breaking news
rescuer
-
World Elephant Day 2021: మనిషి దుర్మార్గానికి ఏమని పేరు పెట్టగలం?
ఏనుగమ్మ ఏనుగు... బాల్యం ఏనుగుతో మొదలవుతుంది. తాతలు, నానమ్మలు వీపు మీద పిల్లలను కూచోబెట్టి ఏనుగాట ఆడతారు. ఏనుగును విఘ్నేశ్వరుడిగా పూజించుకుంటాం. కాని ఏనుగుల గురించి పట్టించుకుంటున్నామా? ప్రపంచంలో 40 వేల ఆసియా ఏనుగులు ఉంటే వాటిలో దాదాపు 27 వేలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో మగ ఏనుగుల శాతం దారుణంగా పడిపోయింది. వినోదం కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం వాటిని బంధించి పెట్టే సంస్కృతి ఉంది. అవన్నీ ఏనుగుల స్వేచ్ఛను హరించేవే అంటారు సంగీతా అయ్యర్. ‘ఏనుగుల రక్షకురాలి’గా పేరుపొందిన సంగీత ఏనుగుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఏనుగమ్మ అయారు. ఆమె తీసిన 26 భాగాల డాక్యు సిరీస్ నేడు టీవీలో టెలికాస్ట్ కానుంది. డైనోసార్లు అంతరించి పోయాయంటే మన కాలంలో కాదు కనుక కారణాలు కచ్చితంగా తెలియవు కనుక ఏమిటో అనుకోవచ్చు. కాని ఆఫ్రికా ఏనుగులు ‘ప్రమాదం’లో ఉన్నాయని, ఆసియా ఏనుగులు ‘అంతరించిపోయే’ జాబితాలో ఉన్నాయని తెలిస్తే అందుకు కారణం వర్తమానంలో మనిషి తప్పిదం తప్ప, మనిషి నిర్దాక్షిణ్యం తప్ప, మనిషి బాధ్యతారాహిత్యం తప్ప మరొకటి కాదు. అంత పెద్ద జంతువును వేటాడి, వెంటాడి, చంపి, దాని దంతాల కోసం దారుణంగా నిర్మూలించాలని చూసే మనిషి దుర్మార్గానికి ఏమని పేరు పెట్టగలం? అడవుల్లో ఉన్న ఏనుగుల బాధ ఒకవైపు ఉంటే మనిషి తన మాలిమి కోసం వాటిని చేరదీసి, బంధించి వాటికి పెట్టే బాధ మరోవైపు. ఇవన్నీ ఎంతకాలం అని అడుగుతారు సంగీతా అయ్యర్. ‘నేనే గనుక ప్రధానిని అయితే ఈపాటికి దేశంలోని ఏనుగులన్నీ స్వేచ్ఛాగాలులు పీలుస్తూ ఉండేవి’ అంటారామె. బాల్యం నుంచి బంధం కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అళత్తూరులో పుట్టి పెరిగిన సంగీత చిన్నప్పుడు తన తాతయ్య, నానమ్మతో దగ్గరిలోని దేవస్థానానికి వెళ్లేవారు. అక్కడ పెద్దలు గుడి దర్శనంలో ఉంటే సంగీత దేవస్థానంలో కట్టేసి ఉన్న ఏనుగును చూస్తుండేవారు. ‘ఏనుగు కాళ్లకు ఉన్న పెద్ద పెద్ద సంకెళ్లను చూసి మా నానమ్మను అవి ఎందుకున్నాయి అని అడగడం మొదలుపెట్టాను. వాళ్లు ఏం చెప్పినా నేను సమాధాన పడలేదు. అప్పుడు మా నానమ్మ నా కాళ్లకు పట్టీలు వేసి ఇప్పుడు నీకూ ఉన్నాయిగా అని చెప్పింది. కాని ఏనుగులకు ఉన్న సంకెళ్లు రెండు కాళ్లను కదలకుండా చేసేలా ఉన్నాయి. నాకు అలా లేవు అని చెప్పాను. అప్పుడే ఏనుగుల గురించి నా మనసులో పడింది’ అంటారు సంగీత. కెనడా నుంచి తిరిగి వచ్చి కాలక్రమంలో సంగీత జర్నలిస్ట్, వీడియోగ్రాఫర్ అయ్యి కెనడాలో స్థిరపడ్డారు. కాని 2013లో భారత్కు వచ్చినప్పుడు కేరళలోని దేవస్థానాలు తిరుగుతున్నప్పుడు దారుణంగా గాయాలైనా సరే సంకెళ్లతో బంధించి ఉన్న ఏనుగులను చూసి చలించిపోయారు. ‘కేరళలో ఉత్సవాల కోసం మగ ఏనుగులను మాలిమి చేస్తారు. కాని అవి వయసులోకి