breaking news
Rohit s death
-
సీఎం మద్ధతుతోనే విద్యార్థులపై దాడులు: యాష్కీ
సీఎం కేసీఆర్ మద్దతుతోనే హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్థులపై దాడులు జరిగాయని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. దేశంతోపాటు రాష్ట్రంలో ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. హెచ్సీయూ విద్యార్థి రోహిత్ మరణం వెనుక వీసీ అప్పారావు హస్తంపై విచారణ జరుగుతున్న తరుణంలో వీసీని విధుల్లోకి తీసుకోవడం వెనుకా కేసీఆర్ హస్తం ఉందన్నారు. దళిత విద్యార్థి మరణిస్తే కనీసం సీఎం పరామర్శించలేదని గుర్తు చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో ఇరిగేషన్ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం అదే కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టబెడుతున్నారని ఆరోపించారు. టీజేఏసీని నిర్వీర్యం చేయడం వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే వారిపై ప్రతిదాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు. కేసీఆర్ ఒక్కరే సీడీఎఫ్ రూ.5 వేల కోట్లు దగ్గర పెట్టుకుని కొడుకు, అల్లుడికే నిధులిస్తూ బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చే రాయితీలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. -
'రోహిత్ మృతికి కారకులను శిక్షించాలి'
- లేదంటే దేశవ్యాప్త ఉద్యమం తప్పదు - బ్యాక్ వర్డ్ అండ్ మైనార్టీ కమ్యూనిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హైదరాబాద్ రోహిత్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని బ్యాక్వర్డ్ అండ్ మైనార్టీ కమ్యునిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (బామ్సెఫ్) జాతీయ అధ్యక్షులు వామన్ మిశ్రమ్ హెచ్చరించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ... రోహిత్ ఆత్మహత్య అనంతరం తాను జనవరి 21న ఢిల్లీ నుండి యూనివర్సిటీకి వచ్చి సందర్శించి 24వ తేదీన జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపుఇచ్చినట్లు తెలిపారు. తాను ఇచ్చిన పిలుపుమేర బామ్సెఫ్, అనుబంధ సంస్థలు దేశవ్యాపితంగా 350 జిల్లాల్లో నిరసన ర్యాలీలు, దిష్టిబొమ్మ ధగ్ధం కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. తాము చేపట్టిన నిరసన కార్యక్రమాలతో రోహిత్తో పాటు సస్పెండ్కు గురైన మరో నలుగురు విద్యార్ధులపై సస్పెండ్ను వెనక్కితీసుకున్నారన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ కూడా కేవలం రోహిత్ ఆత్మహత్యకు గల పరిస్థితులను కనుక్కొమ్మని వేసిందే తప్ప ఆత్మహత్య చేసుకోవడానికి వెనక ఉన్న వ్యక్తులను గుర్తించాలని ఎక్కడా చెప్పలేదన్నారు. యూనివర్సిటీ వీసీని దీర్ఘకాలిక సెలవులపై ఉద్దేశపూర్వకంగా పంపారని, ఇన్చార్జ్ విసీ నియామకం కూడా విద్యార్ధులకు ఇష్టలేకుండా నియమించారని, అంతే కాకుండా రోహిత్ తండ్రితో కూడా సమావేశం ఏర్పాటు చేయించారని అన్నారు. దీని వెనక ఎవరో ఉండి ఇవన్ని చేయిస్తున్నారని ఆరోపించారు. వెంటనే రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఫిబ్రవరి మొదటివారంలో దేశవ్యాపితంగా ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తామని, అప్పటికీ స్పందించకపోతే దేశంలోని అన్ని జాతీయ రహదారులను దిగ్భంధం చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే అన్ని సంట్రల్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనార్టీలపై జరిగే దాడులు, అవమానాలపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.