‘రాతి’ భారం భరించలేం!
‘పాలమూరు’లో రాతి ఇసుకకు మరింత ధర కోరుతున్న కాంట్రాక్టర్లు
సాక్షి,హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల్లో రాతి ఇసుక (రాక్శాండ్)కు ప్రభుత్వం నిర్ణయించిన ధరను మరింత పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభు త్వం నిర్ణయించిన ధర తమకేమాత్రం గిట్టుబాటు కాదని వారు తెగేసి చెబుతున్నారు. రాతి ఇసుకను ప్రభుత్వం చెబుతున్న సైజులో తయారు చేయాలంటే భారీ మెషినరీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సహకరిస్తేనే ముందుకు వెళతా మన్నట్టుగా వారు స్పందిస్తున్నారు.
భారీ వ్యయంతో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టులో ఐదు రిజర్వాయర్లు నార్లాపూర్–8.61టీఎంసీ, ఏదుల 6.5, వట్టెం 16.6, కరివెన 19.15, ఉద్దండాపూర్ 9.2టీఎంసీల సామర్థ్యాల తో నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు ఓపెన్ చానల్, టన్నెళ్లు, పంప్హౌస్ల నిర్మాణానికి భారీగా ఇసుక, మట్టి అవసరమవుతాయని అధికారులు గుర్తించా రు. రిజర్వాయర్లలో లీకేజీలు లేకుండా నీటిని తరలించేం దుకు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని లెక్కించారు.
క్యూబిక్ మీటర్కు రూ.400...
అయితే నదుల్లో ఆ స్థాయిలో ఇసుక లభ్యత లేక జాప్యం జరుగుతున్న దృష్ట్యా... మెట్రో పనుల్లో వాడుతున్న మాదిరే రాతి ఇసుకను వాడాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ప్రస్తు తం ప్రాజెక్టులోని 15 ప్యాకేజీల్లో దీన్ని వాడాలని కాంట్రాక్టర్లకు సూచించారు. దీనిపై ఇటీవల కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించగా... ప్రభుత్వం క్యూబిక్ మీటర్ రాతి ఇసుకకు రూ.392 ధర నిర్ణయించిం దని, అయితే చాలా ప్యాకేజీల్లో తాము తక్కువకు టెండర్లు వేశామని వారు తెలిపారు. అయితే ఆ ధరకు రాతి ఇసుకను తెచ్చుకోవడం సాధ్యమయ్యేది కాదని వారంతా చెప్పినట్లుగా తెలిసింది. ఈ ధరను క్యూబిక్ మీటర్కు రూ.400కు పైగా పెంచాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక రాతి ఇసుక తయారీకి సైతం మిషనరీని సమకూర్చుకోవాల్సి ఉంటుందని, ఇది చాలా వ్యయంతో కూడకున్నదైనందున దానికి ప్రభుత్వ సహకారం అందించాలని విన్నవించారు.