breaking news
Rs 3 crores
-
మజ్జిగకు రూ.3 కోట్లు విడుదల
ఒంగోలు : ఎండ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో చలివేంద్రాల ఏర్పాటుకు జిల్లాకు రూ. 3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటి ద్వారా మజ్జిగ, మంచినీళ్లతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచనుంది. ఈ నిధులతో మండలాలవారీగా ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటింగ్ అధికారులకు ఏర్పాటు బాధ్యతలను అప్పగించారు. అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటింగ్ అధికారులు తమ నియోజకవర్గ పరిధిలోని మండల అధికారుల ద్వారా గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించాలని ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వపరంగా, పంచాయతీల పరంగా, స్వచ్ఛంద సంస్థల పరంగా 1063 చలివేంద్రాలు నడుస్తున్నాయి, తొలి విడతగా ముఖ్యమైన ప్రాంతాల్లో 156 తాటాకు పందిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాలతోపాటు ప్రజలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో గుమికూడి ఉంటారో గుర్తించి అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చలివేంద్రాల వద్ద మజ్జిగ ప్యాకెట్లతోపాటు మంచినీళ్లు ఇవ్వనున్నారు. లక్షా 13 వేల 700 ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా చలివేంద్రాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. ఎండ తీవ్రతకు గురైనవారికి వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలిపిన నీటిని తాగించడం ద్వారా కొంతమేర ఉపశమనం పొందుతారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రచారానికే ప్రాధాన్యం ఈ చలివేంద్రాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చలివేంద్రాల వద్ద పెద్దఎత్తున హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని జిల్లా కేంద్రానికి ఆదేశాలు అందాయి. జిల్లాలో 2400 హోర్డింగ్లు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వాటితోపాటు 3 లక్షల 24 వేల 740 కరపత్రాలను ముద్రించి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. -
గుడ్విల్... రూ.3 కోట్లు
ఎక్సైజ్శాఖలో మామూళ్ల వ్యవహారంపై అవినీతి నిరోధకశాఖ కొరడా ఝులిపించిన సమయంలో అన్నీ సంచలనాలే. వ్యాపారులే కాదు.. అధికారులు సైతం కేసుల పాలయ్యారు. అయినా, ఈ భయం కొన్నాళ్లే కనిపించింది. ఈ ఏడాది కొత్తగా ఏర్పా టైన మద్యంషాపులపై అప్పుడే పడిపోతున్నారు. ఆబ్కారీశాఖలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన కొత్త దుకాణాలనుంచి గుడ్విల్ రూపంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు కనీసం రూ.3కోట్లు వసూలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెలనెలా ఇచ్చే మామూళ్లకు తోడు, ‘గుడ్విల్ ’ కింద ఒక్కో షాపునుంచి సగటున రూ.లక్ష డిమాండ్ చేస్తుండడంతో దుకాణదారులు గుడ్లు తేలేస్తున్నారు. జిల్లాలో మొదటివిడతలో 255 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా ఖరారు చేశారు. ఆ తర్వాత మరో 12 షాపులనూ ఓకే చేశారు. మొత్తంగా ఇప్పుడు 267 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. నెలరోజులపాటు ఓపిక పట్టిన ఎక్సైజ్ అధికారులు ఇక, తమ ప్రతాపం మొదలుపెట్టారు. ప్రతిషాపునకు కనీసం రూ.లక్ష గుడ్విల్గా ఇవ్వాలని షరతు పెట్టారు. ప్రతిషాపు నుంచి రూ.లక్ష వ సూలు చేస్తే ఆ మొత్తమే రూ.2.67కోట్లు అవుతోంది. వ్యాపారం ఎక్కువగా సాగే దుకాణాలు, ఒక మండలంలో కేవలం రెండు షాపు లు మాత్రమే ఉంటే వారి బిజినెస్ ఎక్కువగా సాగుతుంది కాబట్టి అలాంటి షాప్కు లక్ష కంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు. అంతా కలిపి గుడ్విల్ కింద రూ.3కోట్ల వసూలుకు స్కెచ్ వేశారని సమాచారం. ఇదీ... లెక్క! ప్రతీ షాప్ కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వ్యాపారులు, డిపార్టుమెంటు మధ్య మంచి సంబంధాలు ఉండాలి కాబట్టి, గుడ్విల్ ఇవ్వాలన్నది ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల కండీషన్.నెల నెలా ప్రతీ దుకాణం నుంచి ఇవ్వాల్సిన మామూలు దీనికి అదనం. షాపు ఉన్న ఏరియా, జరిగే వ్యాపారాన్ని బట్టి రూ.6వేల నుంచి రూ.15వేలు ఒక్కో సర్కిల్ పరిధిలో ఇవ్వాలి. ఇది రమారమి ఒక్కో షాప్కు ఇది ఏటా రూ.1.50లక్షలు అవుతోంది.ఇంతే మొత్తంలో పోలీసులకు ముట్టజెప్పాల్సి ఉంటోంది. అంటే మరో రూ.1.50లక్షలు. వెరసి ఏడాదిలో ఒక దుకాణం నుంచి రూ.3లక్షలు మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. మద్యం వ్యాపారులు విక్రయాల్లో పాటించాల్సిన నిబంధనలను అక్కడక్కడా అమలు చేయరు. దీంతో ఒక షాప్పై కేసు రాస్తే రూ.లక్ష ఫైన్తో పాటు, 15రోజులు దుకాణం బంద్ పెట్టాలి. దీంతో ఇదంతా ఎందుకు, ముందే గుడ్విల్, మామూళ్లు ఇచ్చేసుకుంటే, ఎక్సైజ్ అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తారన్న ఆశ వ్యాపారులది.ుంచి ఆదాయం ఉంటే స్టేషన్లలో పోస్టింగ్ కోసం కొందరు ఎక్సైజ్ సీఐలు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒక్క నల్లగొండ ఎస్హెచ్ఓ కింద ఏకంగా 56 మద్యం దుకాణాలు ఉన్నాయి. అంటే, ఇక్కడ పనిచేసే వారికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది మధ్య పర్సెంటీజీల పంపకాల్లో తేడాలో వచ్చి ఘర్షణ పడినట్లు చెబుతున్నారు. మద్యం దుకాణాల లెసైన్సులను ఖరారు చేసి, ఫైల్క్లియర్ చేసేది తామే కాబట్టి ఎస్సైలకు గుడ్విల్ అమౌంట్ ఎందుకు పంచాలి..? అంతా మాకే కావాలని కొందరు సీఐలు పేచీ పెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా తెలుస్తోందేమంటే, జిల్లా ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు, మరికొందరు ఉద్యోగులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు.