వేడుకగా ఉగాది సంబరాలు
శ్రీకాకుళం : మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా, మండలస్థాయిల్లో ఈ నెల 21వ తేదీన ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి వేడుకలను జెడ్పీ సమావేశ మందరంలో, మండల స్థాయిలో మంచి వేదికలను ఎంపిక చేసుకుని అక్కడ తెలుగుదనం ఉట్టిపడేలా, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మండల స్థాయిలో భాష, నృత్య, సంగీత సాహిత్య, కళారంగాలకు చెందిన వారిని సత్కరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రోటోకాల్ పాటించాలన్నారు.
ఉగాది వేడుకల కోసం తహశీల్దార్కు 25 వేల రూపాయ లను కేటాయించినట్టు కలెక్టర్ వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ సివిల్ సప్లైకి సంబంధించి రేషన్షాపుల నిర్వహణపై అధికారులు తరచూ పర్యవేక్షించాలన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఉన్న పురుగుల బియ్యాన్ని విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేయడం తగదన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, వంశధార నిర్వాసితుల సమస్య పరిష్కరానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ వివేక్యాదవ్, జిల్లా పౌరసరఫరాల అధికారి ఆనందరావు, రెవెన్యూ డివిజన్ అధికారి బి.దయానిధి పాల్గొన్నారు.