వచ్చినప్పుడు మదంతో ప్రవర్తించకుండా ఉండేందుకు సంకెళ్లతో కట్టి దారుణంగా కడుపు మాడుస్తారు. జబ్బు చేసినా, చూపు మందగించినా ఉత్సవాల్లో నిలబెడతారు. దీని మీద గొంతెత్తాలని నిశ్చయించుకున్నాను’ అంటారు సంగీత. అప్పుడే ఆమె ‘గాడ్స్ ఇన్ షాకల్స్’ డాక్యుమెంటరీ తీశారు. మానవ హింస వల్ల ఆ తర్వాతి కాలంలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో ఏనుగులు ఎలా బాధ పడతాయో ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఆమె తీసిన ఈ డాక్యుమెంటరీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో స్క్రీన్ అయ్యింది. అంత గొప్పగా ఆమె సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లింది. మనిషే శత్రువు ‘ఏనుగులకు మనిషే శత్రువు. నిజానికి ఏనుగులు మనిషిని ఎంతో ప్రేమిస్తాయి. మనిషికి సాయం చేసేందుకు చూస్తాయి. గిరిజనులకు వాటితో పాటు ఎలా అడవిలో జీవించాలో తెలుసు. కాని నాగరీకులు అడవిగా ఉండాల్సిన దానిని వ్యవసాయంలోకి తెచ్చి ఏనుగులు తిరగాల్సిన భూమిని కుదిస్తున్నారు. వాటి నీటి ఆవాసాలను ఆక్రమిస్తున్నారు. అవి తిరుగాడే స్థలంలో పంటలు వేసి ఆ పంటల్ని అవి తినకుండా కరెంటు తీగలు ఏర్పాటు చేస్తున్నారు. కరెంట్ షాక్ కొట్టి ఏనుగులు చనిపోవడం ఎంత అన్యాయం’ అంటారు సంగీత. ‘ఎక్కడైతే ఏనుగులు తిరగాల్సిన భూమి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉందో ఆ భూమిని ప్రభుత్వం తిరిగి కొని ఏనుగులకు వదిలిపెడితే సగం సమస్య తీరుతుంది’ అంటారు సంగీత. ‘రైల్వే అధికారులు ఏనుగులు ఉండే ప్రాంతంలో రైళ్ల వేగం అదుపు చేస్తే, ట్రాన్స్పోర్ట్ అధికారులు రోడ్లపై వాహనాల వేగం అదుపు చేస్తే, విద్యుత్ అధికారులు కంచెలకు కరెంట్ లేకుండా అడ్డుకుంటే చాలా ఏనుగులు ప్రాణాలతో మిగులుతాయి’ అంటారు సంగీత. ఆసియన్ ఎలిఫెంట్స్ 101 సంగీత అయ్యర్ తీసిన తాజా డాక్యు సిరీస్ ‘ఏసియన్ ఎలిఫెంట్స్ 101’ మనిషి–ఏనుగు కలిసి చేయాల్సిన సహవాసం గురించి చర్చిస్తుంది. మనిషి బంధనాల్లో దారుణంగా దెబ్బ తిన్న ఏనుగుల కోసం, అడవి నుంచి బయటపడిన ఏనుగు పిల్లల కోసం అస్సాంలో, కర్నాటకలో, కేరళలో రిహాబిలేషన్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ వాటి బాగోగులను చూపిస్తుంది. అంతే కాదు వాటి బాగు కోసం పర్యావరణ కార్యకర్తలకు శాంక్చరీలను తెరిచే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మావటీలకు ఇవ్వాల్సిన శిక్షణ, ఏనుగుల కాళ్లకు అవసరమైన కేరింగ్, వాటి ఆహారం, స్నానం, ప్రాణాంతక జబ్బుల గురించి వైద్యం... వీటన్నింటినీ చర్చిస్తుంది. ఈ సిరీస్లోని కొన్ని భాగాలు నేడు జియో టీవీ ఇండియాలో ప్రసారం కానున్నాయి. ఏనుగుల సంరక్షణ కోసం ‘వాయిస్ ఆఫ్ ఏసియన్ ఎలిఫెంట్స్ సొసైటీ’ అనే సంస్థ నడుపుతున్న సంగీత ఏనుగులకు సిసలైన రక్షకురాలు. కాని ప్రజలు ఇలాంటి వారికి తోడు నిలిచినప్పుడే గజరాజు నిజంగా అడవికి రాజయ్యి మనుగడ సాగిస్తాడు. -
వాంతి చేసుకున్న పాము.. కడుపులో నుంచి..
