breaking news
Sadimubarak scheme
-
కల్యాణ లక్ష్మితో సామాజిక మార్పు
ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో బాల్య వివాహాలు తగ్గి సామాజిక మార్పునకు దోహద పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలుపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఆడపిల్లల వివాహానికి కూడా ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పథకం అమలుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.738 కోట్లు కేటాయించామన్నారు. పేదింటి ఆడపిల్లలందరికీ పథకం వర్తించేలా అవసరమైతే మరిన్ని నిధులు సమకూరుస్తామన్నారు. వివాహానికి ముందే లబ్ధిదారులకు చెక్కు అందేలా పారదర్శకంగా పథకం అమలు చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న ఈ పథకం లక్ష కుటుంబాల్లో వెలుగులు నింపి రికార్డు సృష్టించిందన్నారు. 2014 సెప్టెంబర్ 24న పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 1,04,057 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఇందులో ఎస్సీలు 44,351, ఎస్టీలు 25,793, మైనార్టీలు 33,913 మందికి రూ.51వేల చొప్పున ఆర్థిక సాయం అందిందన్నారు. పథకం అమలుకు ఇప్పటి వరకు రూ.530 కోట్లు ఖర్చు చేశామన్నారు. సీఎం ప్రత్యేక సీఎం కార్యదర్శి కె.భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘షాదీముబారక్’ అక్రమాలకు కేరాఫ్
► గతంలో పెళ్లయిన వారి పేరుతో కూడా.. ► బోగస్ పత్రాలతో ఆర్థిక సహాయం స్వాహా ► పథకం అమలులో దళారుల దందా ► పక్కదారి పడుతున్న నిరుపేదలపథకం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నిరుపేద మైనార్టీ కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీముబారక్ పథకం పక్కదారి పడుతోంది. కొత్తగా పెళ్లి చేసుకున్న నూతన వధువులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని అక్రమార్కులు కాజేస్తున్నారు. పెళ్లి జరిగి ఏళ్లు గడిచినా వారి పేర్లను, ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న వారిని లబ్ధిదారులుగా చూపి ఈ పథకం కింద వచ్చే ఆర్థిక సహాయాన్ని కలిసి పంచుకుంటున్నారు. ఈ పథకం మంజూరు చేయించేందుకు కొందరు నేతలు దళారుల అవతారమెత్తారు. దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ముఖ్యంగా మారుమూల మండలాల్లో ఈ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. షాదీముబారక్ పథకం కింద నూతనంగా పెళ్లి చేసుకున్న వధువులకు ప్రభుత్వం రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. నేరుగా ఆ వధువు బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తుంది. ఈ పథకం ఇప్పుడు దళారులకు వరంగా మారింది. ఈ దందాకు కొందరు అధికారులు కూడా సహకరించడంతో అక్రమాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పంచుకుంటున్నారు.. ఈ దందాలో ఆరితేరిన దళారులు లబ్ధిదారులతో ముందే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వచ్చే ఆర్థిక సహాయంలో సగం చెల్లిస్తే చాలు అన్నీ వారే చూసుకుంటున్నారు. బోగస్ ధ్రువీకరణ పత్రాలను తయారు చేయడంతోపాటు, వారి పేరుతో బ్యాంకు ఖాతాను కూడా తెరుస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందాలంటే మొదట గ్రామ వీఆర్వో ద్వారా ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, పెళ్లి కార్డు, సంతకాలు చేయించిన దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిపై ఆర్ఐ, తహసీల్దార్లు విచారణ చేపట్టి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖకు ఆన్లైన్లో పంపుతారు. ధ్రువీకరణ పత్రాలు సరిచూసుకొని లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తారు. జిల్లాలో ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 3,449 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 3,209 దరఖాస్తులను రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. వీటిలో 2,966 లబ్ధిదారులకు రూ.51 వేల చొప్పున సుమారు రూ.15.12 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా 240 దరఖాస్తులు రెవెన్యూ అధికారుల విచారణలో ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం.. షాదీముబారక్ పథకంలో అక్రమాలు మా దృష్టికి రాలేదు. అలాంటివేమైనా ఉంటే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇటీవలే బదిలీపై జిల్లాకు వచ్చాను. - కేశవరావు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి -
కల్యాణలక్ష్మి, షాదీముబారక్పై నజర్
