breaking news
Redwood workers encounter
-
60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయండి
-
60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయండి
‘ఎన్కౌంటర్’పై సిట్కు హైకోర్టు ఆదేశం ⇒ మేం ఏర్పాటు చేసిన బృందంగానే పనిచేయాల్సి ఉంటుంది ⇒ దర్యాప్తుపై ఏ అధికారినీ సంప్రదించనక్కర్లేదు ⇒ అవసరముంటే తమ అనుమతి తీసుకోవాలని స్పష్టీకరణ ⇒ దర్యాప్తు పురోగతి సరైన దిశలో సాగడం లేదన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: తిరుపతి శేషాచలం అడవుల్లో చోటు చేసుకున్న ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఆదేశించింది. ఇది తాము ఏర్పాటు చేసిన బృందంగానే పనిచేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ‘సిట్’ తన దర్యాప్తును కొనసాగించి.. అవసరమైన వ్యక్తి, వ్యక్తులను చట్టప్రకారం విచారించి తగిన ఆధారాలు సేకరించవచ్చని, ఈ విషయంలో ఏ అధికారినీ సంప్రదించనక్కర్లేదంది. ఒకవేళ సంప్రదించదలచుకుంటే కోర్టు అనుమతితో చేయాలంది. ఎన్కౌంటర్కు సంబంధించిన కేసు డైరీని తక్షణమే సిట్కు నేతృత్వం వహిస్తున్న అధికారికి అందచేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. దర్యాప్తు పురోగతిని తెలుసుకునేందుకు వీలుగా కేసును శుక్రవారం విచారిస్తామని తెలిపింది. ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తుకోసం పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్, తమ భర్తల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ మునియమ్మాళ్ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.గతవారం ఆదేశించిన మేరకు ఈ కేసు డైరీ(సీడీ)ని అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ కోర్టు ముందుంచారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. కేసు దర్యాప్తు సరైన దిశలో సాగుతున్నట్లు అనిపించడం లేదంది. ఈ ఎన్కౌంటర్పై ఫిర్యాదు తీసుకునేముందు, ఆ తరువాత కేసు నమోదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం కోరడంపట్ల తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. అటువంటి అభిప్రాయం తీసుకోనక్కర్లేదని తేల్చిచెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 154 ప్రకారం ఇటువంటి వ్యవహారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) తన అభిప్రాయాన్ని తెలియచేయకూడదని పేర్కొంటూ.. ఇలాంటి కేసుల్లో పీపీ అభిప్రాయం తీసుకోవాలని చట్టంలో ఎక్కడా లేదని గుర్తుచేసింది. తన అభిప్రాయం తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఈ కేసులో నియమించుకోవడానికి వీల్లేదంటూ.. వేరే ఇతర స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించుకోవాలని, అవసరమైతే మరో ప్రాంతానికి చెందినవ్యక్తిని స్పెషల్ పీపీగా ఏర్పాటు చేసుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఐజీ నేతృత్వంలోని సిట్ను ఈ ఎన్కౌంటర్ కేసు దర్యాప్తుకోసం ఏర్పాటు చేయలేదని, దీనిని సమగ్ర దర్యాప్తుకోసం ఏర్పాటు చేసినట్లు ఉందని తెలిపింది. దర్యాప్తుపై సందేహాలుంటే వాటిని నివేదిక గా తమ దృష్టికి తీసుకురావాలని సిట్కు స్పష్టం చేసింది. సిట్ అధికారుల్లో కొందరి నిష్పాక్షికత, ఔచిత్యంపై పిటిషనర్లు సందేహాలు వ్యక్తం చేయగా.. అందుకు ఆధారాలను కౌంటర్ అఫిడవిట్లుగా శుక్రవారానికల్లా వేయాలని వారిని ఆదేశించింది. -
దర్యాప్తును మేమే పర్యవేక్షిస్తాం
ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై హైకోర్టు స్పష్టీకరణ ⇒ ఆరు మృతదేహాలకు రీ పోస్టుమార్టంపై నేడు నిర్ణయం ⇒ ఎన్కౌంటర్పై సిట్ ఏర్పాటు చేస్తున్నామన్న ప్రభుత్వం ⇒ సిట్లో ఎవరెవరు ఉండబోతున్నారో చెప్పాలన్న న్యాయమూర్తులు సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తును ఇకపై తామే పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంకా మార్చురీలో ఉన్న ఆరుగురు కూలీల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించే విషయంలో గురువారం తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. ఈలోగా