breaking news
Sabbir ali
-
వైఎస్సార్ కలల ప్రాజెక్టు ప్రాణహిత–చేవెళ్ల
22వ ప్యాకేజీకి లైన్ క్లియర్ త్వరలోనే జీవో విడుదలవుతుంది శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ కామారెడ్డి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన ప్రాణహిత–చేవెళ్ల పథకంలోని 22వ ప్యాకేజీని యథావిధిగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ తెలిపారు. సోమవారం కామారెడ్డిలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి దివంగత సీఎం వైఎస్ ప్రాణహిత –చేవెళ్ల పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఈ పథకంలోని 22వ ప్యాకేజీలో మంచిప్ప నుంచి భూంపల్లి ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో 22వ ప్యాకేజీని నిలిపివేసిందని, మల్లన్నసాగర్ నుంచి నీటిని ఇస్తామని చెప్పి సర్వేలు చేయించిందన్నారు. అది సాధ్యం కాకపోవడంతో మిడ్మానేరు నుంచి నీరు ఇస్తామన్నారని, అది కూడా సాధ్యం కాదని తేలిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావులను పలుమార్లు కలిసి 22వ ప్యాకేజీని యథావిధిగా కొనసాగించాలని కోరామని తెలిపారు. భూంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని అందించవచ్చని, భూసేకరణ కూడా చాలా వరకు జరిగిందని సీఎంకు వివరించామన్నారు. ఇదే విషయమై ఇటీవల ఇరిగేషన్ అధికారులు తనతో చర్చించారని, పాత ప్రణాళికతోనే సాధ్యమని తాను వారికి వివరించానని పేర్కొన్నారు. అధికారులు సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు సరైన సూచనలు చేశారని, దీంతో వారు 22వ ప్యాకేజీకే మొగ్గుచూపారని తెలిపారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ ఉన్నతాధికారులు తనకు చెప్పారన్నారు. త్వరలోనే జీవో విడుదలవుతుందన్నారు. ఈ ప్యాకేజీ పనులకు దివంగత సీఎం వైఎస్సార్ కామారెడ్డిలో శంకుస్థాపన చేశారన్నారు. పనులను ప్రారంభిస్తే ఏడాదిన్నరలో ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ప్రాణహిత –చేవెళ్ల పథకంలోని 22వ ప్యాకేజీని తిరిగి చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సీఎం, భారీనీటిపారుదల శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లమడుగు సురేందర్, నల్లవెల్లి అశోక్, కైలాస్ శ్రీనివాస్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
'రిజర్వేషన్ హామీపై వెనక్కు తగ్గడం సరికాదు'
హైదరాబాద్: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం తన తాజా బడ్జెట్ లో ఒక శాతం తగ్గించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ లో మైనార్టీలకు 11 శాతం రిజర్వేషన్ మాత్రమే ప్రవేశపెట్టడాన్నిఆయన ప్రశ్నించారు. తొలుత ఇచ్చిన హామీపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం సరికాదన్నారు. ఈ నెల 23 న టీపీసీసీ మైనార్టీ సెల్ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు షబ్బీర్ తెలిపారు. ఆ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వస్తున్నారన్నారు. ఆ సమావేశంలో ఎంఐఎంను ఎదుర్కొనడానికి అనుసరించాల్సిన వ్యూహాన్నిఖరారు చేసుకుంటామన్నారు. ఈ నెల 11 న మౌలానా ఆజాద్ జయంతిని మైనార్టీ సంక్షేమ దినంగా నిర్వహిస్తున్నామని, ఆ అనవాయితీని టీఆర్ఎస్ సర్కారు కూడా కొనసాగించాలన్నారు.