breaking news
Repalle Mandal
-
కొడవళ్ల కార్ఖానా.. పేటేరు
సాక్షి, అమరావతి బ్యూరో/రేపల్లె: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే చాలు.. గుంటూరు జిల్లా తీర ప్రాంతమైన రేపల్లె మండలం పేటేరు వైపు అన్నదాతల చూపంతా. వరి కోతలకు అవసరమైన కొడవళ్ల తయారీలో ఆ ఊరికి మంచి పేరు ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడి కొడవళ్ల తయారీ ప్రాంతం.. శ్రామికనగర్గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో నిపుణులైన కార్మికులు రూపొందించే కొడవళ్లకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా మంచి డిమాండ్ ఉంటోంది. ఇక్కడ ఉన్న 40కు పైగా కార్ఖానాల్లో కొడవళ్ల తయారీపై ఆధారపడి దాదాపు 150 కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్నాయి. ఏడాది పొడవునా పనిచేస్తూ.. ఖరీఫ్, రబీ సీజన్లలో కోతలకు అవసరమైన కొడవళ్లను అందిస్తున్నాయి. చెన్నై, విశాఖ నుంచి దిగుమతి కొడవలి తయారీకి ప్రధాన ముడిసరుకు.. ఐరన్ బేళ్ల కట్లకు ఉపయోగించి పనికిరాని ఇనుముగా పడవేసే బేల్ బద్దలు. చెన్నై, విశాఖపట్నం, కాకినాడ పోర్టులు, విజయవాడ వంటి నగరాల నుంచి వీటిని కిలోల వంతున కొనుగోలు చేస్తారు. ముడి ఇనుము పేటేరుకు చేరే సరికి కిలో రూ.30 ధర పడుతోంది. కొలిమికి అవసరమైన బొగ్గులు, కొడవలి పిడికి అవసరమైన కలప ధరలు, రవాణా చార్జీలు అదనం. కొడవలికి నొక్కు పెడుతున్న కార్మికుడు వరికోత యంత్రాలతో తగ్గుతున్న గిరాకీ వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాల వాడకం కొడవళ్ల విక్రయాలపై ప్రభావం చూపుతోంది. వరికోత యంత్రాల రాకతో కూలీల అవసరం క్రమంగా తగ్గుతోంది. అందుకు తగినట్టుగానే కొడవళ్లకు డిమాండ్ పడిపోతోంది. నెలకు లక్షకుపైగా కొడవళ్లు ఆరు దశాబ్దాలుగా పేటేరు శ్రామికనగర్ కొడవళ్లను తయారుచేస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలోని జంపనికి చెందిన జేమ్స్ అలియాస్ జంపని జేమ్స్ ఇందుకు ఆద్యుడు. కొడవళ్ల తయారీని వృత్తిగా చేసుకొని ఆయన పేటేరులో స్థిరపడ్డారు. ఆయన నుంచి చందోలు సుబ్బారావు, తదితరులు నేర్చుకున్నారు. కొడవలి తయారీలో ముందుగా ఇనుప బద్దను కొలిమిలో కాల్చి కొడవలి ఆకారంలో మలుస్తారు. కోతకు తగినట్టుగా సానపట్టి నొక్కులు కొడతారు. చేతితో పట్టుకునేందుకు వీలుగా చెక్కపిడిని అమర్చుతారు. ఇలా మూడు దశల్లో కొడవలి సిద్ధమవుతుంది. ఒక్కో కొలిమిలో రోజుకు 200 వరకు కొడవళ్లు తయారవుతాయి. నెలకు కనీసం లక్షకు పైగా కొడవళ్లను ఇక్కడ సిద్ధం చేస్తుంటారు. మూడు కేటగిరీల్లో చేసే కొడవళ్లను నాణ్యత ప్రకారం.. ఒక్కోటి రూ.30, 60, 90కు విక్రయిస్తుంటారు. ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలి పెరుగుతున్న ముడి సరుకుల ధరలకు అనుగుణంగా కొడవళ్ల ధరలు పెరగడం లేదు. దీంతో ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదు. ప్రభుత్వం కొడవళ్ల తయారీని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలి. ముడిసరుకును రాయితీతో సరఫరా చేయాలి. – చందోలు సుబ్బారావు,శ్రామికనగర్ ముడిసరుకు సరఫరా చేయాలి రోజంతా శ్రమించినా కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ముడిసరుకు కొనుగోలు చేసేందుకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ సంస్థలతో ముడిసరుకును సరఫరా చేస్తే బాగుంటుంది. – పసులూరి బుజ్జి, శ్రామికనగర్ బ్యాంకు అధికారుల వైఖరితో జాప్యం కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసే రుణాల చెల్లింపులో బ్యాంకులు జాప్యం చేస్తున్నాయి. రుణాలను సత్వరం ఇస్తే బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. – చందోలు రవికుమార్, శ్రామికనగర్ -
'ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఫోన్ చేసింది'
గుంటూరు: అడవులదీవి యువతి జాస్మిన్ అనుమానాస్పద మృతితో రేపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జాస్మిన్ పై లైంగిక దాడికి ప్రయత్నించి, హత్య చేశారనే అనుమానంతో ఇద్దరిని జనం చితకబాదడంతో వారిలో వేముల శ్రీసాయి అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు జొన్నా పవన్కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జాస్మిన్, సాయి మృతదేహాలకు రేపల్లె ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయి బంధువులు సోమవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సాయి బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సాయిని గ్రామస్తులు, పోలీసులే చంపారని అతడి తల్లి ఆరోపించింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వారు వెనక్కు తగ్గక పోవడంతో రేపల్లె లో 144 సెక్షన్ ను విధించారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అదే విధంగా సాయి మృతికి సంబంధించి జాస్మిన్ సోదరుడు షాదుల్లా సహా మరికొంత మంది గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా జాస్మిన్ ను కాపాడాలని తాము ప్రయత్నించామని పవన్ తెలిపాడు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని తమకు జాస్మిన్ ఫోన్ చేసిందని, తాము వెళ్లేసరికి ఆమె శవమై పడివుందని వెల్లడించాడు. గ్రామస్తులంతా తమపై దాడి చేశారని, పోలీసులు చూస్తుండిపోయారని వాపోయాడు. కాగా సాయి మృతికి సంబంధించి జాస్మిన్ సోదరుడు షాదుల్లా సహా మరికొందరు గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.