ఇప్పటికే జరిగిన పోస్టుమార్టం, శవ పంచాయతీ నివేదికలను పరిశీలిస్తామని పేర్కొంది. ఆ నివేదికలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీ శశికుమార్ భార్య.. మునియమ్మాళ్ ఇచ్చిన ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు కూడా నమోదు చేశామని అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. అయితే అది ఎవరి నేతృత్వంలో ఏర్పాటు కాబోతోంది.. అందులో ఎవరెవరు ఉండబోతున్నారో తెలియజేయాలని అదనపు ఏజీకి హైకోర్టు స్పష్టం చేసింది. రీ పోస్టుమార్టానికి ఆదేశించండి రీ పోస్టుమార్టం కోసం మునియమ్మాళ్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, దీంతో కోర్టు ఇంకా అంతిమ సంస్కారాలు నిర్వహించని ఆరుగురి మృతదేహాలను మార్చురీలో భద్రపరచాలని ఆదేశించిందని బాలు చెప్పారు. రీ పోస్టుమార్టంకు తిరస్కరిస్తూ.. ఇందుకోసం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాలని సూచించిందని చెప్పారు. దీనిపై తాము అక్కడి ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేశామన్నారు. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించిన ధర్మాసనం, కేసు అక్కడ పెండింగ్లో ఉండగా, తాము రీ పోస్టుమార్టంకు ఆదేశాలు ఇవ్వలేమంది. దీనికి బాలు.. తాము అక్కడి కేసును ఉపసంహరించుకుంటామని, ఆ మేరకు రాతపూర్వక హామీ కూడా ఇస్తామని చెప్పారు. నిపుణుల కమిటీతో మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో ధర్మాసనం ఇంతకుముందు చేసిన పోస్టుమార్టం కాపీ గురించి ఆరా తీసింది. ఆ నివేదికలు చూడకుండా రీ పోస్టుమార్టంకు ఆదేశించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. పోస్టుమార్టం, శవ పంచనామా నివేదికలను తమ ముందుంచాలంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఎఫ్ఐఆర్ కాపీని పిటిషనర్లకు ఇవ్వాలని అదనపు ఏజీకి స్పష్టం చేసిన ధర్మాసనం.. మద్రాస్ హైకోర్టులో ఉన్న కేసును ఈ రోజే (బుధవారం) ఉపసంహరించుకోవాలని, దానిపై ఆ హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులను గురువారం తమ ముందుంచాలని బాలుకు తెలిపింది. అలా అయితేనే గురువారం కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. రంగంలోకి తమిళ న్యాయవాదులు... మునియమ్మాళ్ తరఫున వాదనలు వినిపించేందుకు చెన్నై నుంచి కె.బాలు సహా ముగ్గురు న్యాయవాదులు బుధవారం హైకోర్టుకు వచ్చారు. ఆ రాష్ట్ర పత్రికా విలేకరులు కూడా కోర్టుకు వచ్చి వాదనలు విన్నారు. కన్నీరుపెట్టిన మునియమ్మాళ్ శేషాచలం ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మునియమ్మాళ్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను హైకోర్టు ఈ కేసులో పిటిషనర్గా చేర్చింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. కేసు విచారణ ప్రారంభం కాగానే ధర్మాసనం ఆదేశాల మేరకు ఫిర్యాదుదారు మునియమ్మాళ్ కోర్టుకు హాజరయ్యారని ఆమె తరఫు న్యాయవాది కె.బాలు తెలిపారు. దీంతో ముందుకు వచ్చిన ఆమె కన్నీరుపెట్టుకున్నారు. ఆమెను ఊరడించాలని న్యాయవాదులకు సూచించిన ధర్మాసనం.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు గురించి ఆరా తీసింది. ఈ క్రమంలో 161 సెక్షన్ (సాక్షుల సాక్ష్యాల నమోదు) కింద స్టేట్మెంట్లు రికార్డ్ చేశారా..? అని ధర్మాసనం అదనపు ఏజీని ప్రశ్నించింది. స్టేట్మెంట్లు ఇచ్చేందుకు వెళితే పోలీసులు అడ్డుకున్నారని పిటిషనర్ చంద్రశేఖర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ తెలిపారు. దీంతో ధర్మాసనం.. ఇకపై తామే ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. -
ఎన్కౌంటర్లపై నివేదికలివ్వండి: కేంద్రం
న్యూఢిల్లీ: తెలంగాణలో ఐదుగురు ఉగ్రవాదుల కాల్చివేత, ఆంధ్రప్రదేశ్లో 20 మంది ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ సంఘటనలపై కేంద్రం ఆరా తీసింది. ఇవి జరిగిన తీరును ఇప్పటికే తెలుసుకున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్ పూర్తి వివరాలతో నివేదికలు పంపాలని రెండు రాష్ట్రాల డీజీపీలను ఆదేశించిన ట్టు సమాచారం.