మొన్న మైనార్టీ, నిన్న ఎస్సీసంక్షేమశాఖలో ఏసీబీ తనిఖీలు పాలమూరు : పేద యువతుల పెళ్లిళ్లకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు జిల్లాలో పక్కదారి పడుతున్నాయన్న సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. పైరవీకారులు, అధికారులు కుమ్మక్కై అనర్హులకు ఈ రెండు పథకాలను వర్తింపజేస్తూ వారినుంచి వాటా తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ప్రభుత్వం ఈ పథకాలను సమర్థంగా అమలుచేసే విషయమై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో గతంలో మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం గురువారం రోజు మైనార్టీ సంక్షేమశాఖలో ఏసీబీ అధికారులు షాదీముబారక్ పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అదే విధంగా శుక్రవారం ఎస్సీ అభివృద్ధిశాఖలో కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన రికార్డులను ఏసీబీ డీఎస్పీ రాందాస్తేజ పరిశీలించారు. ఏసీబీ తనిఖీల నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, అనర్హులకు వణుకు మొదలైంది. ఎస్సీ అభివృద్ధిశా ఖ పరిధిలో.. ఎస్సీ అభివృద్ధిశాఖ పరిధిలో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మొత్తం 6,633 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 5,279 మందికి ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.51వేల చొప్పున మంజూరు చేశారు. 516 దరఖాస్తులు కార్యాలయంలో 364 పరిశీలనలో పెండింగ్లో ఉన్నాయి. 474 రిజెక్టు అయ్యాయి. రిజెక్టు లిస్టులో ఎక్కువగా ముందుగా పెళ్లి చేసుకొని తర్వాత చేసుకున్నట్లుగా తప్పుడు ఆహ్వానపత్రికలు పెట్టి దరఖాస్తు చేసుకున్న వారు, వయస్సు తక్కువగా ఉన్నవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మైనారిటీ సంక్షేమశాఖ.. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న షాదీముబారక్ పథకానికి సంబంధించి ఏప్రిల్ 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,500 మంది మైనార్టీ యువతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 2037 మందికి రూ.51వేల చొప్పున మంజూరు చేశారు. 459 దరఖాస్తులు కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. 4 దరఖాస్తులు రిజెక్టు అయినట్లు అధికారులు వెల్లడించారు. పైరవీకారులదే హవా... కల్యాణలక్ష్మి పథకంలో పైరవీ కారులదే హవా కొనసాగుతుంది. ప్రభుత్వం పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివాహ ఆహ్వాన పత్రికలో ఉన్న తేదీని తాజాగా పథకంలో అమల్లోకి వచ్చిన తేదీ నుంచి కొన్ని నెలల తర్వాతా వివాహం జరిగినట్లు మార్చి దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. లబ్ధిదారుల నుంచి పర్సెంటేజీలకు ఒప్పందం కుదుర్చుకొని పైరవీకారులు కల్యాణలక్ష్మి దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అధికారులు సైతం పైరవీకారులతో డబ్బులు తీసుకొని వాటిని జిల్లా కార్యాలయానికి పంపిస్తున్నారు. వెరిఫికేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువశాతం కల్యాణలక్ష్మి దుర్వినియోగం అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ రంగప్రవేశంతో అధికారుల్లో వణుకు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తుండటంతో అధికారుల్లో వణుకు మొదలైంది. గురువారం మైనార్టీ సంక్షేమశాఖలో, శుక్రవారం ఎస్సీ సంక్షేమశాఖలో ఏసీబీ డీఎస్పీ రాందాస్తేజ రికార్డులను పరిశీలించారు. ఎస్సీ సంక్షేమశాఖలో డీడీ శ్రీనివాసరావు, ఉద్యోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాందాస్తేజ విలేకరులతో మాట్లాడారు. చాలా మంది అక్రమంగా లబ్ధిపొందిన వారిపై ఫోన్ద్వారా సమాచారం వచ్చిందని, పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలించి క్షేత్రస్థాయిలోనూ పరిశీలిస్తామని వెల్లడించారు. దళారులపై కూడా చర్యలుంటాయని తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయని, అక్రమాలు చేసినట్లు గుర్తిస్తే పై అధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని అన్నారు. పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఏసీబీ డీఎస్పీ రాందాస్తేజ వెల్లడించారు. ఎలాంటి అవినీతి ఉన్నా 94913 05609 నంబర్కు తెలియజేయాలని ఆయన కోరారు. ఏప్రిల్-2015 నుంచి వివరాలు కల్యాణలక్ష్మి మొత్తం దరఖాస్తులు 6,633 మంజూరైనవి 5,279 పెండింగ్ 880 రిజెక్ట్ 474 షాదీముబారక్ మొత్తం దరఖాస్తులు 2,500 మంజూరైనవి 2037 పెండింగ్ 459 రిజెక్ట్ 4