాని బహూని వివిధాని చ! భవంతు మార్గే భగవన్నయోధ్యాం ప్రతిగచ్ఛతః’’ (రా.యు.స.128- శ్లో.18, 19) ఈ చెట్లు అన్ని కాలాల్లో ఫలాలనిస్తే పక్షులకు, వానరులకు, అనేకమంది బాటసారులకు మేలు కలుగుతుందని భావించాడు. తనకు లభించిన దానిని ఇతరులకు దానం చేసిన ఉత్తముడు రంతిదేవుడు. తనకు, తన కుటుంబానికి అవసరమని మర్నాడు కొరకు అతను ధనాన్ని, ఆహారాన్ని దాచుకునేవాడు కాదు. ఒకనాడు రంతిదేవుడు కుటుంబ సభ్యులతో కలిసి పాయసాన్ని, నీటినీ స్వీకరించేందుకు సిద్ధపడుతుండగా, ఇంతలోనే అతిథిగా వచ్చిన ఒక బ్రాహ్మణునికి కొంత పాయసాన్ని వడ్డించాడు. సరిగ్గా అదే సమయంలో తన వద్దకు వచ్చిన మరొక బాటసారికి మరికొంత పాయసాన్ని ఇచ్చాడు. మిగిలిన పాయసాన్ని తన దగ్గరి కుక్కలకు ఆహారంగా ఇవ్వమని వేరొకడు యాచింపగా, రంతిదేవుడు కుక్కలకు పాయసాన్ని ఇచ్చేశాడు. నీటితో కుటుంబ సభ్యుల కడుపునింపి, తాను నీటిని తాగబోతుండగా- దాహంతో తపించే ఒక వ్యక్తి నీళ్లివ్వమని ఆర్తితో కేకపెట్టాడు. అతని కేకకు రంతిదేవుని మనసు కలచివేసింది. మిగిలిన నీటినంతా అతనికిచ్చేసిన వెంటనే ఈ విధంగా ప్రార్థించాడు. ‘న కామయే హం గతిమీశ్వరాణాం అష్టర్ధియుక్తామపునర్భవం చ’ ఆర్తిం ప్రపద్యే ఖిల దేహభాజామంతస్థ్సితో యేన భవంత్యదుఃఖాః ‘‘యోగ సిద్ధులు కల బ్రహ్మపదవి నాకు అక్కర్లేదు. పునర్జన్మ లేని విధంగా మోక్షం కలగాలని కోరను. ఆకలితో దప్పికతో అలమటించిపోతున్న వారందరి బాధలు తొలగాలని, ఆ బాధలను వారి బదులు తాను అనుభవించునట్లుగా అనుగ్రహించవలెనని ప్రార్థనాపూర్వకంగా పలికాడు. ఇది రంతిదేవుని నోటి నుంచి వెలువడిన వాక్కు. ఆయన హృదయం నుంచి పొంగుకొచ్చిన అమృత వాగ్ధార ఇది. ఇతరులు దుఃఖపడవద్దు, హాయిగా ఉండాలి. ఎదుటి వారి దుఃఖాలను వారి బదులు తాను అనుభవించాలి అని తలపోయడం మచ్చుతునక. ఈ మహత్తర భావన మానవులై జన్మించిన వారందరి హృదయాలకు చేరువ కావాలి. ఆదర్శప్రాయమైన ‘ఉత్తముల స్వభావం’ ప్రజలందరికీ అలవడాలి. ఆచరణలోకీ రావాలి. - సముద్రాల శఠగోపాచార్యులు -
మాట మంచిదైతే...
