హైదరాబాద్లో రష్యా దేశస్థుడి మౌనపోరాటం
హైదరాబాద్: భార్య, కొడుకును తన వెంట పంపించి న్యాయం చేయాలంటూ రష్యా దేశస్థుడు హైదరాబాద్లో మౌనపోరాటానికి దిగాడు. వివరాల్లోకి వెళితే...రష్యాకు చెందిన అలెక్స్ ఎర్మకోవ్ 2012లో గోవా పర్యటనకు వచ్చిన సమయంలో హైదరాబాద్ వాసి సనం ఉల్హక్ పరిచయమైంది. ప్రేమలో పడిన వారిద్దరూ బేగంపేట రిజిస్టర్ ఆఫీసులో 2014లో వివాహం చేసుకున్నారు.
ఆల్వాల్లో మూడు నెలలపాటు కాపురం పెట్టిన అనంతరం దంపతులు రష్యాకు వెళ్లిపోయారు. కొద్ది రోజుల కిందట సనం భర్తకు చెప్పకుండా కొడుకుతోపాటు ఇండియాకు తిరిగొచ్చింది. సనం కనిపించకపోవటంతో అలెక్స్ రష్యా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరికి పుట్టింటికి చేరుకుందని తెలియటంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని భార్య వద్దకు వచ్చాడు. అయితే, డబ్బులు ఇస్తేనే కొడుకుతోపాటు రష్యా వస్తానంటూ సనం చెప్పింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అలెక్స్ ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.