ముంబై : ఇప్పటి వరకు మనం మన్ను తిన్న పాము అని వినుంటాం.. కాలం మారింది ఇప్పుడు ప్లాస్టిక్ తిన్న పాము అని వినాల్సి వస్తోంది. ప్లాస్టిక్ తిన్న ఓ పామును చావు నుంచి కాపాడాడు ఓ జంతు సంరక్షణా సిబ్బంది. ఈ సంఘటన మంగళవారం ముంబై నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మలద్ పటన్వాడీ ఏరియాకు చెందిన భగేష్ భగవత్ పాముల సంరక్షణపై అవగాహన కల్పిస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో చావల్లోని ఓ ఇంటి పైకప్పులో మూడు అడుగుల నాగుపాము ఉన్నట్లు అతనికి ఫోన్ వచ్చింది. భగేష్ భగవత్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఆ ఇంటి పైకప్పు చెక్కతో తయారుచేసింది కావటం మూలాన పాము చెక్కల మధ్య ఉన్న ఖాళీలలో తిరగటం మొదలుపెట్టింది. ఓ గంట శ్రమించిన తర్వాత నాగుపాము ఉన్న చోటును భగవత్ కనిపెట్టాడు. దాని తోక భాగాన్ని పట్టుకొని బయటకు లాక్కెళ్లాడు. ఆ సమయంలో పాము నోట్లో ఏదో ఉన్నట్లు అతడు గుర్తించాడు. పాము ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో దాని తోకను అలాగే పట్టుకొని కిందకు వదిలిపెట్టాడు. అంతే పాము కిందకు దిగిన వెంటనే వాంతి చేసుకోవటం ప్రారంభించింది. పాము నోట్లో నుంచి పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్లాస్టిక్ భూతం ఆఖరికి పాములను కూడా వదిలిపెట్టడం లేదని వారు వాపోయారు. భగేష్ భగవత్ మాట్లాడుతూ.. ‘‘పాము ప్లాస్టిక్ వ్యర్థాలను వాంతి చేసుకోవటంతో షాక్కు గురయ్యాను. పాముల సంరక్షణపై అవగాహన కల్పించటానికి ఆ దృశ్యాలను వీడియో తీసి ఉంచాము. అయితే అంత పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ ఎలా తిందో తెలియటం లేదు. అది కొద్దిసేపు అలాగే ఉంటే ఖచ్చితంగా చనిపోయేద’’ని అన్నాడు. -
ధోని... నా రక్షకుడు: కోహ్లి
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం విరాట్ కోహ్లి అత్యుత్తమ ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తన కెరీర్ ప్రారంభంలో అతను గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడు. నిలకడలేమితో చాలాసార్లు జట్టులో చోటు దక్కేది అనుమానంగానే మారేది. ఇలాంటి సమయంలో తనను కాపాడింది మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనియేనని ఈ స్టార్ బ్యాట్స్మన్ స్పష్టం చేశాడు. 2008లో వన్డే అరంగేట్రం చేసిన కోహ్లి ఇప్పటిదాకా తన కెరీర్ మొత్తం ధోని కెప్టెన్సీలోనే ఆడాడు. అయితే ప్రారంభ దశలో పేలవ ఫామ్తో జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి ఏర్పడినా తన విషయంలో ధోని ఆపద్భాందవుడి పాత్ర పోషించాడని కోహ్లి గుర్తుచేసుకున్నాడు. ‘కెరీర్ మొదట్లో ధోని నాకు గైడ్లా వ్యవహరించాడు. క్రికెటర్గా ఎదిగేందుకు చాలా అవకాశాలు ఇచ్చాడు. అనేకసార్లు జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి ఉన్నా కాపాడాడు. నిజానికి తన స్థానం భర్తీ చేయడమంటే చాలా రిస్క్తో కూడుకున్నదే’ అని కోహ్లి బీసీసీఐ.టీవీకిచ్చిన ఇంటర్వూ్యలో పేర్కొన్నాడు. భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ బాధ్యతలో పూర్తి స్థాయిలో ముందుకెళ్లేందుకు తగిన సమయం దొరికిందని కోహ్లి తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు సిరీస్ మధ్యలోనే టెస్టు కెప్టెన్సీ దక్కి ఉక్కిరిబిక్కిరి అయినా ఈసారి అలాంటి పరిస్థితి లేదని చెప్పాడు. ‘ఈసారి మాత్రం వన్డే, టి20ల్లో సిరీస్కు చాలా ముందుగానే కెప్టెన్ అయ్యాను. ఇది ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలో నాకు ఉపయోగపడుతుంది’ అని కోహ్లి చెప్పాడు.