మనిషి వికాసానికి ‘మాట’ ఒక అమూల్యమైన వరం. ఇతర ప్రాణులకు లేని గొప్ప వాక్ సంపద మనిషికి స్వంతమైంది. ధనధాన్యాది సంపదలైనా వాడుతూ ఉంటే అవి క్రమంగా తరిగిపోతూ ఉంటాయి. కాని ఈ మాట అనే సంపద తరిగేది కాదు. పైగా మనం తీయగా, ఆకర్షణీయంగా, మనోహరంగా ఉం డే మాటలనే మాట్లాడగలిగితే బండరాయి వంటి కఠిన హృదయాలను కూడా కదిలించవచ్చు, కరిగించవచ్చు. ‘మంచి నోరు’ అంటే మంచి మాటను పలికే నోటినే మంచి నోరంటారని దీని అంతరార్థం. అప్పుడు మనం నివసించే ఊరు వారంతా మన విషయంలో మంచివారవుతారు. మనకు మంచే చేస్తారు. మనలోని మంచినే చూస్తారు. మంచి మాట అంటే కేవలం అందరికీ నచ్చినట్లు మాట్లాడటం అర్థం కాదు. అందులో ఇతరులందరికీ మం చిని కలిగించే మాటలు కూడా ఉండాలి. మంచి మాటలను మాట్లాడే వారితో సహవాసం చేయాలి. ఆ మంచి మాటలను వినాలి, వారికి మంచి మాటలను వినిపించాలి. మంచి మాటలకు లొంగని వారు అంటూ ఉండరు. మొరటుగా, కఠినంగా చెప్పవలసిన విషయాన్ని కూడా సున్నితంగా చెప్పేవారు అధికారుల, రాజుల మన్ననలను అందుకుంటారు. హనుమంతుని మాట మంచిదైనందునే రామసుగ్రీవులకు మైత్రి ఏర్పడింది. రాక్షస పరాజయం, రావణవధ, సీతాపరిగ్రహణం వంటి మహాఘనకార్యాలు నెరవేరాయి. హనుమంతుని మంచి మాటకారితనాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రశంసిస్తూ - ‘‘బహు వ్యాహరతానేన న కించిదపశబ్దితమ్’’ ‘‘ఉచ్చారయతి కల్యాణీం వాచం హృదయహారిణీమ్’’ ‘‘కస్య నారాధ్యతే చిత్త ముద్యతాసేరరేరపి’’ ఒక్క తప్పు లేకుండా, చెవులకింపుగా, మనోహరంగా, శుభప్రదంగా మాట్లాడుతున్నాడు. చంపుదామని కత్తి పట్టుకొని వచ్చినవ్యక్తి మనసును కూడా హనుమంతుని మాటలు వశపరచుకుంటాయని పేర్కొన్నాడు. అందుకే మన ‘మాట మంచిదైతే’ మనకంతటా మంచే జరుగుతుంది అనే విశ్వాసాన్ని ఏర్పరచుకోవాలి. పూర్వం ప్రతిభావంతులైన దేవదత్తుడు, సిద్ధార్థుడు ఇద్దరు రాజకుమారులలో సిద్ధార్థుని మాట మృదువుగా, దేవదత్తుని మాట కఠినంగా ఉండేదట. ఒకనాడు దేవదత్తుడు, సిద్ధార్థుడు అడవికి వెళ్లారు. దేవదత్తునికి వేట అం టే ఇష్టం. దేవదత్తుడు వేసిన బాణానికి హంస గాయపడి నేలకొరిగింది. సిద్ధార్థుడు ఆ హంసకు గుచ్చుకున్న బాణా న్ని తీసి గాయానికి కట్టుగట్టి సపర్యలు చేయసాగాడు. దేవదత్తుడు సిద్ధార్థుడితో - ‘హంసను వేటాడింది నేను కదా, దానిని నాకిచ్చెయ్’ అని గద్దించాడు. ‘కాదు గాయం మాన్పి, హంసను రక్షించింది నేను కదా, నా దగ్గరే ఈ హంస ఉంటుందని’ సిద్ధార్థుడు బదులిచ్చాడు. ఇద్దరి మధ్య వివా దం పెరిగి న్యాయం కోసం ధర్మాధికారులను ఆశ్రయిం చారు. ధర్మాధికారి ఆ హంసను బల్లపై ఉంచండి, ఎవరి పిలుపునకు ఆ హంస దగ్గరైతే వారికిస్తాను అని చెప్పారు. కఠిన స్వభావి, పరుష భాషియైన దేవదత్తుడు ‘ఓ హంసా! రా, రా, వస్తావా లేదా, రాకపోతే నీ పని చెప్తా, నా బాణం దెబ్బ మరిచావా’ అంటూ పిలిచాడు. మృదుస్వభావియైన సిద్ధార్థుడు - ‘తల్లీ, కల్పవల్లీ, పాలవెల్లీ, రావే’ అంటూ ప్రేమగా ముద్దుగా పిలిచాడు. హంస సిద్ధార్థుని ఒడిలోకి చెంగున వచ్చి చేరింది. వెంటనే సిద్ధార్థునికే ఈ హంస చెందాలి అని ధర్మాధికారి నిర్ధారించారు. మంచి మాటతో ఒక పక్షియే ఆకర్షింపబడింది కదా. అలాగే మాట మంచిదైతే తోటి మానవులందరూ మనకు హితులవుతారు, సన్నిహితులవుతారు అనే వాస్తవాన్ని గుర్తిం చాల్సిన అవసరం ఎంతో ఉంది. సముద్రాల శఠగోపాచార్యులు